Begin typing your search above and press return to search.

ఇంట్లోనే కరోనా టెస్ట్...90 నిమిషాల్లో రిజల్ట్

By:  Tupaki Desk   |   18 Sep 2020 5:01 PM GMT
ఇంట్లోనే కరోనా టెస్ట్...90 నిమిషాల్లో రిజల్ట్
X
కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ వైరస్ బారిన పడిన వారిని గుర్తించేందుకు టెస్ట్ లు చేయడం అగ్రరాజ్యం అమెరికాకు సైతం పెద్ద ప్రహసనంగా మారింది. కరోనా సోకిందో లేదో తెలుసుకునేందుకు ప్రపంచ వ్యాప్తంగా ర్యాపిడ్ యాంటీజెన్, ఆర్టీ-పీసీఆర్, ట్రూనాట్, యాంటీబాడీస్ వంటి టెస్టులను చేస్తున్నారు. అయితే, ఇందులో ఆర్టీ - పీసీఆర్ టెస్టు మాత్రమే కచ్చితమైనదని నిపుణులు చెబుతున్నారు. అయితే, ఈ పద్ధతిలో ఫలితం రావడానికి కనీసం 24 గంటలు పడుతోంది. యాంటీజెన్ టెస్లులో ఫలితం అరగంటలో వచ్చినా...దాని కచ్చితత్వం కోసం ఆర్టీ-పీసీఆర్ టెస్టు చేయాల్సిందేనని అంటున్నారు. అందులోనూ ఈ టెస్టులను చేయించుకునేందుకు ల్యాబ్ కు,ఆసుపత్రికి తప్పక వెళ్లాల్సిందే. ఈ నేపథ్యంలో కోవిడ్ సోకిందో లేదో తెలుసుకోవడానికి ల్యాబ్ కి వెళ్లే అవసరం లేకుండా ఇంటి దగ్గరే ర్యాపిడ్ పరీక్ష చేసుకునే `నడ్జ్ బాక్స్ మెషీన్` అనే పరికరాన్ని లండన్ శాస్త్రవేత్తలు రూపొందించారు. ఈ పరికరం ద్వారా గంటన్నరలోనే టెస్ట్ ఫలితాలు స్వయంగా తెలుసుకోవచ్చని శాస్త్రవేత్తలు అంటున్నారు.

ప్రస్తుతం ల్యాబ్ లో వస్తున్న తరహా ఫలితాలే ఈ 'ల్యాబ్ ఆన్ ఏ చిప్ ' పరీక్షలో వస్తున్నాయని ఇంపీరియల్ కాలేజీ లండన్ నిర్వహించిన అధ్యయనంలో తేలింది.ఇప్పటికే ఈ పరికరాన్ని యుకె లో వాడుతున్నారు. పూర్తి స్థాయి పరీక్షకు ఈ కిట్ ప్రత్యామ్నాయం కాదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. డీఎన్ఏ నడ్జ్ అనే కంపెనీ తయారు చేసిన ఈ పరికరం స్వాబ్ ను పరీక్షిస్తుంది. ముక్కు లోంచి కానీ, గొంతు లోంచి కానీ స్వాబ్ ని సేకరించగలిగిన వారు ఈ పరికరం ద్వారా స్వయంగా ఇంటి దగ్గరే పరీక్ష చేసుకోవచ్చు.స్వాబ్ సేకరించిన తర్వాత ఆ పరికరంపై నీలం రంగు కాట్రిడ్జ్లో పెడతారు. ఈ కాట్రిడ్జ్‌లో పరీక్షకు అవసరమైన రసాయనాలుంటాయి. మరో చిన్న మెషీన్ లో కాట్రిడ్జ్ పెట్టి పరీక్ష చేస్తారు. ఇప్పటికే 5000 నడ్జ్ బాక్స్ మెషీన్లు, 58,000 కార్త్రిడ్జులను యూకే ప్రభుత్వం తెప్పిస్తోంది. ఈ బాక్సు ద్వారా రోజుకు కేవలం 16 పరీక్షలు మాత్రమే నిర్వహించగలరని తయారీదారులు చెబుతున్నారు.