Begin typing your search above and press return to search.

స్పీకర్ పై సీఎం ఫుల్లు ఫైర్

By:  Tupaki Desk   |   15 March 2022 5:01 AM GMT
స్పీకర్ పై సీఎం ఫుల్లు ఫైర్
X
మామూలుగా అసెంబ్లీలో స్పీకర్ పై ప్రతిపక్షాల ఎంఎల్ఏలు గోల చేస్తుంటారు. తమ హక్కులను స్పీకర్ కాపాడటం లేదంటు ఫుల్లుగా ఫైరవటం చాలా సహజం. కానీ బీహార్లో మాత్రం విచిత్రమైన ఘటన జరిగింది. అదేమిటంటే స్పీకర్ వ్యవహారశైలిపై ముఖ్యమంత్రి నితీష్ కుమారే రెచ్చిపోయారు. స్పీకర్ స్పీచ్ పై నితీష్ ఆగ్రహంతో ఊగిపోయారు. ఇంతకీ విషయం ఏమిటంటే బీహార్ అసెంబ్లీ స్పీకర్ విజయ్ కుమార్ సిన్హా బీజేపీ ఎంఎల్ఏ. బీజేపీ+జేడీయూ మిత్రపక్షాలు కాబట్టి సంకీర్ణ ప్రభుత్వం నడుస్తోంది.

ఈ నేపధ్యంలోనే స్పీకర్ తన నియోజకవర్గమైన లఖీసరాయ్ లో పర్యటించారు. స్పీకర్ పర్యటనలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. స్పీకర్ ను కలవటానికి వచ్చిన వారి విషయంలో పోలీసులు అనుచితంగా ప్రవర్తించారనే విషయంలో పెద్ద గొడవ జరిగింది.

స్పీకర్ ఫిర్యాదుతో శాసనసభ హక్కుల సంఘం పోలీసుల అనుచిత ప్రవర్తనపై విచారణ జరిపాలని డీజీపీని ఆదేశించింది. డీజీపీ విచారణ జరుగుతున్న సమయంలోనే ఎవరో కోర్టులో కేసు కూడా వేశారు. ఆ కేసును కోర్టు విచారణకు స్వీకరించింది.

అదే విషయాన్ని తాజాగా అసెంబ్లీలో బీజేపీ ఎంఎల్ఏలు లేవనెత్తారు. స్పీకర్ చర్చకు అనుమతించటంతో బీజేపీ సభ్యులు రెచ్చిపోయారు. ఇదంతా చూస్తున్న సీఎం నితీష్ కు ఒళ్ళుమండిపోయింది. వెంటనే స్పీకర్ వైఖరిపై ఆగ్రహంతో ఊగిపోయారు.

కోర్టు విచారణలో ఉన్న విషయమై అసెంబ్లీలో చర్చకు ఎలా అనుమతిస్తారంటు అభ్యంతరం వ్యక్తంచేశారు. అయినా స్పీకర్ పట్టించుకోకపోవటంతో నితీష్ మరింతగా రెచ్చిపోయారు. స్పీకర్ పై తీవ్రమైన ఆగ్రహం వ్యక్తంచేశారు.

నితీష్ ఆగ్రహం చూసిన తర్వాత స్పీకర్ కాస్త తగ్గారు. సభ్యులు లేవనెత్తిన కారణంగానే తాను చర్చకు అనుమతించినట్లు సమర్ధించుకున్నారు. అయితే విషయం తనది కాబట్టే స్పీకర్ చర్చకు అనుమతించిన విషయం అందరికీ అర్ధమైపోయింది. ఇదే విషయమై నితీష్ మళ్ళీ గట్టిగా చెప్పటంతో స్పీకర్ సదరు అంశాన్ని అంతటితో ముగించారు. మొత్తం మీద ముఖ్యమంత్రే స్పీకర్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన ఘటన దేశం మొత్తం మీద బీహార్లోనే మొదటిసారి జరిగిందేమో.