Begin typing your search above and press return to search.

న‌డ్డాకు స్ట్రాంగ్ కౌంట‌ర్‌.. మంత్రి కేటీఆర్ ఏమ‌న్నారంటే!

By:  Tupaki Desk   |   7 May 2022 12:30 AM GMT
న‌డ్డాకు స్ట్రాంగ్ కౌంట‌ర్‌.. మంత్రి కేటీఆర్ ఏమ‌న్నారంటే!
X
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌, ఆయ‌న పాల‌న‌పై విమ‌ర్శ‌ల‌తో విరుచుకుప‌డిన బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డాపై అంత‌కు మించిన రేంజ్‌లో మంత్రి కేటీఆర్ పొలిటిక‌ల్ ఫిరంగులు పేల్చారు. దేశాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించిన మీరా.. మాకు నీతులు చెప్పేది.. అంటూ .. రెచ్చిపోయారు. రాజ్యాంగంలో పేర్కొన్న రాష్ట్రాల హ‌క్కుల‌ను కూడా కాల‌రాస్తున్న బీజేపీ నేత‌లు.. సుద్దులు చెప్ప‌డం సిగ్గుమా లిన త‌నానికి నిద‌ర్శ‌నం అని విరుచుకుప‌డ్డారు. దేశ ఆర్ధిక వ్యవస్థను భ్రష్టుపట్టించిన వారు తమపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. మోడీ పాలనలో 45 ఏళ్లలోనే నిరుద్యోగం గరిష్ఠానికి చేరిందని కేటీఆర్ విమర్శించారు.

గత 30 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా ద్రవ్యోల్బణం పెరిగిపోయిందని కేటీఆర్ అన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా భారత్‌లోనే వంట గ్యాస్‌ ధరలు ఎక్కువగా ఉన్నాయని ఆక్షేపించారు. దేశానికి, రాష్ట్రానికి ఏమీ చేయని బీజేపీ నేతలు తెలంగాణకు వచ్చి టీఆర్ ఎస్‌, కేసీఆర్‌ పాలనపై విమర్శలు చేయడం సిగ్గుచేటని కేటీఆర్‌ మండిపడ్డారు. రాజ్యాంగాన్ని కూడా కాల‌రాస్తూ.. కేంద్రంలోని మోడీ స‌ర్కారు రాష్ట్రాల‌పై పెత్త‌నం చేస్తోంద‌ని.. విమ‌ర్శ‌లు గుప్పించారు. వ‌న్ నేష‌న్ - వ‌న్ రేష‌న్ అంటున్న కేంద్రం.. వ‌న్ నేష‌న్‌-వ‌న్ ప్రొక్యూర్‌మెంట్ అని ఎందుకు చెప్ప‌డం లేద‌న్నారు.

న‌డ్డా ఏమ‌న్నారంటే..

రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. మహబూబ్‌నగర్‌లో 'జనం గోస-బీజేపీ' భరోసా పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. బండి సంజయ్ తలపెట్టిన ప్రజా సంగ్రామ యాత్రకు ప్రజల నుంచి సంపూర్ణ మద్దతుందన్నారు. దుబ్బాక, హూజూర్‌నగర్ ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ భయపడుతున్నారని వ్యాఖ్యానించారు. 8ఏళ్ల టీఆర్ ఎస్‌ వైఫల్యాలపై జేపీనడ్డా విరుచుకుపడ్డారు. ప్రాజెక్టుల అంచనాలు పెంచి సొమ్ము చేసుకున్నారని ఆరోపించారు. దేశంలోనే అత్యంత అవినీతి సర్కారంటూ జేపీ నడ్డా ధ్వజమెత్తారు. కాళేశ్వ‌రం ప్రాజెక్టును ఏటీఎంగా వాడుకుంటున్నార‌ని వ్యాఖ్యానించారు. దీనిపై నే కేటీఆర్ ఫైర్ అయ్యారు.