Begin typing your search above and press return to search.

ఈసారి మోడీ మాటలు అక్కడ మాత్రం వినిపించలేదు

By:  Tupaki Desk   |   28 Dec 2020 5:15 AM GMT
ఈసారి మోడీ మాటలు అక్కడ మాత్రం వినిపించలేదు
X
దేశ ప్రజల్ని ఉద్దేశిస్తూ దేశ ప్రధాని నరేంద్రమోడీ తరచూ చేసే మన్ కీ బాత్ కు ఈసారి కొత్త అనుభవం ఎదురైంది. సావధానంగా తన మనసులోని మాటల్ని దేశ ప్రజలకు పంచుకునే మోడీ కార్యక్రమానికి నిరసన సెగ తాకింది. ఆయన చెప్పే మాటల్ని వినేందుకు పంజాబ్ తో పాటు.. మరికొన్నిచోట్ల అస్సలు ఇష్టపడలేదు. మన్ కీ బాత్ టెలికాస్ట్ అవుతున్న వేళ.. ప్రధాని మాటల్ని వినకుండా.. భోజన పళ్లాల్ని మోగిస్తూ రైతు ఉద్యమానికి మద్దతు ప్రకటించారు పలువురు. రైతులు చేస్తున్న ఉద్యమానికి సంఘీభావంగా.. కేంద్ర ప్రభుత్వ తీరును తప్పు పడుతూ.. మన్ కీ బాత్ ప్రసారమయ్యే వేళలో మోడీ మాటల్ని వినిపించకుండా ఉండేలా.. భోజన పళ్లాల్ని పెద్ద ఎత్తున శబ్దం చేశారు.

సరికొత్త నిరసనల మధ్య సాగిన మన్ కీ బాత్ లో రైతుల గురించి.. రైతు ఉద్యమం గురించి ప్రధాని ఒక్క మాట కూడా మాట్లాడకపోవటం..ఆ ప్రస్తావన తేకపోవటం గమనార్హం. మన్ కీ బాత్ పై రైతు నేతలు పలువురు తప్పు పట్టారు. మోడీ తన మనసులోని మాటల్ని చెప్పటం కాదు.. తమ మనసుల్లోని మాట వినాలని వారు కోరుతున్నారు.

మోడీ చెప్పే మాటల్ని వినీ వినీ రైతులు విసిగెత్తిపోయారని.. చెప్పిన మాటల్నే చెప్పటం.. రైతులపై అబద్ధాలు చెప్పటం అలవాటుగా మారిందని.. అందుకే తామీ నిరసన చేస్తున్నట్లుగా రైతు ఉద్యమ నేత.. స్వరాజ్ అభియాన్ నేత యోగేంద్ర యాదవ్ పేర్కొన్నారు. మోడీ మానస పుత్రిక ‘మన్ కీ బాత్’ కార్యక్రమానికి ఇప్పటివరకు ఎప్పుడూ లేని నిరసనల మధ్య ముగిసినట్లైంది.