Begin typing your search above and press return to search.

2200 ఏళ్ల నాటి శాసనంలోని ఐదు అక్షరాల అర్థమేమిటి?

By:  Tupaki Desk   |   9 Aug 2020 1:30 PM GMT
2200 ఏళ్ల నాటి శాసనంలోని ఐదు అక్షరాల అర్థమేమిటి?
X
తాజాగా ఒక పురాతన శాసనాన్ని గర్తించారు. శాసనం అన్నంతనే పదాల సమూహంగా భావిస్తారు. ఇది అలాంటిది కాదు. కేవలం ఐదు అక్షరాల పదం మాత్రమే. ఇంతకీ ఇదెప్పటిదో తెలుసా? 2200 ఏళ్ల నాటిది. అంటే.. క్రీస్తు పూర్వం 2 శతాబ్దమన్న మాట. ఇంతకాలం ఒక గుండు మీద అనామకంగా ఉన్న ఈ పదానికి అర్థం ఏమై ఉంటుందా? అన్నదిప్పుడు ఆసక్తికరంగా మారింది.

తెలుగు నేల మీద దొరికిన అత్యంత ప్రాచీనమైన లఘు శాసనంగా చెప్పాలి. దీనిలో ఉపయోగించిన భాష అశోక బ్రహ్మీ లిపిలోని అక్షరాలుగా భావిస్తున్నారు. శాతవాహనుల తొలితరం నాటిదిగా దీన్ని భావిస్తున్నారు. ఇంతకీ ఇదెక్కడ లభించిందంటారా? కామారెడ్డి జిల్లా మాల్ తుమ్మెదలో. ఈ ప్రాంతానికి మరో ప్రత్యేకత కూడా ఉంది. ఈ గ్రామానికి ఉన్న ప్రత్యేకత ఏమంటే.. ఆదిమానవుల జాడ మొదలుకొని ఎన్నో చారిత్రక ఆనవాళ్లకు కేరాఫ్ అడ్రస్ గా ఈ ప్రాంతాన్ని చెబుతారు.

మరో ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ఇంతకాలం వెలుగు చూసిన శాసనాల్లో అత్యధికం కృష్ణా - గోదావరి నదుల తీరాల్లో లభించాయి. ఇందుకు భిన్నంగా తాజా శాసనం మాత్రం మంజీరా నదికి 500 మీటర్ల దూరంలో లభించింది. ఇంతకీ దీనిపై ఉన్న ఐదు అక్షరాల్ని తెలుగులోకి మారిస్తే..

‘‘మాధవచంద’’గా తేల్చారు. ఇంతకీ అది ఒక వ్యక్తి పేరా? ప్రాంతానికి పేరా? ఈరెండింటికి సంబంధం లేని మరో పదమా? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఇంతకీ.. అక్కడ ఈ ఒక్క పదమే ఎందుకు చెక్కి ఉందన్నది మరో ప్రశ్న. ఎన్నో చారిత్రక ఆధారాలకు నెలువుగా చెప్పే ఈ గ్రామంలో మరిన్ని పరిశోధనలు జరిపితే.. మరిన్ని ఆసక్తికర అంశాలు వెలుగుచూసే అవకాశం ఉందంటున్నారు. మరి..ఈ దిశగా ప్రభుత్వం మరింత ప్రోత్సహిస్తే.. చరిత్రకు సంబంధించిన సరికొత్త విషయాలు తెలియటం ఖాయం.