Begin typing your search above and press return to search.

లఖింపూర్‌ ఖీరీ: కేంద్ర మంత్రి కుమారుడిపై మ‌ర్డ‌ర్ కేసు !

By:  Tupaki Desk   |   4 Oct 2021 7:39 AM GMT
లఖింపూర్‌ ఖీరీ: కేంద్ర మంత్రి కుమారుడిపై మ‌ర్డ‌ర్ కేసు !
X
ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌ లోని లఖింపూర్‌ ఖీరీ ఘ‌ట‌న‌కు సంబంధించి కేంద్ర హోంశాక స‌హాయ మంత్రి అజ‌య్ కుమార్ మిశ్రా కుమారుడి ఆశిష్ మిశ్రా పై మ‌ర్డ‌ర్ కేసు న‌మోదైంది. ఆశిష్ మిశ్రాతో పాటు ప‌లువురిపై ఎఫ్ ఐ ఆర్ న‌మోదు చేసిన‌ట్లు పోలీసులు తెలిపారు. కేంద్ర మంత్రి అజ‌య్ మిశ్రా, ఆయ‌న కుమారుడిపై రైతులు ల‌ఖింపురి ఖీరీ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. కేంద్ర చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్న రైతుల‌పైకి ఆశిష్ మిశ్రా కారు దూసుకెళ్ల‌డంతో న‌లుగురు రైతులు స‌హా 8 మంది ప్రాణాలు కోల్పోయిన విష‌యం తెలిసిందే.

ఈ ఘ‌ట‌న‌ను కాంగ్రెస్ స‌హా ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షాలు ఖండించాయి. అయితే, ఈ ఘ‌ట‌న‌తో త‌న కుమారుడికి ఎలాంటి సంబంధం లేద‌ని కేంద్ర‌మంత్రి అజ‌య్ మిశ్రా పేర్కొన్నారు. కొంత‌మంది ఆందోళ‌న‌కారులు క‌త్తులు, క‌ర్ర‌ల‌తో దాడి చేశార‌ని, ఆ స‌మ‌యంలో అక్క‌డ త‌న కుమారుడు ఉండి ఉంటే స‌జీవంగా వ‌చ్చేవాడు కాద‌ని కేంద్ర మంత్రి పేర్కొన్నారు రైతుల ఫిర్యాదు మేరకు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఎఫ్ ఐ ఆర్) లో కేంద్రమంత్రి, అతని కుమారుడితోపాటు పలువురు వ్యక్తుల పేర్లు కూడా నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఆశిష్ మిశ్రాను నడుపుతున్న కారు నిరసనకారుల గుంపుపైకి దూసుకెళ్లినట్లు రైతు సంఘాలు ఎఫ్ ఐ ఆర్‌ లో పేర్కొన్నాయి.

కేంద్రమంత్రి ఏకే మిశ్రాను పదవి నుంచి భర్తరఫ్ చేయాలని.. కేంద్రమంత్రి, అతని కుమారుడిపై కేసునమోదు చేయాలని, మరణించిన వారి కుటుంబానికి ఎక్స్ గ్రేషియాతోపాటు వారి కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలని, నిన్న జరిగిన సంఘటనపై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ.. రైతులు తనకు మెమోరాండం ఇచ్చినట్లు లఖింపూర్ ఖేరి కలెక్టర్ ఏకే చౌరసియా తెలిపారు. ఈ సంఘటనలో పాల్గొన్న వారందరిపై హత్య కేసు నమోదు చేయాలని సంయుక్త కిసాన్ మోర్చా డిమాండ్ చేసింది. కాగా దీనిపై టికోనియా పోలీసులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాపై హత్యా కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారని అధికారులు తెలిపారు.