Begin typing your search above and press return to search.

ఢిల్లీకి లక్ష్మణ్ .. కేసీఆర్ కి మూడినట్టేనా ?

By:  Tupaki Desk   |   2 Nov 2019 6:15 AM GMT
ఢిల్లీకి లక్ష్మణ్ .. కేసీఆర్ కి మూడినట్టేనా ?
X
తెలంగాణలో ఆర్టీసీ సమ్మె శుక్రవారం నాటికీ 28వ రోజుకి చేరింది. తమ 26 డిమాండ్ల సాధన కోసం తెలంగాణలో 48వేల మంది కార్మికులు 28 రోజులుగా సమ్మెను కొనసాగిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇన్ని రోజుల పాటు సమ్మె కొనసాగడం ఇదే తొలిసారి. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నప్పుడు 2011లో ప్రత్యేక రాష్ట్రం కోసం జరిగిన పోరాటంలో తెలంగాణ ఆర్టీసీ కార్మికులు 27 రోజుల పాటు సమ్మె చేశారు. సకల జనుల సమ్మెలో భాగంగా అప్పుడు 27 రోజుల పాటు సమ్మెలో పాల్గొన్నారు. ఆర్టీసీని ప్రస్తుతం ఉన్న దశలో నడిపించడంఅసాధ్యమని, విలీనం సాధ్యం కాదని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే స్పష్టం చేశారు.

ఈ నేపథ్యంలో 17 మందికిపైగా ఆర్టీసీ కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. అందులో కొందరు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. కొందరు గుండెపోటుతో కన్నుమూశారు. 28 రోజులుగా సమ్మె చేస్తున్న కార్మికులకు సెప్టెంబర్ నెల జీతాలు కూడా అందలేదు. సంస్థ ఖాతాలో కేవలం రూ.7 కోట్లు మాత్రమే నిధులు ఉన్నాయని, జీతాలు చెల్లించాలంటే రూ.200 కోట్ల నిధులు అవసరం అవుతాయని సంస్ధ తరఫున న్యాయవాదులు హైకోర్టుకు తెలిపారు. కార్మికులతో చర్చలు జరిపి సమ్మె కి ముగింపు పలకాలి అని హైకోర్టు చెప్పినా కూడా కేసీఆర్ సర్కార్ మాత్రం చర్చలకు ముందుకు రావడంలేదు. ఈ సమ్మె పై హైకోర్టు లో వాదనలు జరుగుతూనే ఉన్నాయి. పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలన్న హైకోర్టు తదుపరి విచారణను ఈనెల 7వ తేదీకి వాయిదా వేసింది.

ఇక సమ్మె ప్రభావం తో తెలంగాణ రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బస్సు లు నడుపుతున్నాం అని చెప్తున్నా కూడా అవి ఏమాత్రం సరిపోవడంలేదు. మరోవైపు తెరాస మినహా మిగిలిన అన్ని పార్టీలు కూడా ఆర్టీసీ సమ్మెకు మద్దతు ప్రకటించాయి. 28 రోజులు కావొస్తున్నా కూడా సమ్మె పై రాష్ట్ర ప్రభుత్వం ఎటు తేల్చకపోవడం తో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ హుటాహుటిన ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. ఆర్టీసీ సమ్మెపై కేంద్రానికి లక్ష్మణ్ నివేదిక సమర్పించనున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను లక్ష్మణ్ కలవనున్నారు. గత 28 రోజులుగా జరుగుతున్న సమ్మెని కేంద్రం కూడా పరిశీలిస్తూ వస్తుంది. నేడు దీనిపై లక్ష్మణ్ పూర్తీ నివేదిక ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో వెంటనే ఢిల్లీకి రావాల్సిందిగా లక్ష్మణ్‌కు హైకమాండ్ ఆదేశాలు జారీ చేసింది. లక్ష్మణ్ ఢిల్లీ పర్యటన నేపథ్యంలో ఆర్టీసీ జేఏసీ నేత ఆశ్వత్థామరెడ్డి, టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం తదితరులు ఆయనను కలిశారు. ఢిల్లీ కి లక్ష్మణ్ వెళ్లడంతో సమ్మె పై కేంద్రం ఎటువంటి నిర్ణయం తీసుకోపోబోతుందో అని రాజకీయ వర్గాలలో ఆసక్తికర చర్చ జరుగుతుంది.