Begin typing your search above and press return to search.

కేటీఆర్ ‘ఆంధ్రా’ పోరు: విజయశాంతి సెటైర్లు

By:  Tupaki Desk   |   12 March 2021 7:30 AM GMT
కేటీఆర్ ‘ఆంధ్రా’ పోరు: విజయశాంతి సెటైర్లు
X
తెలంగాణ ఫైర్ బ్రాండ్, బీజేపీ నాయకురాలు విజయశాంతి సమయమొస్తే చాలు తనదైన శైలిలో సోషల్ మీడియాలో విరుచుకుపడుతూనే ఉన్నారు. కేసీఆర్ ఫ్యామిలీపై ఆమె వేసే పంచులు మామూలుగా ఉండవు. తాజాగా మంత్రి కేటీఆర్ పై సోషల్ మీడియాలో రాములమ్మ అదిరిపోయే సెటైర్లు వేశారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమిస్తానని కేటీఆర్ ప్రకటించిన నేపథ్యంలో విజయశాంతి నిప్పులు చెరిగారు. ఈ మేరకు ఫేస్ బుక్ లో ఓ పోస్ట్ పెట్టారు. ఇందులో కేటీఆర్ పై సెటైర్లు వేశారు. ‘అమ్మకు అన్నం పెట్టనోడు.. పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తున్నాడని.. తెలంగాణలో తరచూ వినిపించే సామెత ఇదీ.. సరిగ్గా టీఆర్ఎస్ నేతలు కూడా ఇదే బాటలో పయనిస్తున్నారని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు చూస్తే అర్థమవుతోందని’ విజయశాంతి సెటైర్లు వ్యక్తం చేశారు.

విశాఖపట్టణంలో ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ అంశంపై కేటీఆర్ స్పందిస్తూ అవసరమైతే అక్కడికెళ్లి నేరుగా ఉద్యమంలో పాల్గొంటామంటూ కేంద్రంపై చిర్రుబుర్రులాడారు. తెలంగాణ ఉద్యమకాలంలో కేసీఆర్ కుటుంబం ఎలాంటి హామీలిచ్చిందో ఒకసారి గుర్తు చేసుకుంటూ మంచిదని విజయశాంతి సెటైర్లు వేశారు.

ఉమ్మడి రాష్ట్ర పాలకుల హయాంలో మూతపడిన తెలంగాణలోని నిజాం షుగర్స్, ఆజంజాహి మిల్స్, ఆల్విన్ కంపెనీ, ప్రాగా టూల్స్ లాంటి పలు కంపెనీలను వంద రోజుల్లో తెరిపించి ఉద్యోగాలు కల్పిస్తామని హామీలిచ్చారlr... ఇప్పుడు మాటమాత్రంగానైనా వాటి ప్రస్తావన చెయ్యడం లేదు ఎందుకని కేసీఆర్, కేటీఆర్ లను పరోక్షంగా విజయశాంతి దెప్పి పొడిచారు.

ఇంతకీ ఇదంతా ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓట్ల కోసం మాటలే తప్ప, ఈ దొర కుటుంబపు అసలు ధోరణి ఆంధ్ర ప్రాంత ప్రజలపై ఎంత అసభ్యకరంగా... అవమానించే ధోరణిలో... బూతు మాటలతో కూడి ఉంటుందో ఒక్కసారి గతం గుర్తు చేసుకుంటే మంచిదని విజయశాంతి హితవు పలికారు. వీరి ప్రస్తుత ప్రకటనలను సమర్థిస్తున్న ఆయా నేతలు కొందరికి సరిగ్గా అర్థం అవుతుంది ఇది అంటూ చివర్లో విజయశాంతి ట్విస్ట్ ఇచ్చింది.