Begin typing your search above and press return to search.

సత్యనాదెళ్లతో కేటీఆర్ బిర్యానీ చర్చ.. ఆయనకే సాధ్యమేమో?

By:  Tupaki Desk   |   6 Jan 2023 7:34 AM GMT
సత్యనాదెళ్లతో కేటీఆర్ బిర్యానీ చర్చ.. ఆయనకే సాధ్యమేమో?
X
రెండు వేర్వేరు రంగాలకు చెందిన తోపులు లాంటి ప్రముఖులు భేటీ అయితే? వారి మధ్య చర్చకు వచ్చే అంశాలు ఎలా ఉంటాయి? ఏమేం ఉంటాయన్న ఆసక్తి చాలామందిలో ఉంటుంది. అందునా మైక్రోసాఫ్ట్ సీఈవోగా వ్యవహరిస్తున్న సత్యా నాదెళ్లతో తెలంగాణ రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ లాంటి వ్యక్తి కలిసి.. మాట్లాడినప్పుడు వారి మధ్య చర్చకువచ్చిన అంశాలు ఏమిటన్న దానిపై బోలెడంత ఆసక్తి ఉంటుంది.

దీనిపై తాజాగా ఆయన ఒక ట్వీట్ ద్వారా.. ఆ సందేహానికి తెర దించారు. సత్యనాదెళ్లతో భేటీతో ఈ రోజును ప్రారంభించినట్లుగా పేర్కొన్న కేటీఆర్.. తాము వ్యాపారం గురించి.. బిర్యానీ గురించి మాట్లాడుకున్నట్లుగా పేర్కొన్నారు. ఇదే విషయాన్ని ఆయన ట్వీట్ రూపంలో అందరికి పంచుకున్నారు. మామూలుగా అయితే.. సత్యానాదెళ్ల లాంటి బిజినెస్ టైకూన్.. ఒక రాష్ట్ర మంత్రితో భేటీ కావటం ఏ మాత్రం సాధ్యం కాదు. కానీ.. మంత్రిగా ఉన్నది కేటీఆర్ కావటంతో ఈ భేటీ సాధ్యమైంది.

పేరుకు మంత్రిగా వ్యవహరిస్తున్నప్పటికీ.. గడిచిన కొన్నేళ్లుగాడిఫ్యాక్టో సీఎంగా వ్యవహరిస్తూ.. అనధికారికంగా సీఎం చేసే పనులన్నింటిని చేస్తున్నారు కేటీఆర్. ప్రారంభోత్సవాలు మొదలు రాష్ట్రానికి వచ్చిన ప్రముఖులతో భేటీ అయ్యే విషయంలో ఆయన చొరవ తీసుకోవటంతో పాటు.. వారికి అవసరమైన వాటి సంగతులు చూస్తున్న ఆయన.. ఒక సీఎం చేయాల్సిన పనుల్ని మంత్రి హోదాలోనే చక్కబెట్టటం తెలిసిందే.

ఈ కారణంతోనే సత్య నాదెళ్ల లాంటి ప్రముఖులు మంత్రి కేటీఆర్ తో భేటీ కావటానికి మక్కువ చూపారని చెప్పాలి. తాజాగా తన భారత పర్యటన సందర్భంగా సత్య నాదెళ్ల షెడ్యూల్ ను చూస్తే.. మరే రాష్ట్రానికి చెందిన మంత్రితోనూ ఆయన ప్రత్యేకంగా భేటీ అయ్యింది లేదు. అదే సమయంలో.. ఆయనతో ఎవరైనా భేటీ అయితే.. వ్యాపారం గురించి.. భవిష్యత్తు అవకాశాల గురించి మాత్రమే మాట్లాడే వీలుంది.

అంతేతప్పించి.. బిర్యానీ గురించి మాట్లాడే అవకాశమే లేదు. సత్య నాదెళ్ల తొలినాళ్లలో హైదరాబాద్ లో చాలాకాలం గడపటం.. ఆయన ఇక్కడి ఫుడ్ గురించి అవగాహన ఉండటంతో.. వారి మాటల్లో బిర్యానీ గురించి ప్రస్తావన రావటం ఆశ్చర్యానికి గురి చేయదు. కేటీఆర్ తప్పించి మరెవరూ కూడా ఆయనతో హైదరాబాద్ బిర్యానీ గురించి మాట్లాడేంత చొరవ తీసుకోరు.

ఈ విషయంలో కేటీఆర్ కాస్త ముందుంటారని చెప్పాలి. తమ ప్రభుత్వంలో ఐటీకి.. ఐటీ అనుబంధ రంగాలకు ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సహకాలు.. అవకాశాల గురించి చర్చించినట్లుగా పేర్కొన్నారు. మొత్తంగా ఇరువురి మధ్య జరిగిన భేటీ.. హైదరాబాద్ మహానగరానికి అంతో ఇంతో మేలు జరగటం ఖాయమని మాత్రం చెప్పక తప్పదు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.