Begin typing your search above and press return to search.

గ‌వ‌ర్న‌ర్ టీఆర్ ఎస్ బ్రాండ్‌ అంబాసిడ‌ర్‌

By:  Tupaki Desk   |   24 Jan 2016 11:04 AM GMT
గ‌వ‌ర్న‌ర్ టీఆర్ ఎస్ బ్రాండ్‌ అంబాసిడ‌ర్‌
X
రాష్ట్ర గవర్నర్ ఈఎస్ ఎల్ న‌ర‌సింహన్ మ‌రోమారు వివాదాల్లో ప‌డ్డారు. గ్రేట‌ర్ హైద‌రాబాద్ ఎన్నిక‌ల నేప‌థ్యంలో పార్టీల మ‌ధ్య విమ‌ర్శ‌ల జోరు పెరుగుతున్న నేప‌థ్యంలో ప్ర‌తి అంశమూ ముఖ్యాంశ‌మే అవుతోంది. ఈ క్ర‌మంలో తెర‌మీద‌కు గ‌వ‌ర్న‌ర్‌, ఆయ‌న విధులు వ‌చ్చాయి. ఈ విమ‌ర్శ‌ల ప‌ర్వంలో టీపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌ కుమార్‌, ఏఐసీసీ అధికార ప్రతినిధి మధుయాష్కీగౌడ్‌ విలేకరులతో మాట్లాడుతూ గ‌వ‌ర్న‌ర్ టీఆర్ ఎస్ బ్రాండ్‌ అంబాసిడ‌ర్ చేసేశారు!

గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వ ప‌థ‌క‌మైన మిషన్‌ భగీరథ అద్బుతమని గవర్నర్‌ చెప్పడం ఒక వింత అని కాంగ్రెస్ నేత‌లు ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న ప్రజా వ్యతిరేక, అవినీతి అంశాలపై కూడా గవర్నర్‌ దృష్టి సారించి క్షేత్రస్థాయి పరిశీలన చేస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు. రాజ్యాంగపరమైన అలాంటి విధులను నిర్వహించడం మానేసి టీఆర్‌ ఎస్‌ ప్రభుత్వం బ్రాండ్‌ అంబాసిడర్‌ గా గ‌వ‌ర్న‌ర్‌ పని చేస్తున్నారని వారు మండిప‌డ్డారు.

మ‌రోవైపు గ్రేటర్‌ ఎన్నికల సంద‌ర్భంగా టీఆర్‌ ఎస్ ఇస్తున్న హామీలపై నేత‌లు విరుచుకుప‌డ్డారు. టీఆర్ ఎస్ హామీలు నెరవేర్చాలంటే 500 ఏళ్లు పడుతుందని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ కాదు క‌దా..కేటీఆర్‌ ముని మనుమడు వచ్చినా వాటిని పూర్తి చేయలేరని పంచ్ వేశారు. టీఆర్‌ ఎస్‌ నాయకులు చెబుతున్న అబద్దాలు మూసి నది కంపును మించిపోయి గ్రేటర్‌ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయని విమర్శించారు. నగరంలో వైఫై ఉచితంగా అమలు చేస్తామని ఇప్ప‌టికే హామీ ఇచ్చార‌ని అయిన‌ప్ప‌టికీ ఇంతకాలం ఎందుకు చేయలేకపోయారని ప్రశ్నించారు. ఐటీఐఆర్‌ లాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టును తెచ్చిన ఘనత కాంగ్రెస్‌ పాలకులదైతే ఒక్క కొత్త ఉద్యోగం కూడా తేలేని కేటీఆర్‌ అబద్దాలతో కాలం గడుపుతున్నారని దుయ్యబట్టారు. పదివేల కోట్ల రూపాయలతో మల్టీ లెవెల్‌ ఫ్లై ఓవర్లు కడుతామని చెప్పారు. ఎక్కడెక్కడ పనులు మొదలయ్యాయో చెప్పాలని డిమాండ్‌ చేశారు. కరెంట్‌ 24 గంటలు సరఫరా చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న టీఆర్‌ ఎస్‌ పాలకులు ఒక్క యూనిట్‌ కూడా కొత్తగా ఉత్పత్తి చేయకుండా ఎక్కడి నుంచి కరెంట్‌ తెచ్చారని ప్రశ్నించారు.