Begin typing your search above and press return to search.

మాస్టారుకు మార్కులేస్తారా సారూ ... ?

By:  Tupaki Desk   |   1 March 2022 1:30 AM GMT
మాస్టారుకు మార్కులేస్తారా సారూ ... ?
X
ఆయన రాజకీయాల్లో సీనియర్ మోస్ట్ నేత. ఎన్టీయార్ జమానా నుంచి రాజకీయాల్లో ఉన్న నేత. ఆయనే మాజీ మంత్రి దాడి వీరభద్రరావు. ఆయన పలు మార్లు మంత్రిగా పనిచేసారు. ఎమ్మెల్సీగా, శాసనమండలిలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా కూడా కీలకమైన బాధ్యతలను చేపట్టారు. ఇక చంద్రబాబుతో సరిపడక ఆయన వైసీపీ వైపు అడుగులు వేశారు. అలా 2014 ఎన్నికల్లో తన కుమారుడు దాడి రత్నాకర్ కి టికెట్ ఇప్పించుకున్నారు. అయితే విశాఖ పశ్చిమ నుంచి ఆయన పోటీ చేయడంతో నాన్ లోకల్ అన్న కారణం చేత ఓడిపోయారు.

ఆ తరువాత దాడి వైసీపీని వీడారు. ఇక ఈ మధ్యలో ఆయన టీడీపీలో చేరడానికి కూడా చూసారు అన్న టాక్ వచ్చింది. అలాగే అప్పట్లో ఆయన ఇంటికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా వచ్చారు. పార్టీలో చేరమని కూడా ఆహ్వానించారు. అయితే దాడి మాత్రం 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిపోయారు. నాడు జగన్ అనకాపల్లి టికెట్ ఇస్తారని భావించారు. కానీ దక్కలేదు. మూడేళ్ల కాలంలో నామినేటెడ్ పదవులు కూడా వరించలేదు.

అయినా సరే దాడి మాస్టార్ ఆశ మాత్రం అలాగే ఉంది. ఆయన జగన్ ఏదో ఒక పదవి ఇస్తారని భావిస్తున్నారు. ఇక తాజాగా విశాఖలో జరిగిన మిలాన్ వేడుకలకు జగన్ వచ్చినపుడు తన కుమారుడు రత్నాకర్ తో సహా దాడి మాస్టార్ వెళ్లి జగన్ని కలిసారు. ఆయనతో చాలా సేపు మాట్లాడారు. జగన్ సైతం ఆప్యాయంగానే రిసీవ్ చేసుకున్నారని దాడి అనుచరులు చెబుతున్నారు.

మరి దాడి మాస్టార్ కి జగన్ పదవి ఏదైనా ఇస్తారా అన్న చర్చ అయితే ఉంది. అయితే దాదాపుగా పదవులు అన్నీభర్తీ అయిపోయాయి. మరో దఫా ఎమ్మెల్సీ పదవులు 2023లో ఖాళీ అవుతాయి. బహుశా అందులో ఏదైనా ఒక దానికి దాడి మాస్టార్ కి హామీ లభించిందా అన్న చర్చ కూడా ఉంది. అయితే తన కుమారుడికి వచ్చే ఎన్నికల్లో అనకాపల్లి ఎమ్మెల్యే టికెట్ ని మస్టార్ కోరుకుంటున్నారు. పక్కా లోకల్ కార్డుతో పాటు బలమైన సామాజికవర్గం కూడా తమకు ప్లస్ గా ఉందని ఆయన బల్లగుద్దీ మరీ చెబుతున్నారు.

అయితే అనకాపల్లిలో అయితే జగన్ కి బాగా ఇష్టుడు అయిన గుడివాడ అమరనాధ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయనే వచ్చే ఎన్నికల్లో కూడా పోటీ చేస్తారు అని అంటున్నారు. ఆయన్ని కాదని మాస్టార్ మాటను జగన్ నెరవేరుస్తారా అన్నదే చర్చ. ఒక వేళ అలా కాకపోతే మాత్రం మాస్టర్ కి కానీ ఆయన కుమారుడికి కానీ ఎమ్మెల్సీ సీటు ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

మొత్తానికి జగన్ తమతో మాట్లాడిన తీరుతో పాటు, రిసీవ్ చేసుకున్న వైఖరితో దాడి శిబిరంలో కొత్త ఆశలు మొదలయ్యాయని అంటున్నారు. మాస్టారుగా ఎందరికో మార్కులేసిన దాడి వారికి జగన్ సార్ ఎన్ని మార్కులు వేస్తారు అన్నది చూడాలి మరి.