Begin typing your search above and press return to search.

బతకలేక.. లంక జన జీవనం కకావికలం

By:  Tupaki Desk   |   17 Jun 2022 2:30 AM GMT
బతకలేక.. లంక జన జీవనం కకావికలం
X
90 వేలు.. ఒక ఏడాదిలో శ్రీలంక ప్రభుత్వం సాధారణంగా జారీ చేసే పాస్ పోర్టులు. 2.88 లక్షలు.. గత ఐదు నెలల్లో మంజూరు చేసిన పాస్ పోర్టులు. అంటే.. ఏడాది మొత్తం మీద ఇచ్చే పాస్ పోర్టులు మూడు రెట్లు ఐదు నెలల్లోనే మంజూరు చేసింది. అంతేకాదు.. ఉపాధి వెతుక్కునేందుకు ఇంకా ఎవరైనా విదేశాలకు వెళ్తారా? అయితే వెళ్లండి అంటోంది. అలా వెళ్లే వారి నుంచి వచ్చే కొద్ది డాలర్లయినా తమకు ఎంతో కొంత ఉపయోగపడతామని భావిస్తోంది.

మూడు నెలలుగా మరింత అధ్వానం ఈ ఏడాది ప్రారంభం నుంచే శ్రీలంక పరిస్థితి దిగజారడం కనిపించింది. గత మూడు నెలలుగా మరీ దారుణమైంది. పెను ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. పెట్రోల్, డీజిల్ సహా రోజువారీ జీవనానికి అవసరమయ్యే వస్తువులు దొరక్క సామాన్య ప్రజలు అల్లాడిపోతున్నారు. పిల్లలకు కనీస సదుపాయాలు అందించలేకపోతున్నామని వాపోతున్నారు. ఇలాంటి వారంతా ఉపాధి వెతుక్కుంటూ దేశం దాటాలని చూస్తున్నారు. 2.5 కోట్ల శ్రీలంక జనాభాలో ఐదు నెలల్లో లక్ష మంది పాస్ పోర్టుకు దరఖాస్తు చేసుకున్నారు.

వాస్తవానికి కొవిడ్ కు ముందే శ్రీలంకలో దుశ్శకునాలు కనిపించాయి. 2019 మార్చిలో ఈస్టర్ పండుగ సమయంలో ఓ చర్చిలో భారీ ఉగ్ర దాడి జరిగింది. పెద్ధ ఎత్తున ప్రాణ నష్టం సంభవించింది. పర్యాటకానికి పేరుగాంచిన శ్రీలంకను ఇది బాగా దెబ్బతీసింది. మరుసటి ఏడాది కొవిడ్ ప్రారంభమై కుదేలు చేసింది. అంతేగాక.. సేంద్రియ వ్యవసాయం అంటూ అక్కడి పాలకులు ఆర్థిక వ్యవస్థను అంతా అస్తవ్యస్తం చేశారు. దీంతో శ్రీలంక వాసులకు దయనీయ పరిస్థితులు దాపురించాయి. ప్రస్తుతం ఆ చిన్ని దేశం ద్రవ్యోల్బణం 33 శాతం. నగదు విలువ దారుణంగా పడిపోతోంది.

పాస్ పోర్టు కార్యాలయం ఎదుట బారులు.విదేశాలకు వెళ్లేందుకు ప్రజలు ప్రయత్నిస్తుండడంతో పాస్ పోర్టు కార్యాలయం ఎదుట బారులు కనిపిస్తున్నాయి. ఒక్కొక్కొరు రెండు, మూడు రోజులు ఎదురుచూసి మరీ పత్రాలు సమర్పిస్తున్నారు. వీరిలో కూలీలు, చిన్నపాటి వ్యాపారులు, రైతులు, ప్రభుత్వ ఉద్యోగులు, గృహిణులు ఉన్నారు. ఇలాంటివారే లనోరా (33) అనే మహిళ. ఎడాది దేశం కువైత్ లో పనిచేసేందుకు వెళ్లడానికి ఆమె సిద్ధమైంది. ఓ దుస్తుల దుకాణంలో పనిచేసే లనోరా.. జీవనానికి కష్టాలు ఎదుర్కొంటోంది.

ఆమెకు ఇద్దరు పిల్లలు. భర్త హోటల్ లో పనిచేస్తుంటాదడు.'వంటగ్యాస్‌ లేదు. ఆహార పదార్థాల ధరలు చుక్కలనంటాయి. నా భర్త ఉద్యోగం పోయింది. ఇంకో ఉద్యోగం దొరకడం కష్టమే. జీతాలేమో చాలా తక్కువ. ఇద్దరు పిల్లలను చూసుకోవడం అసాధ్యం. అందుకే పాస్‌పోర్టుకు సంబంధించిన కాగితాలు సమర్పించేందుకు గతవారం 170 కిలోమీటర్లు ప్రయాణించి కొలంబోకు వచ్చాను. పాస్‌పోర్టు రాగానే కువైట్ వెళ్లిపోతాను. అక్కడ రెండు సంవత్సరాలు పనిచేస్తే కుటుంబానికి తగినంత సంపాదించగలను.

నా ఇద్దరు కుమార్తెలకు చదువుచెప్పించడం ఇప్పుడు నాకు అన్నింటికంటే ముఖ్యం' అంటూ ఆమె తన కష్టాలను చెప్పుకొంది. కాగా, శ్రీలంక పెను ఆహార సంక్షోభం అంచున ఉందని ఇటీవల ప్రధాని రణీల్ విక్రమసింఘే హెచ్చరించారు. మరికొన్ని నెలల్లో పరిస్థితి చేయిదాటిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు పాస్‌పోర్టు కార్యాలయం తాకిడిని అక్కడి యంత్రాంగం తట్టుకోలేకపోతోంది. 'వారంతా నిరాశలో ఉన్నారు. అలాంటివారితో ఎలా వ్యవహరించాలనేది చాలా ముఖ్యం.అందుకే మేమేమీ చేయడం లేదని వారు నిందిస్తున్నారు’అని అధికారులు అంటున్నారు. ఇటీవల శ్రీలంక.. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌)ని అత్యవసర దిగుమతుల కోసం 5 బిలియన్‌ డాలర్లు కోరింది.