Begin typing your search above and press return to search.

కేంద్రమంత్రి గులాబీ పువ్వు ఇచ్చినా రిజెక్టు చేసిన విద్యార్థులు

By:  Tupaki Desk   |   7 March 2022 11:32 AM GMT
కేంద్రమంత్రి గులాబీ పువ్వు ఇచ్చినా రిజెక్టు చేసిన విద్యార్థులు
X
తరం మారుతోంది. కొత్త రక్తం భారతీయానికి సరికొత్త ఆర్థాన్ని ఇస్తోంది. ప్రాణాలు పోయే అనిశ్చితి పరిస్థితుల్లో.. మా పిల్లల్ని స్వదేశానికి తీసుకు రావాలన్న వేడికోళ్లు ఒకవైపు.. మరోవైపు పిల్లల్ని క్షేమంగా తీసుకొచ్చేందుకు కేంద్రంలోని మోడీ సర్కారు యుద్ధ ప్రాతిపదికన రియాక్టు అయి.. వారిని వెనక్కి తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం చేస్తున్న వేళ.. ఆ దేశంలో ఇరుక్కుపోయిన భారతీయ విద్యార్థుల్ని వెనక్కి తీసుకొచ్చే బాద్యతను చేపట్టింది మోడీ సర్కారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఢిల్లీకి చేరుకున్న విద్యార్థులకు గులాబీ పువ్వు చేతికి ఇచ్చి.. వెల్ కం చెబుతున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది.

ఆ మాటకు వస్తే.. ఒక్క కిషన్ రెడ్డికే కాదు.. కేంద్రం తరఫున ఎయిర్ పోర్టులో నిలబడి.. విద్యార్థులకు స్వాగతం చెప్పేందుకు వెళ్లిన వారికి ఇలాంటి ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఎందుకిలా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. ఒకవైపు ఉక్రెయిన్ లో చిక్కుకున్న విద్యార్థులను వెనక్కి తెచ్చేందుకు కేంద్రం బాగానే కష్టపడిందని చెప్పాలి. అయితే.. ఈ వేగం సరిపోదు. మరింత వేగంగా నిర్ణయాలు తీసుకోవాల్సిందన్న సూచనలు కొందరు చేస్తుంటే.. అదేం లేదు.. మోడీ సర్కారు బాగానే రియాక్టు అయ్యిందన్న మాటనుమరికొందరు చెబుతున్నారు.

ఇదిలా ఉండగా అప్పుడెప్పుడో ఇరాక్ యుద్ధం జరిగినప్పుడు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 1.2లక్షల మంది భారతీయుల్ని భారత్ కు తీసుకొచ్చిందని.. ఆ సందర్భంలో ఇప్పటి మోడీ ప్రభుత్వం మాదిరి గొప్పలు చెప్పుకోలేదని కొందరు మండిపడుతున్నారు. తాము చేసిన పని గురించి ప్రజలకు చెప్పుకోవటం.. ప్రచారం చేసుకోవటం నేరమైతే కాదు. అలా అని.. ప్రచారం మితిమీరితే.. ప్రజాలే ఛీ కొడతారు. అందుకే.. ప్రచారం చేయటం తప్పని చెప్పలేదు. మరి.. కాంగ్రెస్ అప్పట్లో మోడీ సర్కారు మాదిరి ప్రచారం చేసుకోలేదంటే.. అది వారి ఇష్టం.

నిజానికి అప్పటికి ఇప్పుడున్నట్లుగా ఇంటర్నెట్.. సోషల్ మీడియా.. వాట్సాప్ లాంటివేమీ లేవన్నది మర్చిపోకూడదు. ఏ మాటకు ఆ మాటే చెప్పాలి. మోడీ సర్కారు మాదిరి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పలు పెద్దగా చెప్పుకున్నది లేదు. ప్రచారం చేసుకున్నది లేదు. అది వారికి రాలేదనే చెప్పాలి. ఇక.. ఇప్పటి విషయానికి వస్తే. .ఎయిర్ పోర్టులో స్వాగతం పలుకుతూ.. విద్యార్థుల చేతికి గులాబీలు ఇవ్వటం తప్పేం కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కానీ.. వాటిని మాట వరసకు కూడా తీసుకోకుండా కొందరు రిజెక్టు చేసిన వైనానికి సంబంధించిన వీడియోలు వైరల్ గా మారాయి. విద్యార్థుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.

చదువు‘కొని’ విదేశాలకు వెళ్లిన వారిని అక్కడే వదిలేస్తే బాగుండేదని..తీసుకొచ్చి తప్పు చేశారంటూ పలువురు మండిపడుతుంటే.. మరికొందరు.. బాధ్యతకు ప్రచారానికి వాడుకోవటానికి తేడా ఉందని చెబుతున్నారు’ అంటూ స్పందిస్తున్నారు. ఇంకొందరు కాస్తంత ఘాటుగా స్పందిస్తూ.. ‘‘సిగ్గు ఉండాలి.. కనీస మర్యాదలు పాటించటం నేర్చుకోవాలి. అయినా కోట్లు పెట్టి చదివే వాళ్లను ఉచితంగా తీసుకురావటం తప్పు. వాళ్లను అక్కడే ఉంచాల్సింది.

ఇష్యూ ఏదైనా మనకు నచ్చని పార్టీ ప్రభుత్వాలను అప్రతిష్ట పాలు చేయటం మీ లాంటి వారికి తగదు’’ అని తిట్టి పోస్తున్నారు. రాజకీయాల్ని పక్కన పెడితే.. పెద్ద మనిషి.. వాళ్లు ఎవరైనా కావొచ్చు.. స్వాగతం అని చెబితే ఒక చిరునవ్వు నవ్వితే.. పోయేదేమీ లేదన్న విషయాన్ని మర్చిపోకూడదు. స్పందించకుండా ముఖం తిప్పుకోవటం.. చేతికి గులాబీ ఇస్తే.. తీసుకోకపోవటం లాంటి పనులు ప్రజల్లో మరింత ఏహ్య భావాన్ని కలిగిస్తాయని మాత్రం చెప్పక తప్పదు.