Begin typing your search above and press return to search.

ప్రచారానికి కొత్త పంథాను ఎంచుకొన్న లాలూ..!

By:  Tupaki Desk   |   25 Jun 2015 5:43 AM GMT
ప్రచారానికి కొత్త పంథాను ఎంచుకొన్న లాలూ..!
X
ఆర్జేడీ అధినేత, బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్‌ యాదవ్‌ త్వరలో జరగనున్న తమ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు కొత్త రకంగా సిద్ధం అవుతున్నాడు. దేశ రాజకీయ నేతల్లో చాలా ప్రత్యేకమైన తీరును ప్రదర్శించే లాలూ ఇప్పుడు మరోసారి తన ప్రత్యేకతను చూపిస్తున్నాడు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ప్రత్యేక పంథాతో వార్తల్లోకి వచ్చాడు.

గుర్రపు బగ్గీల్లో తిరుగుతూ ఎన్నికల ప్రచారం చేశారట లాలూ. వివిధ పార్టీలతో కలిసి జనతా కూటమిగా లాలూ అండ్‌ కో ఈ ఎన్నికల్లో పాల్గొంటోంది. ఈ సందర్భంగా తమ కూటమిని గెలిపించుకొనేందుకు లాలూ స్వయంగా ప్రచారం చేయనున్నాడు. ఈయనకు ముఖ్యమంత్రి పదవిని అధిష్టించే అవకాశం లేదు. గడ్డి స్కామ్‌లో దోషిగా నిరూపితం అయినందున లాలూ ఈ అవకాశాన్ని కోల్పోయాడు.

అయితే భారతీయ జనతా పార్టీని ఓడించాలని మాత్రం ఈయన కంకణం కట్టుకొన్నాడు. అందుకోసం ఇప్పుడు కాంగ్రెస్‌, జేడీయూ వంటి పార్టీలతో కలిసి పనిచేయనున్నాడు లాలూ. మరి ప్రచారంలో తన ప్రత్యేకతను చూపిస్తూ లాలూ గుర్రపుబండ్లలో తిరిగి ఎన్నికల ప్రచారం చేయాలని భావిస్తున్నాడు. దీన్ని సింప్లిసిటీగా చెప్పుకొంటున్నాడాయన.

బీజేపీ నేతలు ఖరీదైన కార్లలో.. హెలికాప్టర్లలో తిరుగుతూ ఎన్నికల ప్రచారం చేసుకొంటారని.. తను మాత్రం గుర్రపు బండ్లలో తిరుగుతానని లాలూ ప్రకటించుకొన్నాడు. దీని వల్ల కొంతమంది గుర్రపుబగ్గీ యజమానులకు కూడా ఉపాధిలభిస్తుందని ఆయన చెప్పుకొచ్చాడు. మొత్తానికి లాటూ ఏదో కొత్త ఎత్తుగడతో జనాల్లో అటెన్షన్‌ తీసుకురావడానికి ప్రయత్నించుకొంటున్నట్టుగా ఉన్నాడు. ఇది ఏ మేరకు ఫలితాన్ని ఇస్తుందో!