Begin typing your search above and press return to search.

అక్కడ కిలో కందిపప్పు రూ.150

By:  Tupaki Desk   |   25 Oct 2015 9:19 AM GMT
అక్కడ కిలో కందిపప్పు రూ.150
X
కందిపప్పు కాలిపోతోంది. కొనాలంటే షాక్ తగిలే పరిస్థితి. నిన్నమొన్నటివరకూ కిలో కందిపప్పు రూ.150 వరకు ఉంటే ఇప్పుడు ఏకంగా రూ.220 వరకూ పలుకుతుంది. అది కూడా రెండు రకాల మిక్సింగ్. నాణ్యమైన కందిపప్పు బయటకే రాని పరిస్థితి.

నిజానికి కందిపప్పు ధరలు ఆకాశాన్ని అంటటం ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. అన్ని చోట్ల ఉన్నదే. అయితే.. మహారాష్ట్రలో మాత్రం స్టోరీ వేరుగా ఉంది. మొన్నటి వరకూ కిలో కందిపప్పు రూ.220 పలికితే ఇప్పుడు మాత్రం రూ.150లకే అమ్ముతున్నారు. ఇంతలో ఏమైంది? అలా ఎలా సాధ్యమైందన్న సందేహం వచ్చిందా? అక్కడికే వస్తున్నాం.

మార్కెట్ లో మంటలు పుట్టిస్తున్న కందిపప్పు ధరల్ని నేల మీదకు తీసుకురావటానికి అక్కడి సర్కారు నడుం బిగించింది. అక్రమ వ్యాపారులు నిల్వ ఉంచిన కందిపప్పుపై భారీగా దాడులు జరిపారు. ఎంతలా అంటే.. కేవలం ఐదు రోజుల్లో ఆ రాష్ట్రంలోని 46,397 మెట్రిక్ టన్నుల అక్రమ కందిపప్పు నిల్వల్ని స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు.. అక్రమ నిల్వల సమాచారం దొరికితే చాలు.. వారికి సినిమా చూపిస్తున్నారు.

దీంతో.. ఒక్కసారిగా పరిస్థితుల్లో మార్పు వచ్చేసింది. మార్కెట్లోకి రాకుండా.. అక్రమంగా నిల్వ ఉంచే కందిపప్పు మీద ప్రభుత్వం దాడులు తీవ్రతరం చేయటంతో అక్రమార్కుల గుండెల్లో వణుకు పుట్టింది. అంతేకాదు.. ఆకాశాన్ని అంటిన కందిపప్పు ధర కాస్తా కిందకు వచ్చేసింది. ఇప్పుడా రాష్ట్రంలో కేజీ రూ.150కు వచ్చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం మహారాష్ట్ర తీరులో అక్రమ నిల్వలపై దృష్టి సారిస్తే.. కొండకెక్కిన కందిపప్పు కిందకు దిగే అవకాశం ఉంది. మరి.. జనాల ఈతి బాధలు తప్పించేందుకు చంద్రుళ్లు ఇద్దరూ ప్రయత్నిస్తారా..?