Begin typing your search above and press return to search.

సీపీఎస్ కి నో ఎస్ ... అది రావణకాష్టమే...?

By:  Tupaki Desk   |   24 March 2022 2:30 AM GMT
సీపీఎస్ కి  నో ఎస్ ... అది రావణకాష్టమే...?
X
సీపీఎస్ అంటే కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం. దీని వల్ల ప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణ చేసే టైం లో భారీగా నష్టం చేకూరుతుంది.అందుకే వారు పాత పెన్షన్ విధానాన్ని కోరుకుంటున్నారు. నాడు కేంద్రంలోని మన్మోహన్ సింగ్ ప్రభుత్వం సీపీఎస్ విధానాన్ని దేశవ్యాప్తంగా అమలులోకి తెచ్చింది. అయితే దీని మీద రాష్ట్రాలు తమ సొంత నిర్ణయం తీసుకోవచ్చు అని పేర్కొంది.

పాత పెన్షన్ విధానాన్ని చూస్తే ఉద్యోగులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. దాని వల్ల వారికి చాలానే లాభం కలుగుతుంది. ఉద్యోగికి అప్పటికి ఉన్న చివరి జీతాన్ని పెన్షన్ కింద లెక్క కట్టినా రావాల్సిన ప్రాఫిడెంట్ ఫండ్, గ్రాట్యూటీ ఇత్యాదులు అన్నీ కలుపుకుంటే ఒక్కసారిగా కొన్ని పదుల లక్షల్లో జమ చేరుతుంది. అయితే కొత్తగా సీపీఎస్ విధానాన్ని 2004 నుంచి దేశంలో అమలు చేసేలా రూపొందించారు. అంటే ఆ తరువాత ప్రభుత్వ ఉద్యోగాలలో చేరిన వారికి పదవీ విరమణ ప్రయోజనాలు పెద్దగా రావు.

ఈ కారణంతోనే ఉద్యోగులు సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని గట్టిగా కోరుతున్నారు. నాడు చంద్రబాబు సర్కార్ మీద ఆశలు పెట్టుకుంటే ఆయన చేయలేనని చెప్పేశారు. అయితే వైఎస్ జగన్ పాదయాత్ర సందర్భంగా సీపీఎస్ రద్దుకు హామీ ఇచ్చారు. కానీ అది జరిగే విషయం కాదని ఆ తరువాత చెబుతున్నారు. ఇక తమకు ఈ విషయంలో అవగాహన లేక హామీ ఇచ్చామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సజ్జల రామక్రిష్ణారెడ్డి అన్నారంటేనే సీపీఎస్ కి వైసీపీ సర్కార్ నో అంటోందని అర్ధమైపోతోంది.

ఈ మధ్య ప్రభుత్వ ఉద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. తమకు కొత్త పే రివిజన్ కోసం వారు డిమాండ్ చేస్తూనే అందులో సీపీఎస్ రద్దుని మొదటి అంశంగా చేర్చారు ఇక ప్రభుత్వంతో చర్చల సందర్భంగా కూడా సీపీఎస్ రద్దు మీదనే పీట ముడి పడిపోయింది. ఈ విషయంలో చర్చల ద్వారా పరిష్కరిస్తామని ప్రభుత్వం నాడు చెప్పింది.

అయితే లేటెస్ట్ గా శాసనమండలి సమావేశాల్లో రాష్ట్ర ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి అయితే సీపీఎస్ రద్దు అన్నది అంత సులభంగా జరిగే పని కాదని చెప్పడం విశేషం. దీని మీద ప్రభుత్వం గత కొంతకాలంగా కసరత్తు చేస్తోందని కూడా ఆయన చెప్పుకొచ్చారు. అదే విధంగా ముఖ్యమంత్రి కూడా ప్రతీ వారం ఈ అంశం మీద సమీక్ష చేస్తున్నారు అని చెప్పారు. ఇక దీని మీద ప్రభుత్వం త్వరలోనే విధానపరమైన ప్రకటన చేస్తుందని కూడా బుగ్గన అంటున్నారు.

అయితే ప్రభుత్వం చెబుతున్న దాన్ని బట్టి చూస్తే సీపీఎస్ రద్దుకు సర్కార్ నో అనే సీన్ ఉంటుందని ఊహిస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగులకు జీతభత్యాలు పెరిగాయి. కొత్త పీయార్సీ వల్ల ఏటా పది వేల నుంచి పన్నెండు వేల కోట్ల భారం పడింది అని ప్రభుత్వం అంటోంది. మరో వైపు చూస్తే పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వలేకనే వారి రిటైర్మెంట్ వయసుని 62కి ప్రభుత్వం పెంచింది. ఇంకో వైపు చూస్తే సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం తెస్తే కనుక ఏకంగా ఒక మాదిరి ఉద్యోగికే రిటైర్మెంట్ బెనిఫిట్స్ కింద దాదాపుగా కోటి రూపాయల వరకూ చెల్లించలసి ఉంటుంది.

మరి ఏపీలో చూస్తే తాజాగా ప్రభుత్వం చెప్పిన లెక్కన ప్రకారమే ఆరున్నర లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. వీరిలో ప్రతీ ఏటా అయిదు శాతం రిటైర్ అయినా కూడా ప్రభుత్వానికి అది పెను అర్ధిక భారం అవుతుంది. అందుకే ఈ విషయం మీద ఉధ్యోగులకు నచ్చచెప్పాలనే సర్కార్ ఆలోచనగా ఉంది అంటున్నారు. ఈ ఏప్రిల్ 4వ తేదీ తరువాత ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి వయా మీడియాగా ఈ విషయంలో ఏదో పరిష్కారం కనుగొనాలని చూస్తున్నారు. మరి దాని మీద ఉద్యోగులు ఒప్పుకుంటేనే సాధ్యపడుతుంది. కానీ ప్రభుత్వ ఉద్యోగులు సీపీఎస్ రద్దు తప్ప మరేదీ పరిష్కారం కాబోదు అంటున్నారు అంటే ఇది ఏపీలో సర్కార్ కి ఉద్యోగులకు మధ్య రావణ కాష్టంగానే ఉంటుందని అర్ధమవుతోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.