Begin typing your search above and press return to search.

మోడీ దెబ్బకు వ్యాపారాలన్నీ బంద్: కేటీఆర్

By:  Tupaki Desk   |   13 Nov 2016 11:42 AM IST
మోడీ దెబ్బకు వ్యాపారాలన్నీ బంద్: కేటీఆర్
X
పెద్దనోట్లను రద్దు చేస్తూ ప్రధాని నరేంద్రమోడీ తీసుకున్న నిర్ణయం ఎన్ని సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిందో చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన తీసుకున్న నోట్ల రద్దుపై కొందరు నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తితే.. మరికొందరు మాత్రం మౌనంగా ఉండిపోయారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు లాంటి వారు కొందరు మాత్రం పైకి మోడీని పొగిడేశారు. నోట్ల రద్దు నిర్ణయంపై పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేశారు.

ఇలా ఎవరికి వారు స్పందిస్తున్న వేళ.. తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మోడీ నిర్ణయాన్ని నేరుగా విమర్శించని ఆయన.. ప్రజల కష్టాల యాంగిల్ లో విషయాన్ని ప్రస్తావిస్తూ..ఎన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయో తెలుసా? అంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. మోడీ దెబ్బతో నల్లధనం మీదా.. నల్ల కుబేరులకు భారీ స్థాయిలో షాక్ తగులుతుందన్న అంచనాలు వ్యక్తమవుతుంటే.. మంత్రి కేటీఆర్ మాత్రం మోడీదెబ్బకు సామాన్య ప్రజలు విలవిలలాడుతున్న విషయాన్ని చెప్పుకొచ్చారు.

ఒక నిర్ణయం కారణంగా నష్టపడేవారితో పాటు లాభపడేవారు సైతం కొన్ని ఇబ్బందులకు గురి అవుతారు. కానీ.. కేటీఆర్ మాత్రం ఒక కోణాన్నిమాత్రమే తన మాటల్లో ప్రస్తావించటం గమనార్హం. ఇంతకీ కేటీఆర్ అన్న మాటల్ని ఆయన మాటల్లోనే చూస్తే.. ‘‘ప్రధాని మోడీ దెబ్బకు సామాన్య ప్రజలు విలవిల్లాడుతున్నారు. కొత్త నోట్ల కోసం ప్రజలంతా ఏటీఎంల వద్ద క్యూ కడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయంపైనా ప్రభావం పడింది. రియల్ ఎస్టేట్ పై దెబ్బ పడింది. ఈ రంగం ఒడిదుడుకులకు లోనైంది. రిజిస్ట్రేషన్లు తగ్గాయి. వాహన కొనుగోళ్లూ పడిపోయి మార్కెట్లో స్తబ్థత నెలకొంది. మరి.. ఈ పరిస్థితి తాత్కాలికమా? లేక దీర్ఘకాలికమా? అన్నది మరికొన్ని రోజులు ఆగితే కానీ చెప్పటం లేం’’ అని చెప్పుకొచ్చారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/