Begin typing your search above and press return to search.

పిడిగుద్దుల‌తో ప‌ది విప‌క్షాలు ఏక‌మ‌య్యాయి

By:  Tupaki Desk   |   3 Nov 2016 4:33 PM GMT
పిడిగుద్దుల‌తో ప‌ది విప‌క్షాలు ఏక‌మ‌య్యాయి
X
తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలంలో పంపాదిపేట గ్రామంలో ఏర్పాటు చేయతలపెట్టిన దివీస్ ఫ్యాక్టరీపై ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణం అవుతోంది. ప్రజలకు హానికరమైన దివీస్ ఫ్యాక్టరీ ఏర్పాటును ప్రభుత్వం విరమించుకోవాలని కోరుతూ శాంతియుతంగా జరుగుతున్న సభను అడ్డుకొని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు మరియు సీపీఐ కార్యదర్శివర్గ సభ్యులు రావుల వెంకయ్యతో సహా వివిధ వామపక్ష ప్రజాసంఘాల నాయకులను - వందలాదిమంది ప్రజలను అరెస్టు చేయడాన్ని వామపక్షాలు ఖండించాయి. ఈ మేర‌కు ప‌ది వామ‌ప‌క్ష పార్టీలు ఏపీ స‌ర్కారు తీరును తీవ్రంగా త‌ప్పుప‌డుతూ ఉమ్మ‌డిగా ప‌త్రికా ప్ర‌క‌టన విడుద‌ల చేశాయి.

దివీస్ ఫ్యాక్ట‌రీ వల్ల కాలుష్యం బారిన పడతామని పేర్కొంటూ అక్కడి ప్రజలు ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా గత కొన్ని నెలలుగా వివిధ రూపాల్లో ప్రజాస్వామ్య పద్ధతిలో తమ నిరసనను తెలియజేస్తుంటే వారి పోరాటానికి మద్దతుగా శాంతియుతంగా జరుగుతున్న సభను అడ్డుకొని రాష్ట - జిల్లా - స్థానిక నాయకులతోపాటు 200 మంది ప్రజలను అరెస్టు చేసి వివిధ పోలీసు స్టేషన్లలో ఉంచార‌ని ప‌ది వామ‌ప‌క్ష పార్టీలు మండిప‌డ్డాయి. శాంతియుత ఆందోళ‌న సందర్భంగా తుని రూరల్ సీఐ చెన్నకేశవులు మీడియా దృష్టిని తప్పించి సీపీఎం రాష్ట కార్యదర్శి పి.మధును ఉద్దేశించి నానా దుర్భాషలాడట‌మే కాకుండా పిడిగుద్దులు - కాళ్ళతో కడుపుమీద - వీపుమీద తీవ్రంగా కొట్టారని ఆరోపించారు. అదే విధంగా పార్టీ - ప్రజాసంఘాల నాయకులు డీఎస్పీ నాయకత్వంలో విపరీతంగా కొట్టారని, మహిళలపై లారీఛార్జి చేసి 10 మందిని తీవ్రంగా గాయపరిచారని మండిప‌డ్డారు. పోలీసుల దాడిలో కొందరు స్పహ కోల్పోయారని పోలీసుల ఈ దుర్మార్గపు చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామ‌ని తెలిపారు. బాధ్యులైన పోలీసులపై తగిన చర్య తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దీంతో పాటుగా ప్రజాభిప్రాయాన్ని గౌరవించి తక్షణమే ఫ్యాక్టరీ ఏర్పాటును ఆపివేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తూ పోలీసులను ప్రయోగించి ప్రజా ఉద్యమాలపై తీవ్ర నిర్బంధ చర్యలకు పాల్పడటాన్ని వామపక్షాలు తీవ్రంగా నిరసిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ ప్ర‌క‌ట‌న‌ను విడుద‌ల చేసిన వారిలో సీపీఐ రాష్ట్ర కార్య‌ద‌ర్శి రామ‌కృష్ణ - సీపీఎం త‌ర‌ఫున వై.వెంకటేశ్వరరావు - వై.సాంబశివరావు (సీపీఐఎంఎల్-న్యూడెమోక్రసీ), సీపీఐఎంఎల్ నుంచి గుర్రం విజయకుమార్ - ఎంసీపీఐ నుంచి ఎం.వెంకటరెడ్డి - సీపీఐ ఎంఎల్ లిబ‌రేష‌న్ త‌ర‌ఫున ఎన్.మూర్తి - ఎస్‌ యూసీఐ త‌ర‌ఫున బీఎస్ అమ‌ర్ నాథ్‌ - పీవీ సుందరరామరాజు ఫార్వర్డ్ బ్లాక్‌ - రివల్యూషనరీ సోషలిస్టు పార్టీ త‌ర‌ఫున‌ జానకి రాములు ఉన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/