Begin typing your search above and press return to search.

ఏపీకి లింగమనేని గొప్పే.. మరి చేసిందేమిటీ?

By:  Tupaki Desk   |   25 Sep 2019 9:49 AM GMT
ఏపీకి లింగమనేని గొప్పే.. మరి చేసిందేమిటీ?
X
కృష్ణా నది కరకట్టపై అక్రమంగా నిర్మించిన చంద్రబాబు నివాసం ఉంటున్న ఇంటిని కూల్చడానికి సీఆర్డీఏ అధికారులు నోటీసులు జారీ చేశారు. నదీ పరిరక్షణ చట్టాలను ఉల్లంఘిస్తూ నిర్మించిన లింగమనేని హౌస్ పూర్తిగా అక్రమ కట్టడమని తేల్చి మరో వారం రోజుల్లో ఖాళీ చేయకుంటే కూల్చేస్తామని తెలిపారు.

అయితే చంద్రబాబు ఉండడానికి అద్దెకిచ్చిన ఆ ఇంటి యజమాని, ప్రముఖ పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్ తాజాగా ఏపీ సీఎం జగన్ కు లేఖ రాసి విడుదల చేశారు. ఇందులో ఆసక్తికర అంశాలను ప్రస్తావించారు.

తాను గ్రామ పంచాయతీ - నీటి పారుదల శాఖ అధికారుల నుంచి అనుమతి తీసుకునే ఇల్లు నిర్మించుకున్నానని పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్ లేఖలో పేర్కొన్నారు. అన్ని అనుమతులు తీసుకునే చట్టబద్దంగా ఇంటిని నిర్మించుకున్నానని.. ఎలా కూల్చివేస్తారని లేఖలో జగన్ ను ప్రశ్నించారు. అంతేకాదు.. తాను ఏపీలో ప్రముఖ పారిశ్రామికవేత్తను అని .. అమరావతి నగరంలో అనేక మౌళిక సదుపాయాల ప్రాజెక్టులు కడుతున్నానని పేర్కొన్నారు. అలాంటి తన ఇంటిని పడగొట్టడం భావ్యంకాదన్నారు.

ఇక రాజధాని కూడా లేకుండా ఏపీని విభజిస్తే.. ముఖ్యమంత్రి చంద్రబాబు ఉండడానికి నివాసం కూడా లేకపోతే నేనే తన ఇంటిని ఆయనకు ఇచ్చి ఏపీ నిజమైన పౌరుడిగా పరువు కాపాడానని లింగమనేని లేఖలో పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తున్న తనకు తన ఇంటిని కూల్చడానికి నోటీసులు ఇవ్వడం ధర్మం కాదన్నారు.

అయితే బడా పారిశ్రామికవేత్త.. ఇంత గొప్ప చరిత్ర పేరు ఉన్న లింగమనేని.. అనధికారికంగా.. చట్టవిరుద్ధంగా కృష్ణా నది కరకట్టపై అక్రమంగా ఇల్లు నిర్మించకూడదని తెలియదా అని వైసీపీ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. హైకోర్టులు కూడా కూల్చడానికి అనుమతిస్తున్నాయని... కేవలం చంద్రబాబు ప్రోద్బలంతో స్థలాలు - ప్రాజెక్టులు పొంది.. అక్రమంగా కట్టడాలు కట్టుకున్నారని.. ఆయనకు ఇంటిని కానుకగా ఇచ్చారని లింగమనేనిపై విమర్శలు గుప్పిస్తున్నారు. నాటి ప్రభుత్వాలు కళ్లు మూసుకొని ఉన్నాయని..ఇప్పుడు ఆ అక్రమాలను తొలగిస్తుంటే ఇలా మొసలికన్నీరు కారుస్తున్నారని వైసీపీ శ్రేణులు కౌంటరిస్తున్నాయి.