Begin typing your search above and press return to search.

ఆ జిల్లాలో జూన్ 1 నుండి లాక్ డౌన్ మరింత కఠినం !

By:  Tupaki Desk   |   29 May 2021 10:38 AM GMT
ఆ జిల్లాలో జూన్ 1 నుండి లాక్ డౌన్ మరింత కఠినం !
X
దేశంతో పాటుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కరోనా వైరస్ సెకండ్ వేవ్ కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా సెకండ్ వేవ్ లో నమోదు అయ్యే కరోనా వైరస్ మహమ్మారి కేసులు తగ్గుతూ వస్తున్నాయి. అయితే, ఏపీలో మూడు జిల్లాల్లో మాత్రం కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. ముఖ్యంగా చిత్తూరు జిల్లా లో కరోనా కేసులు ఎక్కువగా నమోదు అవుతూవస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా చూస్తే చిత్తూరు జిల్లాలో కరోనా కేసుల పెరుగుదల అధికంగా ఉంది. దీంతో జిల్లాలో కంటైన్మెంట్ జోన్ల సంఖ్య పెరుగుతోంది. నిన్న ఒక్క‌రోజే ఆ జిల్లాలో 2,291 కొత్త కేసులు న‌మోదు కాగా, 15 మ‌ర‌ణాలు సంభ‌వించాయి. అలాగే ఇప్ప‌టి వ‌ర‌కూ చిత్తూరు జిల్లాలో 1.85 ల‌క్ష‌ల మందికి పైగా క‌రోనా బారిన ప‌డ్డారు. వీరిలో 1.63 ల‌క్ష‌ల మందికి పైగా కోలుకున్నారు. 1254 మంది మృత్యువాత ప‌డ్డారు.

ఈ నేప‌థ్యంలో చిత్తూరు జిల్లాపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. చిత్తూరు జిల్లాలో క‌రోనా క‌ట్ట‌డికి లాక్‌ డౌన్ ఆంక్ష‌ల‌ను మరింత క‌ఠినంగా అమ‌లు చేయ‌నున్న‌ట్టు మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి తెలిపారు. తిరుప‌తి ఎస్వీ వెటర్నరీ వర్శిటీలో కోవిడ్‌పై అధికారులతో మంత్రులు నారాయణస్వామి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, గౌతమ్‌రెడ్డి శనివారం సమీక్షించారు. కర్ఫ్యూ తీరు, ఆక్సిజన్‌ సరఫరా, బ్లాక్‌ ఫంగస్‌ కేసులపై అధికారుల‌ను అడిగి వివ‌రాలు తెలుసుకున్నారు. జూన్ 1 నుంచి చిత్తూరు జిల్లాలో లాక్‌ డౌన్ కొత్త నిబంధ‌న‌లు అమ‌ల్లోకి వ‌స్తాయ‌ని అన్నారు. ఉద‌యం 6 నుంచి 10 గంట‌ల వ‌ర‌కూ స‌రుకులు కొనుగోలుకు అవ‌కాశం ఇస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ఉద‌యం 10 గంట‌ల త‌ర్వాత క‌ర్ఫ్యూ అమ‌ల్లోకి వ‌స్తుంద‌ని చెప్పారు. కర్ఫ్యూను కఠినంగా అమలు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. సరిహద్దు చెక్‌ పోస్టులను మరింత కట్టుదిట్టం చేస్తున్న‌ట్టు మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. ప్రస్తుతం లాక్ డౌన్ సందర్భంగా ఉదయం 9 గంటల నుంచి 11గంటల, సాయంత్రం 5గంటల నుంచి 7 గంటల వరకు మెడికల్, పాల దుకాణాలకు అనుమతిస్తున్నట్లు అధికారులు తెలిపారు. లాక్ డౌన్ నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలని, రూల్స్ అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.. ఏవైనా పనులుంటే ముందుగానే పర్మిషన్ తీసుకోవాలి.