Begin typing your search above and press return to search.

జేసీబీ పెట్టి విగ్ర‌హాన్ని కూల్చేస్తారా మోడీ?

By:  Tupaki Desk   |   6 March 2018 7:47 AM GMT
జేసీబీ పెట్టి విగ్ర‌హాన్ని కూల్చేస్తారా మోడీ?
X
అధికార బ‌దిలీ అన్నిచోట్లా ఒకేలా జ‌ర‌గ‌దు. కొన్నిచోట్ల చాలా మామూలుగా సాగిపోతే.. మ‌రికొన్ని చోట్ల పెద్ద ఎత్తున హింసాత్మ‌క చ‌ర్య‌లు చోటు చేసుకుంటాయి. సుదీర్ఘ‌కాలం త‌ర్వాత ఒక రాజ‌కీయ పార్టీ అధిక్య‌త నుంచి మ‌రో రాజ‌కీయ పార్టీ చేతికి అధికారం బ‌దిలీ కావ‌టం.. ఆ సంద‌ర్భంగా ప‌వ‌ర్ ఉన్న పార్టీ నేత‌లు.. కార్య‌క‌ర్త‌లు చెల‌రేగిపోవ‌టం క‌నిపిస్తుంది. ఇలాంటి సాదా ప్ర‌జ‌ల‌కు తీవ్ర ఆందోళ‌న‌లు క‌లిగిస్తాయ‌న్న‌ది మ‌ర్చిపోకూడ‌దు.

కొత్త త‌ర‌హా అభివృద్ది.. కొత్త త‌ర‌హా రాజ‌కీయాల్ని చూపిస్తామ‌ని భారీగా ప్ర‌చారం చేసిన త్రిపుర అసెంబ్లీ ఎన్నిక‌ల అంతిమ ఫ‌లితాలు ఎలా వ‌చ్చాయో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. క‌మ్యూనిస్టుల కంచుకోట లాంటి త్రిపుర కోట మీద కాషాయ జెండా స‌గ‌ర్వంగా ఎగ‌ర‌ట‌మే కాదు.. ఈశాన్య రాష్ట్రాల్లో త‌మ ప‌ట్టుకు సంకేతంగా బీజేపీ నేత‌ల ఆనందం అంతా ఇంతా కాదు.

త్రిపుర‌లో బీజేపీ అధికారంలోకి రావ‌టాన్ని ఆ రాష్ట్రం..ఈ రాష్ట్రం అన్న తేడా లేకుండా అన్ని రాష్ట్రాల మీడియా సంస్థ‌లు భారీగా వార్త‌లు ఇచ్చేశాయి. అక్క‌డితో క‌థ అయిపోయిన‌ట్లు ఊరుకుండిపోయారు. ఇప్పుడా రాష్ట్రంలో ఆరాచ‌కం జ‌రుగుతోంద‌న్న మాట వినిపిస్తోంది. ఈ మాట‌ల‌కు సాక్ష్యంగా వెలుగు చూస్తున్న ఫోటోలు.. వీడియోలు చూస్తే షాకింగ్ గా మార‌ట‌మే కాదు.. అధికార బ‌దిలీ మ‌రీ ఇంత దారుణంగా సాగుతుందా? అన్న బావ‌న క‌ల‌గ‌టం ఖాయం.

త్రిపుర‌లో బంప‌ర్ మెజార్టీలో బీజేపీ గెలిచిన 48 గంట‌ల్లోపే అనూహ్య ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. ఫ‌లితాలు వ‌చ్చిన 48 గంట‌ల వ్య‌వ‌ధిలోనే ప్ర‌ఖ్యాత క‌మ్యూనిస్ట్ నేత లెనిన్ విగ్ర‌హాన్ని జేసీబీతో కూల్చేసిన ఘ‌ట‌న సంచ‌ల‌నంగా మారింది.

ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. కొంద‌రు కాషాయ టోపీ పెట్టుకొన్న ఆందోళ‌న కారులు ప‌ట్ట‌ప‌గ‌లు.. త్రిపురలోని బెలోనియా ప‌ట్ట‌ణంలో లెనిన్ గా ఫేమ‌స్ అయిన వ్లాదిమిర్ ఇల్యీచ్ ఉల్యొనోవ్ విగ్ర‌హాన్ని జేసీబీతో కూల్చేశారు. ఈ విగ్ర‌హాన్ని త్రిపుర‌లో క‌మ్యూనిస్ట‌ల 21 ఏళ్ల పాల‌న పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా ఏర్పాటు చేశారు. తాజా ఎన్నిక‌ల్లో బీజేపీ విజ‌యం సాధించిన విజ‌యం అనంత‌రం ఈ విధ్వంస కాండ చోటు చేసుకున్న‌ట్లు చెబుతారు. అయితే.. ఈ ఘ‌ట‌న‌ల‌తో త‌న‌కు సంబంధం లేద‌ని బీజేపీ నేత‌లు వాదిస్తుంటే.. మ‌రికొంద‌రు త‌మ‌ను బ‌ద్నాం చేయ‌టానికే ఇలా చేస్తున్నట్లు చెబుతున్నారు. మ‌రోవైపు వామ‌ప‌క్ష నేత‌లు మాత్రం.. త్రిపుర‌లో బీజేపీ నేత‌లు చేస్తున్న ఆరాచ‌కానికి సంబంధించిన ఫోటోల్ని వ‌రుస‌గా సోస‌ల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఈ తీరు మాత్రం క‌ల‌క‌లం రేప‌ట‌మే కాదు.. బీజేపీ మీద ఉన్న అభిమానాన్ని తగ్గించేలా ఉన్నాయ‌న్న భావ‌న ప‌లువురి నోట వ్య‌క్త‌మ‌వుతోంది.