Begin typing your search above and press return to search.

ర‌ద్దు దిశ‌గా మ‌హారాష్ట్ర అసెంబ్లీ!

By:  Tupaki Desk   |   22 Jun 2022 7:38 AM GMT
ర‌ద్దు దిశ‌గా మ‌హారాష్ట్ర అసెంబ్లీ!
X
మ‌హారాష్ట్ర‌లో రాజకీయ సంక్షోభం కీలక మలుపులు తిరుగుతోంది. శివ‌సేన సంకీర్ణ స‌ర్కార్ బీజేపీని అధికారానికి దూరంగా ఉంచ‌డానికి అసెంబ్లీ రద్దుకు వెనుకాడ‌టం లేద‌ని తెలుస్తోంది. అసెంబ్లీని రద్దు చేసే యోచనలో ముఖ్య‌మంత్రి ఉద్దవ్ థాకరే ఉన్నారని తెలుస్తోంది. జూన్ 22 బుధ‌వారం మ‌ధ్యాహ్నం మహారాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. కేబినెట్ సమావేశంలో అసెంబ్లీని రద్దు చేయాలని తీర్మానం చేసి గవర్నర్ కు పంపిస్తార‌ని తెలుస్తోంది. సీఎం పదవికి ఉద్ధ‌వ్ థాక‌రే రాజీనామా చేస్తారని తెలుస్తోంది. మ‌రోవైపు మహారాష్ట్ర రాజకీయ పరిణామాలపై సంచలన ట్వీట్ చేశారు శివసేన సీనియర్ ఎంపీ, సామ్నా ప‌త్రిక ఎడిట‌ర్ సంజయ్ రౌత్. అసెంబ్లీ రద్దు దిశగా అడుగులు వేస్తున్నామ‌ని ఆయ‌న ట్వీట్ చేయ‌డంతో మ‌హారాష్ట్ర రాజ‌కీయాలు ఒక్క‌సారిగా వేడెక్కాయి.

రెండు రోజులుగా మ‌హారాష్ట్ర‌లో కీల‌క ప‌రిణామాలు చోటు చేసుకున్న సంగ‌తి తెలిసిందే. శివసేనకు చెందిన సీనియర్ మంత్రి, శాస‌నాస‌భ ప‌క్ష నేత‌ ఏక్ నాథ్ షిండే ఉద్దవ్ థాకరేపై తిరుగుబాటు చేశారు. తనకు మద్దతుగా ఉన్న 22 మంది ఎమ్మెల్యేలతో ఆయన గుజ‌రాత్ లోని సూర‌త్ లో క్యాంప్ ఏర్పాటు చేశారు. మ‌రో 8 మంది స్వతంత్ర ఎమ్మెల్యేలు కూడా ఏక్ నాథ్ షిండే తో ఉన్నార‌ని చెబుతున్నారు.

తాజాగా ఇప్పుడు ఏక‌నాథ్ షిండే శిబిరంలో 34 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని అంటున్నారు. అందులో ఏకంగా నలుగురు మంత్రులు కూడా ఉన్నారని చెబుతున్నారు. మహారాష్ట్ర అసెంబ్లీలో శివసేనకు 55 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అందులో సగానికి పైగా ఎమ్మెల్యేలు ఏక్ నాథ్ షిండేతో ఉండటంతో మహారాష్ట్రలోని సంకీర్ణ ప్రభుత్వం సంక్షోభంలో పడింది. షిండే వర్గం ఎమ్మెల్యేలు బీజేపీతో ప్ర‌భుత్వ ఏర్పాటుకు మొగ్గుచూపుతున్నార‌ని స‌మాచారం.

మ‌రోవైపు తిరుగుబాటు నేత ఏక‌నాథ్ షిండేతో చర్చలకు ఉద్దవ్ థాకరే ఒక మంత్రిని, మ‌రో సీనియ‌ర్ నేత‌ను పంపారు . అయితే ఏక‌నాథ్ షిండే శివ‌సేన‌తో క‌లిసి న‌డ‌వ‌డానికి తిర‌స్క‌రించారు. తాము వేరే పార్టీ ఏర్పాటు చేసుకుంటామ‌ని తేల్చిచెప్పినట్టు స‌మాచారం. బీజేపీతో ప్ర‌భుత్వ ఏర్పాటుకు ఉద్ధ‌వ్ థాక‌రే ముందుకొస్తే తాము శివ‌సేన‌తోనే ఉంటామ‌ని చెప్పిన‌ట్టు తెలుస్తోంది. ఏక‌నాథ్ షిండే తో ఉన్న ఎమ్మెల్యేలంతా బీజేపీతో క‌లిసి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయాల‌ని కోరుతున్నార‌ని చెబుతున్నారు.

కాగా మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 288 స్థానాలున్నాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న మహా వికాస్ అగాఢీ కూటమికి 169 ఎమ్మెల్యేల బలం ఉంది. శివసేన 56, ఎన్సీపీ 53, కాంగ్రెస్ 44 మంది సభ్యులున్నారు. ఇతర చిన్న పార్టీలకు చెందిన 8 మంది ఎమ్మెల్యేలతో పాటు 8 మంది స్వతంత్ర ఎమ్మెల్యేలు ఉద్దవ్ థాకర్ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారు.

బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకు 113 మంది సభ్యులున్నారు.106 మంది బీజేపీ ఎమ్మెల్యేలు ఉండగా.. ఆర్ఎస్పీ 1, జేఎస్ఎస్ 1, ఐదుగురు ఇండిపెండెంట్లు ఉన్నారు. మ‌రోవైపు ఎంఐఎంకు ఇద్దరు, సీపీఐ, ఎంఎన్ఎస్, స్వాభిమాన్ పక్ష్ పార్టీలకు ఒక్కో ఎమ్మెల్యే ఉన్నారు.