Begin typing your search above and press return to search.

చైనా కంపెనీల‌కు షాక్‌: స‌ంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్న మ‌హారాష్ట్ర‌

By:  Tupaki Desk   |   22 Jun 2020 5:00 PM GMT
చైనా కంపెనీల‌కు షాక్‌: స‌ంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్న మ‌హారాష్ట్ర‌
X
దేశంలో బ్యాన్ చైనా నినాదం ఉద్య‌మంలా సాగుతోంది. చైనా వ‌స్తువులు, ఉత్ప‌త్తులు, ప‌రిక‌రాలు నిషేధించాల‌ని ఉద్య‌మం కొన‌సాగుతోంది. ఈ క్ర‌మంలోనే చైనా ఉత్ప‌త్తుల‌కు, సేవ‌ల‌కు ఆటంకం ఏర్ప‌డుతోంది. తాజాగా మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. చైనాకు కంపెనీలకు షాకిచ్చేలా నిర్ణ‌యం ఉంది. దాదాపు 5 వేల కోట్ల రూపాయలు విలువ చేసే ఒప్పందాలను అక‌స్మాత్తుగా మ‌హారాష్ట్ర నిలిపేసింది.

జూన్ 15వ తేదీన మ్యాగ్నటిక్ మహారాష్ట్ర 2.0 పెట్టుబడుల సదస్సులో చైనీస్ అంబాసిడర్ సున్ వీడాంగ్‌తో మహారాష్ట్ర ప్ర‌భుత్వం మూడు ఒప్పందాలను కుదుర్చుకుంది. పుణేలోని తాలేగావ్‌లో ఆటో మొబైల్ ప్లాంటును ఏర్పాటు చేయడానికి 3,770 కోట్ల రూపాయలతో గ్రేట్ వాల్ మోటార్స్, మహా వికాస్ అఘాడి ప్రభుత్వానికి మధ్య కుదిరిన ఎంఓయూ, ఫోటాన్ తో కలిసి పీఎంఐ ఎలక్ట్రో మొబిలిటీ స్థాపించాలనుకున్న వెయ్యి కోట్ల రూపాయలు విలువచేసే ప్లాంటు ఒప్పందాన్ని, తాలేగావ్ లో హెంగ్లీ ఇంజనీరింగ్ విస్తరణ కోసం కేటాయించిన 250 కోట్ల రూపాయలు పెట్టుబడులను మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం పక్కన పెట్టింది.

దేశవ్యాప్తంగా చైనా వ్య‌తిరేక ఉద్యమం ఉధృతమవుతున్న నేపథ్యంలో గ్రేట్ వాల్ మోటార్స్, ఫోటాన్, హెంగ్లీ ఇంజనీరింగ్ కంపెనీలతో కుదుర్చుకున్న ఒప్పందాలను పున:పరిశీలించుకోవాలని ముఖ్య‌మంత్రి ఉద్ధవ్ ఠాక్రే నిర్ణయించారు. ఇప్పటికే హరియాణా సర్కారు చైనా కంపెనీలతో కుదుర్చుకున్న రెండు విద్యుత్తు ఒప్పందాలను రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే.