Begin typing your search above and press return to search.

ఐపీఎల్ అంటే ఆటే కాదు.. అంతకుమించి వివాదాలూ..

By:  Tupaki Desk   |   18 March 2022 11:36 AM GMT
ఐపీఎల్ అంటే ఆటే కాదు.. అంతకుమించి వివాదాలూ..
X
ప్రపంచంలోనే ధనిక లీగ్.. ఆకర్షణకు కొదవ లేదు.. ఆటగాళ్ల ప్రదర్శనలూ అదుర్స్.. అన్నిటికి మించి అదిరిపోయే ఆతిథ్యం.. పట్టిందల్లా బంగారమే అన్నట్లు ఎంత కొడితే అంత డబ్బు.. ఇదీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) గురించి సూక్ష్మంగా. కానీ, దీనితోపాటు వివాదాలూ ఉన్నాయి. విమర్శలూ ఉన్నాయి. విజయవంతంగా 15వ సీజన్ లోకి అడుగుపెడుతున్న ఐపీఎల్ లో చెరిగిపోని మచ్చలెన్నో.? కానీ, భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ముందు ఇవేమీ వాదనకు రావడం లేదు. అందుకే స్పాట్ ఫిక్సింగ్ నుంచి షారుఖ్ పై నిషేధం వరకు.. ఏం జరిగినా.. ఐపీఎల్ కు అడ్డంకే కాలేదు. ఈ నెల 26 నుంచి 15వ సీజన్ ప్రారంభమవుతుంది. కొత్తగా 2 జట్ల చేరికతో మరింత భారీ లీగ్ గా మారింది. ఈ నేపథ్యంలో లీగ్ లో వివాదాస్పదంగా మారిన ఉదంతాలేమిటో చూద్దామా?

2008 లో మొదలు 2013లో పెద్ద దెబ్బ

ఐపీఎల్ లో తొలి వివాదం మొదటి సీజన్‌లోనే తలెత్తింది. ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్, ఫాస్ట్ బౌలర్ శ్రీశాంత్‌ని బహిరంగంగా చెంపదెబ్బ కొట్టాడు. 2008 ఏప్రిల్ 25న మొహాలీలో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్ తర్వాత శ్రీశాంత్ ఏడుస్తూ కనిపించాడు. దీనికి కారణమేమని ఆరా తీస్తే భజ్జీ అతడిని చెంపదెబ్బ కొట్టాడని చెప్పాడు. దీని తర్వాత హర్భజన్ 11 మ్యాచ్‌ల నిషేధానికి గురయ్యాడు. ఆ తర్వాత ఐదేళ్ల పాటు ఎదురులేకుండా సాగిన ఐపీఎల్ లో 2013లో అతిపెద్ద సమస్య ఎదురైంది. ముగ్గురు ఆటగాళ్లు స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఇందులో భారత ఫాస్ట్ బౌలర్లు శ్రీశాంత్, అంకిత్ చవాన్, అజిత్ చండీలా ఉన్నారు. వీరందరిపై బీసీసీఐ జీవితకాల నిషేధం విధించింది. అయితే, శ్రీశాంత్ దానిని సవాలు చేయడంతో అతని శిక్షను తగ్గించారు.

బెట్టింగ్ వివాదంలో చెన్నై సూపర్ కింగ్స్ యజమాని ఎన్ శ్రీనివాసన్ అల్లుడు గురునాథ్ మెయ్యప్పన్, రాజస్థాన్ రాయల్స్ యజమాని రాజ్ కుంద్రా దోషులుగా తేలారు. దీంతో చెన్నై సూపర్‌కింగ్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌పై రెండేళ్ల నిషేధం విధించారు.

షారుక్ ఖాన్‌ పై వేటు..

బాలీవుడ్ బాద్ షా, కోల్ కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) యజమాని షారుక్ ఖాన్ వాంఖడే స్టేడియంలోకి ప్రవేశించకుండా నిషేధానికి గురయ్యాడు. షారుక్‌నుగ్రౌండ్‌లోకి రాకుండా సెక్యూరిటీ గార్డు అడ్డుకున్నాడు. దీంతో బాద్ షాకు కోపం వచ్చింది. దీనిపై గ్రౌండ్ సిబ్బందితో అసభ్యంగా ప్రవర్తించాడనే ఆరోపణలు వచ్చాయి. తర్వాత ముంబై క్రికెట్ అసోసియేషన్ షారుక్‌ను స్టేడియంలోకి రాకుండా నిషేధించింది. ఈ నిషేధాన్ని 2015లో ఎత్తేశారు.

లలిత్ మోదీపై జీవితకాల నిషేధం..

అసలు ఐపీఎల్ కు ఊపిరి పోసింది లలిత్ మోడీ. ఈ ఆలోచన ఇంత విజయవంతం కావడానికి అతడే కారణం. అలాంటి లలిత్ ఇప్పుడు లీగ్ కే దూరమయ్యాడు. 2010లో డబ్బును దుర్వినియోగం చేశాడని ఆరోపణలు ఎదుర్కొన్నాడు. దీంతో బీసీసీఐ పదవి నుంచి సస్పెండ్ చేసింది. 2013 సంవత్సరంలో అతనిపై వచ్చిన ఆరోపణలన్నీ నిజమని నిరూపణ అయింది. క్రికెట్‌కు సంబంధించిన అన్ని కార్యకలాపాల నుంచి బీసీసీఐ అతడిపై జీవితకాల నిషేధం విధించింది.