Begin typing your search above and press return to search.

షిర్డీలో లేటెస్ట్ పరిస్థితి ఎలా ఉందంటే?

By:  Tupaki Desk   |   19 Jan 2020 4:49 AM GMT
షిర్డీలో లేటెస్ట్ పరిస్థితి ఎలా ఉందంటే?
X
షిర్డీ సాయి జన్మస్థలం మీద తలెత్తిన వివాదం.. సంచలనంగా మారిన వైనం తెలిసిందే. షిర్డీ సాయి పుట్టిన పత్రి గ్రామానికి మహారాష్ట్ర సర్కారు ఏకంగా రూ.100 కోట్లు కేటాయిస్తూ చేసిన ప్రకటనపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మహారాష్ట్ర సర్కారు నిర్ణయం నేపథ్యంలో షిర్డీ టెంపుల్ ను నిరవధికంగా మూసివేస్తున్నట్లుగా తొలుత షిర్డీసాయి సంస్థాన్ పేర్కొన్నారు. తర్వాత తమ మాటల్ని దిద్దుకున్నారు.

ప్రభుత్వ నిర్ణయం మీద షిర్డీ బంద్ నకు స్థానికులు పిలుపునిచ్చారు. అదే సమయంలో షిర్డీలోని సాయి గుడిని మాత్రమే తెరిచి ఉంచాలన్న నిర్ణయాన్ని తీసుకున్నారు. తాజాగా తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా షిర్డీలో బంద్ నిర్వహిస్తున్నారు. షాపులన్ని బంద్ చేశారు. అయితే.. ఈ బంద్ తో సంబంధం లేకుండా షిర్డీ ఆలయం మాత్రం తెరిచే ఉంటుందని.. పూజాది కార్యక్రమాలు యథావిధిగా సాగుతాయని చెబుతున్నారు.

షిర్డీలో ఆసుపత్రులు.. ప్రసాద విక్రయ కేంద్రాలు.. భక్తుల నివాసాలు.. ఇలా అన్నింటిని యథా ప్రకారం తెరిచే ఉంచుతున్నారు. కాకుంటే.. దుకాణాల్ని మాత్రం మూసి ఉంచారు. బాబా జన్మస్థలం పత్రి అంటూ ముఖ్యమంత్రి ఉద్దవ్ చేసిన వ్యాఖ్యలపై షిర్డీకి చెందిన వారు తీవ్రంగా విభేదిస్తున్నారు. ఆయన ప్రకటనతో మా మనోభావాలు దెబ్బ తింటున్నాయని స్థానికులు పెద్ద ఎత్తున మీడియా ముందుకొచ్చి చెప్పటం గమనార్హం. తాజా పరిస్థితిని చూస్తే.. షిర్డీ పట్టణంలో బంద్ జరుగుతున్నప్పటికీ.. ఆలయాన్ని మాత్రం తెరిచే ఉంటారు. షిర్డీ సాయి దర్శనానికి వెళ్లే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగని పరిస్థితి నెలకొంది. కాకుంటే.. షాపులు మూసివేయటంతో షిర్డీ కాస్త కళ తప్పినట్లైంది.