Begin typing your search above and press return to search.

కౌశిక్ రెడ్డి దేశం తరపున ఆడాల్సిన క్రికెటర్ అని తెలుసా !

By:  Tupaki Desk   |   2 Aug 2021 7:38 AM GMT
కౌశిక్ రెడ్డి దేశం తరపున ఆడాల్సిన క్రికెటర్ అని తెలుసా !
X
పాడి కౌశిక్ రెడ్డి .. గత కొన్ని రోజులుగా తెలంగాణ రాజకీయాల్లో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు. మాజీ మంత్రి ఈటెల రాజేందర్ రాజీనామా తర్వాత, హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి ఎవరు టీఆర్ ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తారనే వార్తలు వచ్చినప్పుడు ఎక్కువగా కౌశిక్ రెడ్డి పేరు తెరపైకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ తరపున గతంలో అదే నియోగకర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయిన కౌశిక్ రెడ్డి, గతనెల 21వ తేదీన టీఆర్ఎస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. టీఆర్ఎస్ పార్టీ అధినేత‌, సీఎం కేసీఆర్ స‌మ‌క్షంలో కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్‌ తీర్థం తీసుకున్నారు.

గులాబీ కండువా కప్పుకున్న పాడి కౌశిక్ రెడ్డి అతి తక్కువ సమయంలోనే బంపారాఫర్ కొట్టేశారు. కౌశిక్ రెడ్డిని నామినేటెడ్ కోటాలో ఎమ్మెల్సీగా నియమించాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది. గవర్నర్ ఆమోదంకోసం కేబినెట్ సిఫారసు చేసింది. నిన్న ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగిన తెలంగాణ మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ గెలుపే లక్ష్యంగా కౌశిక్ రెడ్డిని పదవి వరించినట్టు కనిపిస్తోంది.

ఐతే , ఈ వ్యవహారం ఇలా ఉంటే .. అతి త్వరలో ఎమ్మెల్సీ కాబోతున్నా పాడి కౌశిక్ రెడ్డి ఒకప్పుడు క్రికెటర్ అనే విషయం చాలా మందికి తెలియదు. హైదరాబాద్ రంజీ జట్టుకు ఆడిన పాడి కౌశిక్ రెడ్డి బౌలింగ్ ఆల్‌ రౌండర్‌ గా మంచి గుర్తింపు పొందాడు. టీమ్ ఇండియా క్రికెటర్లు అయిన అంబటి రాయుడు, శిఖర్ ధావన్, ప్రజ్టాన్ ఓజ, ఆర్పీ సింగ్‌ సహచరుడిగా ఎన్నో క్రికెట్ మ్యాచ్‌లు ఆడాడు. హైదరాబాద్ రంజీ జట్టుకు అంబటి రాయుడు కెప్టెన్‌ గా ఉన్నప్పడు కౌశిక్ రెడ్డి బౌలర్‌ గా జట్టులో కొనసాగాడు. 2006లో సౌత్ జోన్ వర్సెస్ శ్రీలంక మ్యాచ్ జరిగినప్పుడు కౌశిక్ రెడ్డి 5కు పైగా వికెట్లు తీయడమే కాకుండా 40 పరుగులతో మ్యాచ్‌ ను గెలిపించాడు. ఆ సమయంలో వీవీఎస్ లక్ష్మణ్ సౌత్ జోన్ కెప్టెన్‌ గా ఉన్నాడు.

అంతే కాకుండా ఆ సీజ్ మొత్తం కౌశిక్ రెడ్డి అద్భుతంగా రాణించాడు. ఆ సమయంలో భారత జట్టు ఆస్ట్రేలియాతో సిరీస్‌ కు తప్పకుండా ఎంపిక అవుతాడని అందరూ భావించారు. కానీ కౌశిక్ స్థానంలో ఆర్పీ సింగ్‌కు సెలెక్టర్లు చోటు కల్పించారు. దీనితో కౌశిక్ రెడ్డి తీవ్ర మనస్తాపానికి గురై సెలెక్టర్‌గా ఉన్న శివ్‌ లాల్ యాదవ్‌ పై మీడియా ముఖంగా తీవ్రమైన ఆరోపణలు చేశాడు, తనకు అవకాశాలు రాకుండా కక్ష పూరితంగా అడ్డుకుంటున్నాడని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. అదే సమయంలో జీ టీవీ ఆధ్వర్యంలో కపిల్ దేవ్ చైర్మన్‌ గా ఇండియన్ క్రికెట్ లీగ్ (ఐసీఎల్) ప్రారంభమైంది. హైదరాబాద్ కేంద్రంగా హైదరాబాద్ హీరోస్ అనే ఫ్రాంచైజీని కూడా స్థాపించారు. ఈ లీగ్ లో అప్పటి రంజీ ప్లేయర్లు చాలా మంది జాయిన్ అయ్యారు. అంబటి రాయుడు సహా ఇబ్రహీం ఖలీల్, ఇంద్రశేఖర్ రెడ్డి, కౌశిక్ రెడ్డి, శశాంక్ నాగ్, డి. వినయ్ కుమార్ వంటి క్రికెటర్లు ఐసీఎల్‌ లో చేరిపోవడంతో హైదరాబాద్ రంజీ జట్టులో సంక్షోభం వచ్చింది.

అయితే 2008లో ఐసీఎల్‌ కి ధీటుగా బీసీసీఐ మెగా లీగ్ ఐపీఎల్‌ ను ప్రకటించింది. దీంతో రెండు సీజన్లకే ఐసీఎల్ కనుమరుగైంది. అయితే ఐసీఎల్‌లో ఆడిన ప్లేయర్లను తిరిగి తీసుకోవడానికి బీసీసీఐ నిరాకరించింది. కానీ, పలు సంప్రదింపుల తర్వాత వారు తిరిగి సొంత గూటికి చేరుకున్నారు. అంబటి రాయుడు కూడా హైదరాబాద్ రంజీ జట్టులోకి వచ్చేశాడు. అయితే కౌశిక్ రెడ్డి మాత్రం తిరిగి రావడానికి ఇష్టపడలేదు. అంబటి రాయుడు వచ్చినా, అతడిపై జరుగుతున్న వేదింపులను దగ్గరగా చూసిన కౌశిక్ ఇక క్రికెట్‌ కు గుడ్‌బై చెప్పాడు. ఆ తర్వాత కుటుంబ వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చాడు.

ఒక ఫాస్ట్‌ బౌలర్‌ కు ఉండాల్సిన మంచి ఎత్తు కలిగి ఉండే కౌశిక్ రెడ్డి, ఆల్‌ రౌండర్‌ గా జాతీయ జట్టులో ఆడాల్సిన క్రికెటర్, చివరకు రాజకీయాల్లో స్థిరపడ్డాడు. 15 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లలో 47 వికెట్లు తీశాడు. 6/31 అతడి ఉత్తమ ప్రదర్శన. 5 వికెట్లు రెండు సార్లు, 10 వికెట్లు ఒక సారి తీశాడు. మొత్తం 299 పరుగులు చేయగా.. అందులో ఒక అర్ద సెంచరీ ఉన్నది. ఇక 12 లిస్ట్ ఏ మ్యాచ్‌ లు ఆడిన కౌశిక్ 17 వికెట్లు తీశాడు. 3/36 అతడి ఉత్తమ ప్రదర్శన. 2004 డిసెంబర్ 22న పంజాబ్‌ పై జరిగిన మ్యాచ్‌ తో రంజీల్లోకి అడుగుపెట్టాడు. చివరిగా 2007 జనవరి 10న పంజాబ్‌పైనే చివరి ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడాడు.