Begin typing your search above and press return to search.

ఏపీలో జ‌గ‌న‌న్న 'బుజ్జ‌గింపుల' ప‌థ‌కం.. ఏం జ‌రుగుతోందంటే

By:  Tupaki Desk   |   12 April 2022 10:30 AM GMT
ఏపీలో జ‌గ‌న‌న్న బుజ్జ‌గింపుల ప‌థ‌కం.. ఏం జ‌రుగుతోందంటే
X
ఏపీలో జ‌గ‌న‌న్న బుజ్జ‌గింపుల ప‌ర్వం కొన‌సాగుతోంది. జగన్ కొత్త కేబినెట్‌లో స్థానం లభించలేదని పలువురు నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్న విష‌యంతెలిసిందే. ఈ నేప‌థ్యంలో నేతల అనుచరులు ఇప్పటికే రాజీనామాలు చేస్తామని ప్రకటించారు. అయితే అసంతృప్తిజ్వాలలను త‌గ్గించేందుకు వైసీపీ అగ్రనేతలు రంగంలోకి దిగి బుజ్జగింపుల పర్వం కొనసాగిస్తున్నారు. ఇప్పటికే బాలినేని మనసు మార్చుకోగా.. ఇతరుల అసంతృప్తిని తొలగించేందుకు పార్టీ ప్రయత్నం చేస్తోంది.

మంత్రి పదవులు రాని అసంతృప్త ఎమ్మెల్యేలకు బుజ్జగింపులు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా సీనియ‌ర్ నేత‌, 5 సార్లు ఎమ్మెల్యే అయిన‌.. మాచ‌ర్ల ప్రజాప్ర‌తినిధి పిన్నెల్లి రామ‌కృష్ణారెడ్డి త‌న‌కు మంత్రి ప‌ద‌వి ద‌క్కుతుంద‌ని అనుకున్నారు.కానీ రాలేదు. దీంతో ఆయ‌న తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేయ‌డంతోపాటు.. అనుచరులు కూడా టైర్లు కాల్చి, బైకులు కాల్చి ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. దీంతో రంగంలోకి దిగిన‌.. సీఎం.. ఆయ‌న‌తో మాట్లాడాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఆదేశించారు. సచివాలయంలో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి.. పెద్దిరెడ్డిని కలిశారు. ఆయన పిన్నెల్లిని బుజ్జగిస్తున్నారు.

ఇక‌, మ‌రోనేత‌.. ప్ర‌స్తుత ఎన్టీఆర్ జిల్లాలోని జ‌గ్గ‌య్య‌పేట ఎమ్మెల్యే.. సామినేని ఉద‌య భానును కూడా సీఎంవోకి రావాలంటూ.. క‌బురు అందింది. దీంతో ఎమ్మెలే ఉదయభాను సీఎంను కలవనున్నారు. ఆయ‌న‌ను ఏకంగా సీఎం బుజ్జ‌గించ‌నున్నారు. మ‌రోవైపు.. ఇప్ప‌టికే.. ఆగ్ర‌హంతో ఉన్న మాజీ మంత్రి బాలినేని బుజ్జగింపుల పర్వం ముగిసింది. మంత్రివర్గంలో స్థానం దక్కనందుకు అసంతృప్తితో రగిలిపోయిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఎట్టకేలకు శాంతించారు. ఆదివారం నుంచి సోమవారం సాయంత్రం వరకు తన ఆగ్రహాన్ని మౌనంగానే వ్యక్తపరిచిన బాలినేని.. చిట్ట చివరకు దిగివచ్చారు.

మ‌రోవైపు తాజా మాజీమంత్రి సుచరిత శాసనసభ్యత్వానికి రాజీనామా సమర్పించారు. ఆమె వర్గీయులు పలువురు అదే బాటలో పదవులకు రాజీనామాలు చేస్తున్నట్లు ప్రకటించారు. సుచరిత విషయంలో మాత్రం పార్టీ ప్రాంతీయ బాధ్యుడైన ఎంపీ మోపిదేవి వెంకటరమణ విఫలయత్నం చేశారు. పాత మంత్రివర్గంలో కీలకశాఖ బాధ్యతలు చూసిన మాజీమంత్రి రాజీనామా పత్రం సమర్పించిన రోజే విజయవాడలో ఇల్లు ఖాళీ చేసి నేరుగా చెన్నైకి వెళ్లిపోయారు.

అక్కడ సీఎం సన్నిహిత బంధువుతో తన ఆవేదన పంచుకున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. 'జగన్‌కు సూయిసైడ్‌ స్క్వాడ్‌ వంటి మమ్మల్ని ఎందుకు తొలగించారో అర్థం కావటం లేదని' ఇద్దరు మాజీలు వ్యాఖ్యానిస్తున్నట్లు సమాచారం. ప్రతిపక్షంపై నిత్యం దారుణమైన విమర్శలతో విరుచుకుపడే ఓ తాజా మాజీ పేరు ఆఖరి నిమిషం వరకు కొనసాగింపు జాబితాలో ఉందని, ఓ సలహాదారు జోక్యంతో తొలగించారనే ప్రచారం పార్టీ వర్గాల్లో నడుస్తోంది. దీన్ని తాజా మాజీ నమ్మనట్లు కనిపిస్తున్నా.. ఆయన వర్గీయులు మాత్రం ఈ పరిణామాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు.

ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు అనుచరులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అన్నా రాంబాబుకు మంత్రి పదవి రాలేదనంటూ కంభంలో ఆయన అనుచరుల రాస్తారోకో చేశారు. అలాగే కంభంలో ఆర్యవైశ్యులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేసి నిరసన చేపట్టారు. దీంతో అన్నాను బుజ్జ‌గించాలని భావిస్తున్నా.. ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రూ రంగంలోకి దిగ‌లేదు.

ఇక‌, విజయవాడలో ఉన్న పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి నివాసానికి ఎంపీ మోపిదేవి వెంకటరమణ బుజ్జ‌గించేందుకు వెళ్లారు. మంత్రి పదవి రాలేదని అసంతృప్తితో ఉన్న పార్థసారథితో ఆయన చర్చించారు. పార్థసారథికి మంత్రి పదవి రాకపోవడంపై ఆయన అనుచరులు, పెనమలూరు నియోజకవర్గ కార్యకర్తలు ఆగ్రహంతో ఉన్నారు. మొత్తానికి ఈ బుజ్జ‌గింపుల ప‌ర్వం ఎన్ని రోజులు ప‌డుతుందో చూడాలి. ఏం జ‌రుగుతుందో చూడాల‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.