Begin typing your search above and press return to search.

ముస్లింల‌కు నిజాం కంటే కేసీఆరే ఎక్కువ‌..ఎలాగంటే..

By:  Tupaki Desk   |   1 April 2018 4:40 AM GMT
ముస్లింల‌కు నిజాం కంటే కేసీఆరే ఎక్కువ‌..ఎలాగంటే..
X
తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ రావు గురించి ఉప ముఖ్యమంత్రి మహమూద్‌ అలీ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం పంచుకున్నారు. స‌హ‌జంగా హిందుత్వ‌వాదుల నుంచి కేసీఆర్‌ కు వ‌చ్చే ఆరోప‌ణ‌లను ప‌రోక్షంగా ఉప‌ముఖ్య‌మంత్రి చెప్పిన‌ట్లుంద‌ని ప‌లువురు వ్యాఖ్యానిస్తున్నారు. కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణ‌యాలు నిజాం ప్ర‌భువును మించిపోయాయ‌ని - దేశంలో మ‌రే పాల‌కుడు ఇలాంటి ముస్లింల కోణంలో నిర్ణ‌యాలు తీసుకోలేద‌ని బీజేపీ స‌హా ప‌లువురు విమ‌ర్శిస్తుంటే...స‌రిగ్గా అవే లెక్క‌ల‌ను ఆయ‌న వివ‌రించారు. ముస్లింలు నిజాం ప్రభువు కంటే ఎక్కువగా కేసీఆర్‌ ను గుర్తు పెట్టుకుంటారని ఉప‌ముఖ్య‌మంత్రి పేర్కొన్నారు. నిజాం మీద కంటే కూడా ముస్లింలకు కేసీఆర్‌ పైనే ఎక్కువ విశ్వాసం ఉందని ఆయ‌న చెప్పారు.

కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం 2014 నుంచి 2018 వరకు సాధించిన విజయాలు - మైలురాళ్లు - పథకాల వివరాలతో రూపొందించిన బుక్‌ లెట్‌ ను - ఉర్దూ జర్నలిస్టుల డైరీని డిప్యూటీ సీఎం ఓ హోటల్‌ లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మహమూద్ అలీ మాట్లాడుతూ... మైనారిటీల సంక్షేమానికి ఆరు దశాబ్దాలుగా దేశం - రాష్ట్రంలో ఏ ప్రభుత్వాలు చేయనివిధంగా సంక్షేమ - అభివృద్ధి కార్యక్రమాలు అమలుపర్చినందుకే ఆయనపై విశ్వాసం పెరిగిందని తెలిపారు. బీహార్‌ లో రెండుకోట్ల ముస్లిం జనాభా ఉన్నా అక్కడి ప్రభుత్వం మైనారిటీల సంక్షేమానికి రూ.300 కోట్లకు మించి బడ్జెట్‌ను కేటాయించలేదని - అదే తెలంగాణలో 70 లక్షల ముస్లిం జనాభా ఉండగా రెండువేల కోట్లు కేటాయించారని - ముస్లింలకు గుర్తింపునిచ్చిన ఘనత టీఆర్‌ ఎస్ సర్కార్‌ దేనని చెప్పారు. పశ్చిమబెంగాల్ - అసోం రాష్ర్టాల్లో 35 శాతం నుంచి 40 శాతం ముస్లిం జనాభా ఉన్నా.. అక్కడ డిప్యూటీ సీఎం పదవి ఇప్పటివరకు ముస్లిం అభ్యర్థికి కేటాయించలేదని ఉమ‌ప‌ముఖ్య‌మంత్రి మ‌హ‌మూద్ అలీ పేర్కొన్నారు. తెలంగాణ ముస్లింలలో కేసీఆర్ వచ్చాక కొత్త ఉత్సాహం వచ్చిందన్నారు. టీఆర్‌ ఎస్ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రం శాంతియుతంగా ఉంద‌ని మహమూద్‌ అలీ పేర్కొన్నారు.