Begin typing your search above and press return to search.

జగన్‌ కు చేరువవుతున్న వామపక్షాలు!

By:  Tupaki Desk   |   3 Aug 2018 8:37 AM GMT
జగన్‌ కు చేరువవుతున్న వామపక్షాలు!
X
ఆంధ్రప్రదేశ్‌ లో రాజకీయాలు రోజురోజుకు మారిపోతున్నాయి. ఎన్నికల సమయం దగ్గర పడే కొద్దీ రకరకాల పొత్తులు - కొత్త కొత్త స్నేహాలు అంకురిస్తున్నాయి. మొన్నటి వరకు జనసేన నాయకుడు పవన్ కల్యాణ్‌ తో పయనించిన వామపక్ష పార్టీలు సీపీఐ - సీపీఎంలు వైఎస్ ఆర్ కాంగ్రెస్ వైపు అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. పవన్ కల్యాణ్ వైఖరి నచ్చకపోవడం ఒక కారణమైతే - జగన్ లోని నిజాయితి ఇంకో కారణంగా చెబుతున్నారు. వామపక్ష పార్టీల్లో ఒకరిద్దరు అగ్రనాయకులు ఈ కొత్త మైత్రిని అంగీకరించకపోయినా ఎక్కువ మంది నాయకులు - కార్యకర్తలు జగన్ వైపే వెళ్లాలని పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. వై.ఎస్ రాజశేఖర రెడ్డితో వామపక్ష నాయకులకు ఉన్న అనుబంధం కూడా కొత్త స్నేహం చిగురించేలా చేస్తోంది. అయితే ఇప్పటికిప్పుడు ఈ మైత్రి బంధాన్ని ప్రకటించకపోయినా ఎన్నికల నాటికి ఇది కార్యరూపం దాల్చవచ్చు.

గత కొంత కాలంగా పవన్ కల్యాణ్ వెంట ఉన్న వామపక్షాలకు ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు కలవరపరిచాయంటున్నారు. నియోజక వర్గ పరిశీలకుల నియామకాలతో పాటు - పార్టీలోని కీలక పదవులను ఒకే కులానికి చెందిన వారికే ఇవ్వడం వామపక్ష నాయకులకు ఆగ్రహం తెప్పించింది. అలాగే ప్రజలతో సమావేశాలు నిర్వహించినప్పుడు తమకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని కేవలం విలేకరుల సమావేశాలలోనే తమను ప్రక్కన కూర్చోపెట్టుకుంటున్నారని వామపక్ష నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంతకు ముందు ఆంధ్రప్రదేశ్‌ లో ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై ఎన్నో ఉద్యమాలు చేసామని - ఇప్పుడు పవన్ వెనుక నడవడం ఇబ్బందిగా ఉందని వామపక్షాల నాయకులు అంటున్నారు. పవన్ కల్యాణ్‌ లో పైకి కనిపించేంత ఉదారత లేదన్నది వామపక్షాల వాదన. కొంత కాలంగా జగన్ చేస్తున్న పాదయాత్ర - దానికి ప్రజల నుంచి వస్తున్న స్పందన వామపక్ష పార్టీలు జగన్ వైపు చూసేలా చేస్తున్నాయ్. కాపు రిజర్వేషన్లపై జగన్ చేసిన ప్రకటన వామపక్షాల నాయకులలో ఆలోచనలను రేకెత్తించింది. నేటి రాజకీయాలలో లేని పోని వాగ్దానాలు - చేయలేమని తెలిసిన గుప్పించే హామీలు ఎక్కువయ్యాయని, ఇలాంటి సందర్భంలో రిజర్వేషన్లపై విస్పష్ట ప్రకటన చేసిన జగన్ వైపు వెళ్లాలని వామపక్షాల నాయకులు భావిస్తున్నారు. బిజేపీకి జగన్ మద్దతు ఇస్తారని - ఆయన నరేంద్ర మోదీ మనిషేనని చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రకటనలను సీపీఐ - సీపీఎం నాయకులు అంగీకరించడం లేదు. చంద్రబాబును - ఆయన వైఖరిని రెండు దశాబ్దాలకు పైగ దగ్గరుండి చూసిన లెఫ్ట్ పార్టీల నాయకులు చంద్రబాబులో మార్పు రాదని అంటున్నారు. జగన్ మోహాన రెడ్డిలో తన తండ్రి రాజశేఖర రెడ్డి పట్టుదల, వివిధ అంశాలపై స్పష్టత ఉండడం గుర్తించామని, అందుకే ఆయనతో ప్రయాణించాలని ప్రతిపాదన తీసుకువచ్చినట్లు సీపీఎంకు చెందిన ముఖ్యనేత ఒకరు తెలిపారు. అన్నీ కుదిరితే ఎన్నికల నాటికి వామపక్షాలు - వైఎస్ ఆర్ కాంగ్రెస్ జతకట్టే అవకాశం ఉంది.