Begin typing your search above and press return to search.

పాద‌యాత్ర‌లు - ల‌క్ష్య‌సాధ‌న యాత్ర‌లు !

By:  Tupaki Desk   |   9 Jan 2019 2:30 PM GMT
పాద‌యాత్ర‌లు - ల‌క్ష్య‌సాధ‌న యాత్ర‌లు !
X
ఇచ్ఛాపురంలో ముగిసిన జగన్ పాదయాత్ర సరికొత్త రికార్డులను సృష్టించింది. దక్షిణ భారతదేశ రాజకీయ పాదయాత్రల్లో ఏక వ్యక్తి కేంద్రంగా సాగిన వాటిలో ఇదే అత్యంత దూరం సాగిన యాత్రం. కాగా... దేశంలో ఇప్పటి వరకు సాగిన సుదీర్ఘ(ఎక్కువ కాలం) రాజకీయ పాదయాత్రల్లో జగన్‌దే రికార్డు.

జగన్ పాదయాత్ర 2017 నవంబరు 6న మొదలై 2019 జనవరి 9 వరకు సాగింది. ఈ కాలంలో ఆయన మొత్తం 341 రోజులు పాదయాత్ర చేశారు. 3648 కిలోమీటర్లు నడిచారు. పాదయాత్రలో మొత్తం 134 అసెంబ్లీ నియోజకవర్గాలు కవర్ చేశారు.

నిజానికి తెలుగు నేల రాజకీయ పాదయాత్రలకు పెట్టిందిపేరు. ఇక్కడ గతంలో పాదయాత్రలు చేసిన నేతలు అధికారం అందుకున్న సందర్భాలున్నాయి. ఇంతకుముందు జగన్ తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి - టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ముందు పాదయాత్రలు చేసి అధికారం అందుకున్నారు. దీంతో జగన్ కూడా అదే రకమైన విజయం అందుకుంటారని భావిస్తున్నారు.

* పాదయాత్రలకు ఆద్యుడు మహాత్మాగాంధీ

భారతదేశంలో ఆధునిక పాదయాత్రలకు ఆద్యుడు మహాత్మాగాంధీ. 1930లో ఆయన ఉప్పు సత్యాగ్రహం పేరిట నిర్వహించిన పాదయాత్ర భారత స్వాతంత్ర్య పోరాటంలో కీలక మైలురాయి. ఆ తరువాత ఆయన 1933-34లో అంటరానితనానికి వ్యతిరేకంగా మరోసారి దేశవ్యాప్త పాదయాత్ర చేశారు.

* తెలంగాణ నుంచి వినోభాభావే భూదానోద్యమ పాదయాత్ర

అనంతరం 1951లో వినోభా భావే భూదాన్ ఉద్యమంలో భాగంగా తెలంగాణ ప్రాంతం నుంచి మొదలుపెట్టి బిహార్‌ లోని బోధ్‌ గయ వరకు నడిచారు.

* పాదయాత్ర చేసిన ప్రధాని ఆయనొక్కరే..

భారతదేశానికి ప్రధానిగా పనిచేసిన చంద్రశేఖర్ కూడా ఒకప్పుడు పాదయాత్ర చేసినవారే. ఆయనది కూడా జగన్ మాదిరిగానే సుదూర పాదయాత్ర. 1983లో కాంగ్రెస్ పార్టీలో ఉన్న చంద్రశేఖర్ ప్రజల కష్టసుఖాలు - దేశంలో పరిస్థితులు తెలుసుకునేందుకు ఆరు నెలల పాటు 4,260 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. ఈ క్రమంలో ఆయన కన్యాకుమారి నుంచి దిల్లీ వరకు నడిచారు.

* 2003లో వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర

ఇక తెలుగు నేలపై పాదయాత్రల విషయానికొస్తే స్వాతంత్ర్యం తరువాత కాలంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పేరు ప్రధానంగా వినిపిస్తుంది. వివిధ పార్టీల నాయకులు - ప్రజాసంఘాలవారు - ఉద్యమకారులు వేర్వేరు కారణాలతో పాదయాత్రలు చేసినప్పటికీ రాజశేఖరరెడ్డి చేసిన పాదయాత్ర వాటన్నికంటే భిన్నమైనది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2003లో ఆయన ఈ యాత్ర చేపట్టారు. యాత్ర పూర్తయిన కొన్నాళ్లకే జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో పాటు ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. అది మొదలు పాదయాత్రలపై నేతల్లో నమ్మకం పెరిగిపోయింది.

* చంద్రబాబు పాదయాత్ర

అనంతరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజన కాలంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు 2013లో పాదయాత్ర చేశారు. 60 ఏళ్లు దాటిన వయసులో పాదయాత్ర చేసి చంద్రబాబు గుర్తింపు పొందారు. పాదయాత్ర తరువాత 2014లో ఆంధ్రప్రదేశ్‌లో ఆయన పార్టీకి అధికారం దక్కడం, ఆయన ముఖ్యమంత్రి కావడం తెలిసిందే.

* షర్మిల పాదయాత్ర

అదే సమయంలో వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె - జగన్ సోదరి షర్మిల.. 2012 అక్టోబరు 18న ప్రారంభించి 2013 జులై 29 వరకు 230 రోజుల పాటు సుమారు 3 వేల కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. ఆమె పాదయాత్ర జగన్ విజయం కోసమే చేశారు.

* సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం పాదయాత్ర

తెలంగాణలో 2016-17లో సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం సహా మరికొందరు నాయకులు కూడా సుమారు 4 వేల కిలోమీటర్ల మేర మహాజన పాదయాత్ర చేశారు.

ఎవరెంత దూరం నడిచారు

ప్రజాప్రస్థానం- రాజశేఖరరెడ్డి - 1468 కిలోమీటర్లు
వస్తున్నా మీ కోసం - చంద్రబాబు - 2340 కి.మీ.
మరో ప్రజాప్రస్థానం - షర్మిల - 3112 కి.మీ.
ప్రజా సంకల్పయాత్ర - జగన్ మోహనరెడ్డి - 3648 కిలోమీటర్లు