Begin typing your search above and press return to search.

బోటు ప్ర‌మాదంః గద్దలను వదలి చేపలను పట్టారు

By:  Tupaki Desk   |   16 Nov 2017 8:25 AM GMT
బోటు ప్ర‌మాదంః గద్దలను వదలి చేపలను పట్టారు
X
గోదావరి పుష్కరాల సంద‌ర్భంగా భక్తులు అనూహ్య‌రీతిలో క‌న్నుమూసిన ఉదంతం రీతిలోనే రాష్ట్రాన్ని కుదిపేసిన బోటు బోల్తా విషాదం కూడా ముగిసింది. ఈ ప్ర‌మాదంపై ప్రాథమిక దర్యాప్తు చేసిన సర్కారు, పెద్ద గద్దలను వదిలి చిరు చేపలపైనే వేటు వేసిందని ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. గత ఆదివారం బోటు బోల్తా పడి 23 మంది అమాయకుల ప్రాణాలు కృష్ణానదీ గర్భంలో కలిసేందుకు కారణమయిన రివర్ బోటింగ్ సంస్థకు చెందిన బినామీల సస్పెన్షన్ - అరెస్టులతో కథ కంచికి చేర్చి, ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు మంత్రులను మాత్రం సురక్షితంగా ఒడ్డుకు చేర్చిన వైనంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 23 మంది ప్రాణాలను కృష్ణార్పణం చేసిన రివర్ బోటింగ్ సంస్థకు భాగస్వాములుగా ఉన్నారని భావిస్తోన్న ఏడుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు బుధవారం సాయంత్రం విజయవాడ నగర పోలీసు కమిషనర్ గౌతం సవాంగ్ మీడియాకు వెల్లడించారు. అంతకుముందు.. పర్యాటక శాఖ మంత్రి అఖిలప్రియ కూడా ఆ ఘటనలో పాత్ర ఉన్న సంస్థ అధికారులు, సిబ్బంది పేర్లు వెల్లడించి, వారిపై వేటు వేస్తున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాతనే విజయవాడ కమిషనర్ ఏడుగురుని అరెస్టు చేసినట్లు ప్రకటించి కథను సుఖాంతం చేసే ప్రయత్నం చేశారు.

ఈ ఎపిసోడ్‌లో అందరినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచే ప‌లు సంఘ‌ట‌న‌లు చోటుచేసుకోవ‌డం గ‌మ‌నార్హం. స‌ద‌రు నిందితుల‌ను పోలీసులు అదుపులోకి తీసుకోకముందు, బోటింగ్ సంస్థ భాగస్వామి అయిన కొండలరావు ఒక అజ్ఞాత ప్రదేశంలో మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను బినామీ మాత్రమేనని చెప్పడం ప్రస్తావనార్హం. అటు ఏడుగురిని అరెస్టు చేసిన పోలీసులు గానీ, ఇటు తమ సంస్థ ఉద్యోగులపై వేటు వేసినట్లు ప్రకటించిన మంత్రి అఖిలప్రియ గానీ.. రివర్ బోటింగ్ సంస్థ బోటుపై నిషేధం విధించిన తర్వాత కూడా, తిరిగి ఆ బోటు జలప్రవేశం చేసి వ్యాపారం చేసుకునేందుకు ఎవరు సహకరించారన్నది మాత్రం వెల్లడించకపోవడాన్ని బట్టి, ఈ కేసును ఏవిధంగా సమాధి చేస్తున్నారన్నది స్పష్టమవుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. బోట్లపై విజిలెన్స్ నివేదికను ఎందుకు బయటపెట్టడం లేదన్నది మరో ప్రశ్న. ఈ వ్యవహారంలో నెలవారీ మామూళ్లు దండుకుంటున్నారన్న ఆరోపణలున్న స్థానిక విజిలెన్స్ అధికారుల పాత్ర కూడా పోలీసులు తేల్చలేదు. అదేవిధంగా ఇప్పటివరకూ అనుమతి లేని బోట్లను ఎన్ని సీజ్ చేశారు? లైసెన్సు లేని డ్రైవర్లు ఎంతమందిపై చర్యలు తీసుకున్నారు? ఆయా కంపెనీలకు నోటీసులిచ్చారా? లేదా? ఆ కంపెనీల యజమానులెవరన్నది మంత్రి ఇప్పటివరకూ బయటపెట్టకపోవడం బట్టి, ఈ వ్యవహారంలో ఏడుగురిని బలి చేసి, చేతులుదులుపేసుకునే ప్రయత్నంగా కనిపిస్తోందంటున్నారు.

కాగా, ఈ వ్యవహారంలో గుంటూరు జిల్లాకు చెందిన ఓ మంత్రి సతీమణి, కృష్ణా జిల్లాకు చెందిన ఓ మంత్రి ఒత్తిళ్లు ఉన్నాయన్న ఆరోపణలు మీడియా, సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నప్పటికీ దర్యాప్తులో దాన్ని తెరమరుగు చేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలాఉండగా, ప్రభుత్వం రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు సదుద్దేశంతో నిర్వహిస్తోన్న భాగస్వామ్య సదస్సులు, ఏవిధంగా దుర్వినియోగం అవుతున్నాయో తాజా ఘటన స్పష్టం చేస్తోంది. రివర్ బోటింగ్ భాగస్వాములుగా భావిస్తోన్న నిందితులు గతంలో విశాఖలో జరిగిన భాగస్వామ్య సదస్సులో పాల్గొని, పర్యాటక శాఖతో ఎంఓయూలు చేసుకున్న విషయాన్ని స్వయంగా పోలీసు కమిషనరే వెల్లడించారు. ఇదంతా ఒక పథకం ప్రకారమే వ్యూహాత్మకంగా జరిగినట్లు స్పష్టమవుతోందని ఆరోప‌ణుల వ‌స్తున్నాయి. ఎలాగూ టూరిజం శాఖలో ఏజీఎంతో పాటు, ఉద్యోగులు కూడా భాగస్వాములుగా ఉన్నందున అనుమతులు లేకపోయినా, ఎంఓయూను అడ్డుపెట్టుకుని ఏమైనా చేయవచ్చన్న ధీమా వారిలో కనిపిస్తోంది.