Begin typing your search above and press return to search.

అసంతృప్తి జగన్ పై కాదు.. అధికారులపైనే: వైసీపీ ఎమ్మెల్యే

By:  Tupaki Desk   |   9 Jun 2020 3:37 PM GMT
అసంతృప్తి జగన్ పై కాదు.. అధికారులపైనే: వైసీపీ ఎమ్మెల్యే
X
అధికారుల తీరుపై వైసీపీ ఎమ్మెల్యే ఎదురుతిరిగారు. పనులు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలంటూ తాజాగా డిమాండ్ చేశారు.. మంచినీటి పథకాల నిర్వహణ బిల్లులు ఏడాది నుంచి చెల్లించకుండా తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రకాశం జిల్లా జడ్పీ సీఈవో కైలాష్ గిరీశ్వర్ పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని వైసీపీకి చెందిన కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి డిమాండ్ చేశారు. తన నియోజకవర్గ సమస్యలపై అధికారులను ప్రశ్నిస్తే ప్రతిపక్షాలు, కొన్ని మీడియా సంస్థలు రాజకీయం చేయడం.. దుష్ర్పచారం చేయడం దిగజారుడుతనమని ఆయన మండిపడ్డారు. ఈ మేరకు కందకూరులోని తన కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మహీధర్ రెడ్డి వ్యాఖ్యానించారు.

ఎన్నికలకు ముందు గత ప్రభుత్వంలో సీఈవోగా పనిచేసిన ఆయన అనేక అక్రమాలకు పాల్పడ్డారని మహీధర్ రెడ్డి ఆరోపించారు. ఆ అధికారికి క్లీన్ చిట్ ఇచ్చిన చరిత్ర ఈ జడ్పీసీఈవోదని మహీధర్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు.

ప్రభుత్వం 100 కోట్లు మంజూరు చేసినా నీరు సరఫరా చేయకుండా కాంట్రాక్టర్లకు కొమ్ముకాస్తున్నారంటూ ఆ వైసీపీ ఎమ్మెల్యే ఆగ్రహించారు. తన నియోజకవర్గానికి ఒక్క బిల్లు కూడా పాస్ కాకపోవడంపై సమాధానం చెప్పాలని ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి నిలదీశారు.

తాగునీటిసమీక్షలు చేయకుండా మంజినీటి సరఫరా డబ్బులు ఇవ్వకుండా.. ప్రభుత్వం 100 కోట్లు ఇచ్చినా బిల్లులు పాస్ చేయకుండా వ్యవహరిస్తున్న జడ్పీ సీఈవోపై ఎమ్మెల్యే మండిపడ్డారు. కాంట్రాక్టర్లు పనిచేయని వారికే పనులు ఇస్తున్నారని.. సమస్యలు పరిష్కరించడం లేదని విమర్శించారు.

సోమశిల జలాశయం నుంచి కందుకూరులోని 90 గ్రామాల ప్రజలకు తాగునీటి ప్రాజెక్టును పనిచేయని కాంట్రాక్టర్లకు అప్పగించారని మహీధర్ రెడ్డి వాపోయారు. ఎండాకాలం ముగిసినా వాళ్లు పనిచేయలేదని.. ప్రజలకు ట్రాక్టర్లతో నీళ్లు అందిస్తున్నారని అధికారులపై నిప్పులు చెరిగారు. కరోనా టైంలో ట్రాక్టర్ల వద్ద జనాలు నీళ్లు పట్టుకుంటారా అని నిలదీశారు.

వీడియో కాన్ఫరెన్సులంటూ తప్పించుకుంటున్నారని.. పనులు చేయడం లేదని.. ఈ విధానాలను సరిచేయకపోతే ఊరుకోం అంటూ ఎమ్మెల్యే హెచ్చరించారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తూ నిలదీస్తే ప్రభుత్వ వ్యతిరేక చర్యగా మమ్మల్ని చిత్రీకరిస్తున్నారని మీడియాపై మహీధర్ రెడ్డి మండిపడ్డారు. సీఎం జగన్ తమ ప్రాజెక్టులకు కోట్లాది రూపాయాల నిధులు కేటాయించారని.. సీఎంపై తమకు అసంతృప్తి అస్సలు లేదని.. నియోజకవర్గ అభివృద్ధి కోసమే ఇదంతా చేస్తున్నామని ఆయన క్లారిటీ ఇచ్చారు.