Begin typing your search above and press return to search.

నేతల పాదయాత్ర.. సరికొత్త పొలిటికల్ ట్రెండ్ గా మారిందే!

By:  Tupaki Desk   |   4 Sep 2021 4:30 PM GMT
నేతల పాదయాత్ర.. సరికొత్త పొలిటికల్ ట్రెండ్ గా మారిందే!
X
రాజకీయాల అంతిమ లక్ష్యం అధికారమే. ఆ విషయంలో ఎలాంటి మొహమాటానికి గురి కారు రాజకీయ నేతలు. అధికారంలోకి వచ్చే ఏ చిన్న అవకాశాన్ని వదిలి పెట్టుకోరు. గెలుపు మంత్ర కోసం విపరీతంగా వెతుకులాడే అధినేతలకు.. నేతలకు ఇప్పుడు పాదయాత్ర ఒక ఆయుధంగా మారిందని చెప్పాలి. పాదయాత్ర చేస్తే చాలు.. పవర్ గ్యారెంటీ అన్న భావన రెండు తెలుగు రాష్ట్రాల్లో బలంగా వినిపిస్తోంది. దీంతో.. ఎవరికి వారు తమదైన పాదయాత్ర కోసం ప్రయత్నాలు చేస్తుండటం మొదలైంది. ప్రస్తుతం తెలంగాణలో రెండు పాదయాత్రలు సాగుతుంటే.. రానున్న రోజుల్లో మరిన్ని పాదయాత్రలు తప్పనిసరిగా సాగనున్నట్లు చెబుతున్నారు.

తెలుగు రాజకీయాల్లో పాదయాత్రకు ఇంత ప్రాధాన్యతకు కారణంగా.. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని చెప్పక తప్పదు. 2003లో ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్.. నాటి చంద్రబాబు సర్కారు పాలనా వైఫల్యాల్ని ఎండగట్టేందుకు.. ప్రజల తరఫున పోరడటానికి తాను ఉన్నాన్న విషయాన్ని తెలిజేసేలా ఆయన పాదయాత్రను ఎంచుకున్నారు. తెలుగు రాజకీయాల్లో సరికొత్త ట్రెండ్ కు తెర తీసిన వైఎస్.. ఆయన అంచనాకు తగ్గట్లే.. ముఖ్యమంత్రి పదవిని సొంతం చేసుకోవటమే కాదు.. ఆ ఒక్క పాదయాత్ర వైఎస్ ఇమేజ్ ను అమాంతంగా పెంచేయటమే కాదు.. ఆయనను వ్యక్తిగతంగా కూడా చాలా మార్చిందన్న మాట వినిపిస్తూ ఉంటుంది.
వైఎస్ మరణం తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాలు.. రాష్ట్ర విభజన.. అదే సమయంలో చంద్రబాబు చేసిన సుదీర్ఘ పాదయాత్ర.. రాజకీయంగా ఆయనకు ఎంత మేలు చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 2014 విభజన వేళలో జరిగిన ఎన్నికల్లో ఆయన్ను ఏపీ ముఖ్యమంత్రిగా చేయటంలో పాదయాత్ర చాలానే సాయం చేసిందని చెప్పాలి.

బాబు పాలనపై వ్యతిరేకత రగిలించటంతో పాటు.. తనకు ఒక్క అవకాశం ఇవ్వాలంటూ జగన్ చేపట్టిన పాదయాత్రకు ఎలాంటి స్పందన వచ్చిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. న్యాయపరమైన చిక్కుల్లో కూరుకుపోయిన ఆయన.. తన మీద పడ్డ మరకల్ని తుడిచేందుకు.. తన వాదనను వినిపించేందుకు ప్రజల మధ్యకు వెళ్లాలని భావించిన ఆయన పాదయాత్రే అందుకు సరైన మార్గంగా భావించటం తెలిసిందే. ఆయన ఇమేజ్ ను భారీగా పెంచేయటమే కాదు.. కేసుల కారణంగా జైలుకు వెళ్లిన వైనంపై సానుభూతి పొంగిపొర్లేలా చేయటమే కాదు.. 2019 ఎన్నికల్లో చారిత్రక విజయాన్ని సాధించటంలో కీలక భూమిక పోషించింది.

దీంతో..రాజకీయాల్లో పాదయాత్ర గెలుపు మంత్రగా మారింది. తాజాగా మంత్రి పదవికి.. అనంతరం ఎమ్మెల్యే.. పార్టీ పదవికి రాజీనామా చేసిన తెలంగాణ సీనియర్ నేత ఈటల రాజేందర్ ఇప్పుడు పాదయాత్ర చేస్తున్నారు. త్వరలో జరిగే ఉప ఎన్నికల్లో తన సత్తా చాటేందుకు పాదయాత్రకు మించిన మార్గం మరొకటి లేదన్నట్లుగా ఆయన ఫిక్సు కావటమే కాదు.. తమ మీద వచ్చిన ఆరోపణల్ని పాదయాత్ర ద్వారా సమాధానం ఇచ్చుకుంటూ సాగుతున్నారు.
మరోవైపు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా పాదయాత్రను షురూ చేశారు. 2023లో ఎన్నికల సమయానికి మరింత భారీగా పాదయాత్ర చేయాలన్న తలంపులో.. తాజాగా ఆయన చేస్తున్న పాదయాత్రకు సానుకూల స్పందన లభిస్తుందన్న మాట వినిపిస్తోంది. పాతబస్తీలోని చార్మినార్ వద్ద బండి సంజయ్ చేపట్టిన పాదయాత్రకు వచ్చిన స్పందన చాలామందిని ఆశ్చర్యపోయేలా చేసిందని చెబుతున్నారు.

ఇటీవల కాలంలో అంత భారీ జనసమీకరణ.. అందునా చార్మినార్ వద్ద చేప్టటటం బండి సామర్థ్యాన్ని తెలియజేసేలా చేసిందంటున్నారు. రానున్న రోజుల్లో పాదయాత్రలకు పలువురు నేతలుసిద్ధమవుతున్నారు. తెలంగాణలో పార్టీ పెట్టిన షర్మిల.. టీపీసీసీ చీఫ్ గా వ్యవహరిస్తున్న రేవంత్ రెడ్డి..బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండిసంజయ్ మాత్రమే కాదు.. ఏపీలో ఎన్నికల నాటికి చంద్రబాబు బస్సు యాత్ర.. లోకేశ్ సైకిల్ యాత్ర చేయటం ద్వారా.. ప్రజలకు మరింత దగ్గర కావటంతో పాటు.. అధికారాన్ని సొంతం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. మరి.. వీరి యాత్రలు ఎలాంటి ఫలితాన్ని ఇస్తాయన్నది చూడాలి.