Begin typing your search above and press return to search.

లిక్కర్ స్కామ్ చార్జ్ షీట్.. కవిత పేరుపై ఉత్కంఠ.!

By:  Tupaki Desk   |   7 Jan 2023 10:30 AM GMT
లిక్కర్ స్కామ్ చార్జ్ షీట్.. కవిత పేరుపై ఉత్కంఠ.!
X
ఢిల్లీ మద్యం కుంభకోణం విచారణ రోజురోజుకు ఉత్కంఠను కలిగిస్తోంది. ఇప్పటికే ఈ కేసులో కొందరు నిందితులను అరెస్టు చేయగా.. మరికొందరిని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు విచారించారు. తాజాగా రెండో ఛార్జ్ షీట్ ను రౌస్ ఎవెన్యూ స్పెషల్ కోర్టులో ఈడీ దాఖలు చేసింది. 13,567 పేజీలతో కూడిన ఇందులో మద్యం కుంభకోణంకు పాల్పడిన వ్యక్తుల పేర్లు, సంస్థలు, వారి మధ్య జరిగిన ఆర్థిక లావాదేవీలు, వాటికి సంబంధించిన ఆధారాలు అన్నీ పొందుపరిచినట్లు కొందరు న్యాయవాదులు భావిస్తున్నారు.

ఇందులో ప్రధానంగా ఐదుగురు నిందితులు, ఏడు కంపెనీలు ఉన్నట్లు సమాచారం. ఇదే సమయంలో సౌత్ గ్రూపుకు సంబంధించిన లోతైన పరిశీలన చేసిన ఈడీ మరోసారి వారి పేర్లు ఉన్నాయా..? అనేది అధికారులు చెప్పడం లేదు. మొదటి చార్జ్ షీట్ లో ఏపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, తెలంగాణ ఎమ్మెల్సీ కవిత పేర్లు ఉన్నాయి. మరి రెండో చార్జ్ షీట్ లోనూ కవిత పేరు ఉందా..? అనేది ఉత్కంఠంగా మారింది.

లిక్కర్ కేసులో మొదటగా సమీర్ మహేంద్రును అరెస్ట్ చేశారు. ఆ తరువాత ఆయన ఇచ్చిన వివరాల అధారంగా అతడిని, తన కంపెనీలను నిందితుల జాబితాలో చేర్చింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ నుంచి డిస్టిల్లరీస్, హోల్ సేల్ డిస్డ్రిబ్యూటర్స్ లకు ఫేవర్ జరిగేలా సౌత్ గ్రూప్ జోక్యం చేసుకున్న తీరును చార్జిషీట్ లో పేర్కొన్నట్లు సమాచారం. సౌత్ గ్రూప్ లో ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, శరత్ చంద్రారెడ్డి, అరుణ్ రామచంద్రన్ పిళ్లయ్, ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబు, బోయిన్ పల్లి అభిషేక్ లందరూ ఉన్నారు. ఈ వివరాలన్నీ రెండో చార్జ్ షీట్లో ఉన్నట్లు తెలుస్తోంది.

అయితే రెండో ఛార్జ్ షీట్ లో సౌత్ గ్రూపునకు సంబంధించిన వివరాలు పొందుపర్చామన్నారు. కానీ కల్వకుంట్ల కవిత పేరు ఉందా..? అనే విషయాన్ని మాత్రం ఈడీ అధికారులు చెప్పడం లేదు. ఈమె పేరు తొలి ఛార్జ్ షీట్ లో పేర్కొన్నారు. కానీ రెండో చార్జ్ షీట్ లో ఉందా..? అనే ప్రశ్నకు .. ఇది కామన్ చార్జిషీట్ అయినందున అన్ని వివరాలు ఉంటాయని అన్నారు. అయితే 13,567 పేజీలున్న ఇందులో కవిత , ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డిలను నిందితులని పేర్కొనకపోయినా వీరి మధ్య జరిగిన ఆర్థిక వ్యవహారాల ఆధారాలకు సంబంధించి ఉంటాయని అంటున్నారు.

ఇదిలా ఉండగా లిక్కర్ స్కాం కేసులో అరెస్టయిన అరబిందో ఫార్మా ఫుల్ టైమ్ డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డికి సీబీఐ కేసులో బెయిల్ లభించినా ఈడీ కేసులో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇప్పుడు ఆయనకు బెయిల్ ఇస్తే విచారణకు ఆటంకం కలుగుతుందనే భావన కలుగుతోందని అంటున్నారు. రెండో చార్జి షీట్ లో శరత్ చంద్రారెడ్డి పేరును పేర్కొన్నందున ఆయనకు బెయిల్ లభిస్తుందా..? లేదా..?అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ కేసులో ఇప్పటికే అమిత్ అరోరా ఇప్పటికే జైలులో ఉన్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.