Begin typing your search above and press return to search.

దేశంలో ఇన్ని రాష్ట్రాల్లో లాక్ డౌన్ పెట్టారు.. వారికి బుర్ర లేదా?

By:  Tupaki Desk   |   7 May 2021 4:30 AM GMT
దేశంలో ఇన్ని రాష్ట్రాల్లో లాక్ డౌన్ పెట్టారు.. వారికి బుర్ర లేదా?
X
ఒక సమస్య అందరికి సమస్య కాకపోవచ్చు. కానీ.. విపత్తు అందరి మీదా ఒకేలాంటి ప్రభావాన్ని చూపుతుంది. ఇక.. కరోనా లాంటి మహమ్మారి విషయానికి వస్తే.. దాని బారి నుంచి తప్పించుకోవటం అందరికి సాధ్యమయ్యే పని కాదు. రెండో వేవ్ దూసుకొస్తుందన్న విషయం దేశంలోని చిన్నపిల్లాడికి అర్థమవుతున్నా.. రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు.. ఇతర ఎన్నికలతో పాటు.. కుంభమేళాలు అవసరమయ్యాయే కానీ.. దేశ ప్రజల ఆరోగ్యం.. సంక్షేమం మాత్రం మరచిపోయారు. దీంతో.. దేశం ఇప్పుడు దారుణ పరిస్థితి నెలకొంది.

రోజు గడిచేసరికి 4.2 లక్షల కొత్త కేసులు నమోదు కావటం చూస్తే.. కరోనా తీవ్రత ఎంత ఎక్కువగా ఉందన్న విషయం ఇట్టే అర్థమవుతుంది. సెకండ్ వేవ్ నేపథ్యంలో.. లాక్ డౌన్ విధించాలా? వద్దా? అన్నది పెద్ద సందేహంగా మారింది. ఇప్పుడున్న సెకండ్ వేవ్ తో పోలిస్తే.. మొదటి వేవ్ ను అస్సలు పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరమే ఉండదు. ఆ మాటకు వస్తే.. అప్పట్లో ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవటం వల్ల బతికిపోయామే కానీ.. లేకుంటే దారుణ పరిస్థితులు ఉండేవి.

మొదటి వేవ్ నుంచి చావు తప్పి కన్ను లొట్టబోయినట్లుగా బయటపడినప్పటికి.. దాని విషయంలో ఉండాల్సిన అప్రమత్తత ప్రభుత్వాలకు మిస్ అయ్యింది. అదే.. ఈ రోజున దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున కేసులు నమోదు కావటానికి కారణమైంది. కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో.. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ను విధించి.. కేసుల సంఖ్యను తగ్గించే ప్రయత్నం చేస్తున్నాయి.

మరికొన్ని రాష్ట్రాలు మాత్రం.. లాక్ డౌన్ అవసరం లేదన్న సిద్ధాంతాన్ని సూత్రీకరిస్తున్నాయి. దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన రాష్ట్రాలు.. పరిమితులతో కూడిన లాక్ డౌన్ విధించిన రాష్ట్రాల్ని చూసినప్పుడు.. ఈశాన్య భారతంలో ఎక్కడా లాక్ డౌన్ విధించినట్లు కనిపించదు. అందుకు తగ్గట్లే.. ఆయా రాష్ట్రాల్లో కేసులు మొత్తం కలిపి కూడా మూడు వేలకు మించిన పరిస్థితి. ఇటీవల ఎన్నికలు ముగిసిన అసోం మినహా.. మిగిలిన అన్ని రాష్ట్రాల్లో కేసుల సంఖ్య చాలా చాలా తక్కువగా ఉన్నాయి. అందుకు భిన్నంగా అసోంలో ఏకంగా 31వేలకు పైగా కేసులు ఉండటం గమనార్హం.

కేసులు ఎక్కువగా ఉండి కూడా లాక్ డౌన్ విధించని రాష్ట్రాల విషయానికి వస్తే.. జమ్ము కశ్మీర్.. ఉత్తరాఖండ్.. పశ్చిమబెంగాల్.. గుజరాత్.. తెలంగాన.. ఏపీ (ఉదయం 12 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కఠినమైన కర్ఫ్యూ అమల్లో ఉంది), తమిళనాడు రాష్ట్రాలు ఉన్నాయి. ఇటీవల ఎన్నికలు ముగిసిన తమిళనాడు.. పశ్చిమబెంగాల్ లో లాక్ డౌన్ అంశంపై నిర్ణయం తీసుకునే వీలుందన్న మాట వినిపిస్తోంది. ఏమైనా.. కేసులు తక్కువగా ఉన్న చోట లాక్ డౌన్ విధంచలేదంటే అర్థం చేసుకోచ్చు.

కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికి.. లాక్ డౌన్ విషయంలో మాత్రం వేచిచూసే ధోరణి ఏ మాత్రం మంచిది కాదనే చెప్పాలి. ఇటీవల ఎన్నికలు ముగిసి.. రెండోసారి అధికారంలోకి వచ్చిన విజయన్ ప్రభుత్వం కేరళలో మే 8 నుంచి పూర్తిస్థాయి లాక్ డౌన్ విధించేందుకు సిద్ధమవుతున్నారు. కరోనాను కట్టడి చేసేందుకు లాక్ డౌన్ కీలకమన్నట్లుగా పెద్ద రాష్ట్రాలు భావిస్తుంటే.. అందుకు భిన్నంగా కేసీఆర్ లాంటి వారు లాక్ డౌన్ వేస్ట్ అని తేల్చేయటం గమనార్హం. మరి.. లాక్ డౌన్ విధించిన ప్రభుత్వాలకు ఆ మాత్రం బుర్ర లేదంటారా?