Begin typing your search above and press return to search.

బోపన్న ఇగోను మడిచి లోపల పెట్టుకోమంది

By:  Tupaki Desk   |   11 Jun 2016 12:55 PM GMT
బోపన్న ఇగోను మడిచి లోపల పెట్టుకోమంది
X
దేశమ్మీద విపరీతమైన ప్రేమాభిమానాల్ని కురిపించే వాళ్లు చాలామందే కనిపిస్తారు. తమకు టన్నుల టన్నుల దేశ భక్తి ఉన్నట్లుగా కొందరు ఆటగాళ్లు బోలెడు బిల్డప్ ఇస్తారు. అంత ప్రేమాభిమానాలు ఉన్నాయి కదా.. దేశానికి మేలు చేసేలానిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు.. ఆ విషయాన్ని అస్సలు పట్టించుకోకుండా తమ వ్యక్తిగత ఇష్టాయిష్టాలకు.. ఇగోలకే పెద్దపీట వేస్తుంటారు. ఇలాంటివి ఇప్పటికే పలుమార్లు నిరూపితమయ్యాయి కూడా.

తాజాగా మరోసారి అలాంటి సీనే ఒకటి రిపీట్ అవుతున్న నేపథ్యంలో ‘కేంద్రం’ రియాక్ట్ అయినట్లుగా కనిపిస్తోంది. అవకాశం ఇచ్చాం కదా అని చెలరేగిపోతున్న సదరు ఆటగాడి స్వేచ్ఛకు బ్రేకులేసి తాము చెప్పినట్లుగా ఆడాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఇంతకీ ఈ లొల్లి అంతా ఎవరి గురించో కాదు.. యువ టెన్నిస్ స్టార్ రాహుల్ బోపన్నకు సంబంధించిందే.

రియో ఒలింపిక్స్ లో భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ ను కలుపుకొని బోపన్నను డబుల్స్ ఆడాలని భారత టెన్నిస్ సమాఖ్య భావించింది. కానీ.. తనకు ఇచ్చిన అవకాశాన్ని (మెరుగైన ర్యాంకులో ఉన్నందుకు బోపన్నకు తన పార్టనర్ గా ఉండే ఆటగాడిని ఎంపిక చేసుకునే అవకాశం ఉంది) తన ఇగోతో స్టార్ ఆటగాడు లియాండర్ పేస్ ను వదిలేసి.. జూనియర్ తో జత కడతానంటూ షాకిచ్చాడు.

బోపన్న నిర్ణయంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తే పరిస్థితి. పేస్ తో అయితే తాను ఆడలేనన్న బోపన్న.. విశాఖకు చెందిన సాకేత్ తో జత కట్టనున్నట్లు ప్రకటించాడు. దీనిపై భారత టెన్నిస్ సమాఖ్య రియాక్ట్ అయి.. రియో ఒలింపిక్స్ తో పేస్ తోనే ఆడాలంటూ తేల్చి చెప్పింది. టెన్నిస్ సమాఖ్య తీసుకున్న నిర్ణయంతో బోపన్న తన ఈగో సమస్యల్ని మడిచి పెట్టి బుద్ధిగా ఆట మీద ఫోకస్ చేయాలన్నట్లుగా తాజా నిర్ణయం ఉందన్న మాట వినిపిస్తోంది. మర్యాదగా అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని పెద్దరికంతో నిలబెట్టుకోవాలే కానీ.. అందుకు భిన్నంగా వ్యవహరిస్తేనే.. ఇలాంటి ఎదురుదెబ్బలు తగులుతాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.