Begin typing your search above and press return to search.

ఆవిర్భావ వేళ లోకేశ్ నినాదం ఇదే ! ఏంటో తెలుసా ?

By:  Tupaki Desk   |   30 March 2022 6:38 AM GMT
ఆవిర్భావ వేళ లోకేశ్ నినాదం ఇదే ! ఏంటో తెలుసా ?
X
న‌ల‌భై వ‌సంతాల తెలుగుదేశం పార్టీ ఇవాళ న‌వోత్సాహంతో ఉంది. కార్మికుల శ‌క్తి నుంచి క‌ర్ష‌కుల స్వేదం నుంచి పుట్టిన పార్టీ త‌మ‌ది అని నాయ‌కులంతా చెబుతున్నారు.ఆ విధంగా అన్న ఎన్టీఆర్ డైలాగులో ఎన్నో త‌ప్పులున్నా అవేవీ గుర్తించ‌కుండానే ఇదే డైలాగ్ ను ప‌దే ప‌దే ప‌లుకుతున్నారు దిగువ స్థాయి నాయ‌కులు. స‌ర్లే భాష‌కు ప్రాధాన్యం ఇవాళ ఎంత‌న్న‌ది అటుంచితే లోకేశ్ త‌న‌దైన నినాదం ఒక‌టి వినిపించారు. ఒకే రాష్ట్రం ఒకే రాజ‌ధాని అన్న నినాదం ఇచ్చారు.

దీంతో వైసీపీ శ్రేణులు ఉలిక్కిప‌డ్డాయి.అస‌లే భూములున్నీ టీడీపీ ఖాతాలో ఉన్నాయి కానీ త‌మకు చెప్పుకోద‌గ్గ భూములేవీ అమ‌రావ‌తిలో లేవ‌ని జ‌గ‌న్ వ‌ర్గం అంత‌ర్మ‌థ‌నం చెందుతూ ఉంటే లోకేశ్ తూటా లాంటి మాట పేల్చారు. సంచ‌ల‌నం రేపారు.

అసలు రాజ‌ధాని లెక్కేంటంటే ఆ రోజు అమ‌రావ‌తిని ఎనౌన్స్ చేసిన‌ప్ప‌డు జ‌గ‌న్ పూర్తి మ‌ద్ద‌తు ఇచ్చి, రాజ‌ధాని నిర్మాణానికి 33 వేల ఎక‌రాల భూమి అవ‌స‌ర‌మా అని మాత్ర‌మే అన్నారు. రాజ‌ధాని అమ‌రావ‌తి అని చంద్ర‌బాబు అరిచిన‌ప్పుడు జ‌గ‌న్ కూడా అరిచాడు. కానీ ఆ అరుపు ఎవ్వ‌రికీ విన‌ప‌డ‌లేదు. అంతేకాదు నేను ఇక్క‌డే ఇల్లుక‌ట్టుకున్నాన‌ని ఇక్క‌డి నుంచి వెళ్లేదే లేద‌ని కూడా జ‌గ‌న్ చెప్పారు. అంటే ఏంటి ఆయ‌న‌కు ఆ రోజు అమ‌రావతిపై ప్రేమ ఉంది. కానీ ఎందుక‌నో 3 రాజ‌ధానుల డ్రామా మొద‌లుపెట్టారు. కానీ ఇప్పుడది స‌క్సెస్ కాలేదు.

దీంతో ఈ డ్రామాకు ఎలా ముగింపు ప‌ల‌కాలో తెలియ‌క త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్నారు. ఇదే ద‌శ‌లో టీడీపీ భూములు కొట్టేసింది అని, చంద్ర‌బాబు ఖాతాలోనే రాజ‌ధానికి చెందిన ఏడు వంద‌ల ఎక‌రాలు ఉన్నాయ‌ని అందుకే తాము విధాన ప‌రంగా ప‌సుపు పార్టీ పెద్ద‌ను వ్య‌తిరేకిస్తున్నామ‌ని అంటోంది వైసీపీ.

అంటే రాజ‌ధానిలో వైసీపీ భూములు లేవా అంటే ఉన్నాయి.ఆ రోజు వైసీపీతో స‌హా క‌మ్యూనిస్టులు కూడా భూములు కొనుగోలు చేశారు.కానీ కొన్నింటి నిర్మాణాల‌ను చంద్ర‌బాబు చేశార‌న్న అక్క‌సుతోనే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయ‌మ‌ని జ‌గ‌న్ అంటున్నారు. అదే ఇప్పుడు తీవ్ర వివాదాల‌కు కార‌ణం అవుతోంది. ల‌క్ష కోట్లుతో తాము రాజ‌ధాని అమ‌రావ‌తిని అభివృద్ధి చేయలేం అని జ‌గన్ తెలివిగా త‌ప్పుకుంటున్నారు. అంటే ఆ రోజు కేంద్రం ఇచ్చిన మూడు వేల కోట్ల రూపాయ‌ల ప‌నుల‌కు ఎవ‌రిది బాధ్య‌త?

అది ప్ర‌జ‌ల సొమ్ము.. క‌నుక లోకేశ్ ఒకే రాష్ట్రం ఒకే రాజ‌ధాని అంటూ మ‌ళ్లీ రియ‌ల్ వ్యాపారం ఆరంభించార‌ని వైసీపీ అంటోంది.అంటే ఈ రెండు పార్టీల‌కూ ప్ర‌జ‌ల క‌న్నా రాజ‌ధాని క‌న్నా సొంత వ్యాపారాల‌పై ఉన్న న‌మ్మ‌కం లేదా ప్రేమ కార‌ణంగానే త‌రుచూ నాట‌కీయ ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయే కానీ రాష్ట్రాభివృద్ధిపై వీరికి ఉన్న చిత్త‌శుద్ధి అన్న‌ది శూన్యం.