Begin typing your search above and press return to search.

మంత్రి ప‌త్తిపాటి స‌తీమ‌ణికి బాబు భూన‌జ‌రానా!

By:  Tupaki Desk   |   15 Feb 2019 5:34 AM GMT
మంత్రి ప‌త్తిపాటి స‌తీమ‌ణికి బాబు భూన‌జ‌రానా!
X
ఎన్నిక‌లు ముంచుకొస్తున్న వేళ‌లో వివాదాల‌కు తెర తీసే వ్య‌వ‌హారాలను ముట్టుకోవ‌టానికి కూడా ఇష్ట‌ప‌డ‌రు. కానీ.. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు రూటు కాస్త స‌ప‌రేటు. అధికారంలో ఉన్న‌ప్పుడే అన్ని చ‌క్క‌బెట్టుకోవాల‌న్న‌ట్లుగా ఆయ‌న తీరు ఉంటుంది. పేద‌ల‌కు తాయిలాలు ఇస్తున్నారంటే స‌ర్లేన‌ని స‌ర్దుకోవ‌చ్చు. కానీ.. మంత్రుల‌కు.. వారి స‌తీమ‌ణుల‌కు న‌జ‌రానాల రూపంలో బాబు స‌ర్కారు చేస్తున్న మేళ్లు చూస్తే అవాక్కు అవ్వాల్సిందే.

ఏపీ రాష్ట్ర పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖామంత్రి ప‌త్తిపాటి పుల్లారావు స‌తీమ‌ణికి చెందిన కంపెనీకి కారుచౌక ధ‌ర‌కు భూమిని క‌ట్ట‌బెట్ట‌టం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. స్వ‌ల్ప ధ‌ర‌కు ఏడు ఎక‌రాల భూమిని ఏపీ స‌ర్కారు కేటాయిస్తూ జీవోలు జారీ చేయ‌టం ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది.

మంత్రి ప‌త్తిపాటి పుల్లారావు భార్య వెంకాయ‌మ్మ గుంటూరు టెక్స్ టైల్ పార్క్ లిమిటెడ్ కంపెనీకి డైరెక్ట‌ర్ గా ఉన్నారు. ఈ కంపెనీకి ఏపీ స‌ర్కారు తాజాగా గుంటూరు జిల్లా చిల‌క‌లూరిపేట మండ‌లం గోపాల‌వారి పాలెంలో 6.96 ఎక‌రాల భూమిని కేటాయిస్తూ నిర్ణ‌యం తీసుకుంది. ల‌క్ష‌లు విలువ చేసే భూమిని కేవ‌లం ఎక‌రం రూ.5ల‌క్ష‌ల‌కే కేటాయించ‌టంపై ప‌లు సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

దాదాపు రూ.3.5కోట్లు విలువ చేసే భూమిని కేవ‌లం రూ.35ల‌క్ష‌ల‌కే క‌ట్ట‌బెట్టిన‌ట్లుగా ప‌లువురు త‌ప్పు ప‌డుతున్నారు. మ‌రికొద్ది రోజుల్లో ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ విడుద‌ల అవుతుంద‌న్న మాట జోరుగా వినిపిస్తున్న వేళ‌.. మంత్రుల స‌తీమ‌ణుల‌కు అతి త‌క్కువ ధ‌ర‌కు భూమిని కేటాయించ‌టంలో అర్థం లేద‌న్న విమ‌ర్శ ప‌లువురి నోటి నుంచి వ‌స్తోంది. ఇంత త‌క్కువ ధ‌ర‌కు భూమిని కేటాయించి వివాదాల్ని కొని తెచ్చుకోవ‌టం బాబుకు చేత‌నైనంత బాగా మ‌రెవ‌రికీ రాద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.