Begin typing your search above and press return to search.

రివ్యూ మధ్యలో ఆ ఇద్దరు ఎమ్మెల్యేలకు కేటీఆర్ ఫోన్ చేశారెందుకు?

By:  Tupaki Desk   |   2 March 2021 4:30 PM GMT
రివ్యూ మధ్యలో ఆ ఇద్దరు ఎమ్మెల్యేలకు కేటీఆర్ ఫోన్ చేశారెందుకు?
X
మొహమాటాలు పక్కకు వెళ్లిపోతున్నాయి. తప్పుల్ని.. నిర్లక్ష్యాన్ని ఏ మాత్రం సహించటం లేదు. గతంలో చూసిచూడనట్లుగా వదిలేసిన విషయాల్ని ఇప్పుడు సీరియస్ గా తీసుకోవటమే కాదు.. ఇలాంటి పప్పులు ఇక చెల్లవ్ బాస్ అన్న విషయాన్ని వారి ముఖానే చెప్పేసే వైనం ఈ మధ్యన టీఆర్ఎస్ లో ఎక్కువైంది. గతంలో ఎప్పుడూ లేనంత ఎక్కువగా పార్టీ వ్యవహారాల విషయంలో ఫోకస్ చేస్తున్నారు మంత్రి కేటీఆర్.

తాజాగా పార్టీ సభ్యత్వ నమోదు అంశంపై కేటీఆర్ అంతర్గత సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గాల వారీగా పార్టీ సభ్యత్వ నమోదు ఏతీరులో ఉందన్న విషయాన్ని సమీక్షించారు. ఈ సందర్బంగా కొన్ని జిల్లాల్లో సభ్యత్వ నమోదు తక్కువగా ఉండటంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సీరియస్ గా మాట్లాడుతూ.. పద్దతి మార్చుకోవాలని హెచ్చరించారు.

అంతేకాదు.. ఇద్దరు ఎమ్మెల్యేలకు రివ్యూ మధ్యలోనే ఫోన్ చేసినట్లుగా తెలుస్తోంది. సదరు ఇద్దరు ఎమ్మెల్యేల నియోజకవర్గంలో సభ్యత్వ నమోదు తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఉద్యమనేత రసమయి.. కోరుకంటి చందర్ లకు కేటీఆర్ క్లాస్ పీకినట్లుగా తెలుస్తోంది. సభ్యత్వ నమోదులో బాగా వెనుకబడిపోయారని.. రాష్ట్రంలోని మిగిలిన నియోజకవర్గాలతో పోలిస్తే.. వారు ప్రాతినిధ్యం వహిస్తున్న చోట పార్టీ సభ్యత్వ కార్యక్రమం మందగొడిగా సాగటంపై సీరియస్ అయ్యారు.

సభ్యత్వ నమోదును వారంలోపు అనుకున్న లక్ష్యాన్ని పూర్తి చేయాలన్నారు. అంతేకాదు.. సభ్యత్వ నమోదుతక్కువగా చేసిన ఎమ్మెల్యేల జాబితాను సిద్ధం చేసి..పార్టీ అధినేత కేసీఆర్ కు పంపుతామని కేటీఆర్ చెప్పారు. ఇలాంటి వారితో పార్టీ అధ్యక్షుల వారే స్వయంగా మాట్లాడతారని చెప్పారు. దీంతో.. సభ్యత్వ నమోదులో వెనుకబడిన ఎమ్మెల్యేలకు కొత్త టెన్షన్ పట్టుకున్నట్లుగా తెలుస్తోంది.