Begin typing your search above and press return to search.

వంగవీటి ట్రంప్ కార్డు... చెక్ చెబుతారా.. ?

By:  Tupaki Desk   |   21 March 2022 10:32 AM GMT
వంగవీటి ట్రంప్ కార్డు...  చెక్ చెబుతారా.. ?
X
ఏపీలో కులాల సమీకరణల మీద పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఫలానా కులం ఓట్లు ఉంటే గెలుపు ఖాయమని బాహాటంగా రాజకీయ పార్టీ నేతలతో టీవీ డిబేట్లు పెడుతున్న సందర్భాలను అంతా చూస్తున్నారు. ఈ నేపధ్యం నుంచి చూసినపుడు అన్ని పార్టీలు కూడా కుల ఓట్ల వేటలోనే ఏదో విధంగా బిజీగా ఉంటున్నాయి.

టీడీపీ విషయంలో చూసుకుంటే గోదావరి జిల్లాలతో పాటు మరికొన్ని చోట్ల పోయిన సీట్లను దక్కించుకోవాలంటే జనసేనతో పొత్తు ఉండాల్సిందే అని భావిస్తోంది. జనసేనకు గోదావరి జిల్లాలలో బలమైన సామాజికవర్గం మద్దతు ఉందని భావిస్తున్నారు.

అంటే జనసేన టీడీపీల మధ్య పొత్తు కుదిరితే కచ్చితంగా గోదావరి జిల్లాలతో పాటు చాలా చోట్ల క్లీన్ స్వీప్ చేయవచ్చు అన్నది టీడీపీ ఆశ. ఇక టీడీపీ ఈ రకమైన ఎత్తుగడలతో వస్తే వైసీపీ ఊరుకుంటుందా. ఆ పార్టీ కూడా చేయాల్సింది చేస్తుంది అంటున్నారు.

కాపులకు ఐకాన్ లాంటి వంగవీటి రాధా రాజకీయ వారసుడు రాధా క్రిష్ణను తమ వైపునకు తిప్పుకునే పనిలో ఇపుడు వైసీపీ బిజీగా ఉంది అంటున్నారు. రాధాను వైసీపీలోకి తీసుకువచ్చే బాధ్యతను మంత్రి కొడాలి నానికి అప్పగించారని ప్రచారం సాగుతోంది. గత కొన్నాళ్ళుగా నాని అదే పని మీద ఉన్నారు అని అంటున్నారు.

ఇక్కడ ఈక్వేషన్స్ ఏంటి అంటే నానికి రాధా మంచి మిత్రుడు. ఆయనకు ఈయనకూ మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. ఇద్దరూ కూడా ఒకే మాట అన్నట్లుగా ఉంటారు. ఈ నేపధ్యంలో లేటెస్ట్ గా కూడా క్రిష్ణా జిల్లాలో ఒక ఆటోలో కూర్చుని సాధారణ మనుషులు మాదిరిగా ఈ ఇద్దరు నేతలు టీ తాగుతూ కనిపించారు.

ఇక రాధాక్రిష్ణ టీడీపీలో ఉన్నా ఆ పార్టీలో ఏ మాత్రం చురుకుగా లేరు అన్న మాట ఉంది. మరో వైపు రాధా కంటే అక్కడ బోండా ఉమా వంటి ఇతర కాపు నేతలకే చంద్రబాబు ప్రయారిటీ ఇస్తున్నారు అన్న చర్చ అయితే రాధా వర్గంలో ఉందని అంటున్నారు. ఇది చాలదన్నట్లుగా జనసేనతో పొత్తు పేరిట కాపులను తన వైపునకు మళ్ళించుకునేందుకు టీడీపీ చూస్తోంది. అంటే రంగా కుమారుడు టీడీపీలో ఉన్నా కూడా బయట వారి కోసం ఆ పార్టీ వెంపర్లాడుతోంది అన్నదే రాధా వర్గీయుల ఆవేదన.

దీని మీదనే ఈ మధ్య విజయవాడలో జరిగిన రంగా విగ్రహావిష్కరణ సభలో రాధా కొన్ని సంచలన కామెంట్స్ చేశారు. తనను ఏ పార్టీ సరిగ్గా ఉపయోగించుకోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ఏ హోదా అవసరం లేదని, రంగా కుమారుడు అన్న పెద్ద హోదా జీవితాంతం తనతోనే ఉంటుందని కూడా చెప్పుకున్నారు.ఈ మాటలతో ఆయనలో అసంతృప్తి ఎక్కడో ఉందని అర్ధమవుతోంది.

ఈ నేపధ్యంలో ఆయన్ని వైసీపీ వైపునకు తీసుకువస్తారా అన్న చర్చ మరింత జోరుగా సాగుతోంది. ఇక ఒక వైపు జనసేన టీడీపీ పొత్తు దాదాపుగా కన్ ఫర్మ్ అవుతున్న వేళ వైసీపీ దానికి చెక్ పెట్టేలా వంగవీటిని తమ వైపు తిప్పుకోవాలనుకుంటోంది. వంగవీటి బ్రాండ్ ఇమేజ్ గొప్పదని, కోస్తా గోదావరి జిల్లాలలో కాపులు ఆ విధంగా టర్న్ అవుతారని వైసీపీ ఆలోచనలు చేస్తోంది. ఇక రాధా సైతం ఒకసారి హైదరాబాద్ లో కాపుల మీటింగ్ కి వెళ్ళి వచ్చారు.

ఆ తరువాత విశాఖ మీటింగులో ఆయన కనబడలేదు. టీడీపీలో కొందరు నాయకులకే అక్కడ ప్రయారిటీ దక్కడం వల్లనే ఆయన అలా సైడ్ అయ్యారని అంటారు. మొత్తానికి రాధా అయితే ఇపుడు సొంతంగా తన సత్తా చాటాలనుకుంటున్నారు అని తెలుస్తోంది. అయితే ఎన్నికల రాజకీయాల్లోకి దిగినపుడు ఏదో ఒక పార్టీ అండ ఉండాలి. అందుకే ఆయనకు వైసీపీ గేలం వేస్తోంది అని ప్రచారం సాగుతోంది. రాధా కనుక వైసీపీ వైపు ఉంటే ఏపీలో సామాజిక రాజకీయం కొంత బ్యాలన్స్ అవుతుందన్నదే ఆ పార్టీ ఆలోచన. చూడాలి మరి.