Begin typing your search above and press return to search.

కేసీఆర్ ఉలిక్కిపడే మాట చెప్పిన లక్ష్మణ్

By:  Tupaki Desk   |   14 Nov 2019 6:14 AM GMT
కేసీఆర్ ఉలిక్కిపడే మాట చెప్పిన లక్ష్మణ్
X
తనకు మించిన తెలివైనోళ్లు తెలంగాణ రాష్ట్రం మొత్తం మీదా లేరన్న ఆత్మవిశ్వాసం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ లో కూసింత ఎక్కువనే మాట పలువురు రాజకీయ నేతల నోట వినిపిస్తూ ఉంటుంది. తెలంగాణలో టీఆర్ఎస్ కు మించిన ప్రత్యామ్నాయం లేదన్న భావన కూడా గులాబీ నేతల్లో కనిపిస్తూ ఉంటుంది. ఇదే.. కేసీఆర్ చేత తప్పుల మీద తప్పులు చేయిస్తుందన్న మాటను చెబుతుంటారు.

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి అనుకూల పరిస్థితులు ఉన్నాయని.. వివిధ పార్టీల నుంచి వలసలు పెరిగినట్లుగా తెలంగాణ బీజేపీ రాష్ట్రఅధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. తమకు తెలంగాణ అధికారపక్ష ఎమ్మెల్యేలు సైతం టచ్ లో ఉన్నట్లుగా చెప్పి ముఖ్యమంత్రి కేసీఆర్ ఉలిక్కిపడేలా చేశారని చెప్పాలి.

అడ్డదారుల్లో బీజేపీ అధికారంలోకి రావాలని తాము అనుకోవటం లేదని.. ప్రస్తుతం కర్ణాటక.. ఏపీతో పాటు తెలంగాణలోనూ బీజేపీ అనుకూల పవనాలు వీస్తున్నట్లు చెప్పారు. ఇటీవల జరిగిన హుజూర్ నగర్ ఉప ఎన్నికల ఫలితాన్ని నాటి నంద్యాల ఉప ఎన్నికతో పోల్చారు లక్ష్మణ్. తాను ఉప ఎన్నిక జరిగే సమయంలోనే ఈ విషయాన్ని చెప్పానని గుర్తు చేశారు. అధికారపక్షానికి అనుకూలంగా ఉప ఎన్నిక ఫలితం ఉంటుందని.. అంత మాత్రాన తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ వెంట ఉన్నారనుకోవటం తప్పన్నారు. రెండోసారి పవర్లోకి వచ్చాక కేసీఆర్ గ్రాఫ్ పడిపోతుంటే.. అందుకు భిన్నంగా ప్రధాని మోడీ గ్రాఫ్ పెరుగుతుందన్నారు.