Begin typing your search above and press return to search.

ఆ వాయిస్ ఎంత ఫ్రెష్ గా ఉందో చూశావా జగన్

By:  Tupaki Desk   |   15 March 2016 6:31 PM GMT
ఆ వాయిస్ ఎంత ఫ్రెష్ గా ఉందో చూశావా జగన్
X
అవకాశం ఇస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ఇప్పటికి ఎంతోకొంత అర్థమై ఉండాలి. అంతా తానే అన్నట్లుగా వ్యవహరించే జగన్.. ఈ రోజు (మంగళవారం) ఏమనుకున్నారో కానీ.. స్పీకర్ పై పెట్టిన అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో ఆయన.. జూనియర్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డికి మాట్లాడే అవకాశం ఇచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అన్న వెంటనే ఇప్పటివరకూ గుర్తుకు వచ్చే రోజా.. జ్యోతుల నెహ్రూ.. చెవిరెడ్డి .. శ్రీకాంత్ రెడ్డి లాంటి వారే గుర్తుకు వస్తారు. వారు నోరు విప్పి మాట్లాడితే చాలు.. పరిస్థితి రచ్చ రచ్చగా మారుతుంది.

సౌండ్ ఎక్కువ.. విషయం తక్కువన్నట్లుగా వారి తీరు ఉంటుంది. కానీ.. అందుకు భిన్నంగా ఎక్కడా ఒక్క అన్ పార్లమెంటరీ పదం లేకుండా.. ఎలాంటి ఆవేశాలకు లోనుకాకుండా.. చెప్పాలనుకున్న మాటను సూటిగా చెబుతూ.. చురకలు వేసిన ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబును లక్ష్యంగా చేసుకున్న మాటలు అందరిని ఆకట్టుకునేలా ఉన్నాయనటంలో సందేహం లేదు. రొడ్డుగొట్టుడు డైలాగులకు భిన్నంగా.. లాజిక్ గా మాట్లాడటం.. ఆవేశాలకు భిన్నంగా నెమ్మదైన స్వరంతో వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేసిన కోటంరెడ్డి తన సత్తా చాటటమే కాదు.. జగన్ పార్టీకి ఒక చక్కటి ఆయుధం అయినట్లే.

ఆయన చేసిన వ్యాఖ్యల్ని చూసినప్పుడు.. తమ పార్టీకి చెందిన సభ్యురాలు రోజా పరుషంగా మాట్లాడారంటూ ఏడాది పాటు సస్పెండ్ చేశారని.. ఒకవేళ రోజా తప్పుగా మాట్లాడారనే అనుకున్నా.. చంద్రబాబు సోమవారం నాటి సభలో అంతకంటే పరుష పదజాలం వాడారన్నారు. ‘‘పిచ్చ పిచ్చగా ఉందా? మీ అంతు చూస్తాం’’ అంటూ చంద్రబాబు చేసిన పరుష వ్యాఖ్యలు ఏమిటి? వాటిపై చర్యలు లేవెందుకు? అని సూటిగా అడిగేశారు. ఈ వ్యాఖ్యలకు ముందు.. ముఖ్యమంత్రి చంద్రబాబు తనకు పెద్దన్న లాంటి వారని పొగుడుతున్నట్లే కనిపిస్తూ.. ఆయన్ను చూస్తే చాలా ముచ్చటగా.. ఆనందంగా ఉంటుందని.. మూడంటే మూడు అమలుకు సాధ్యం కాని హామీలు ఇచ్చి పార్టీని అధికారంలోకి తెచ్చారంటూ వ్యంగ్యంగా మాట్లాడటంతో విపక్ష సభ్యులు ఆనందంతో హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు.

కోటంరెడ్డి ప్రసంగం విన్న తర్వాత అనిపించేది ఒక్కటే.. దూకుడుతనం.. ఆవేశపూరిత ప్రసంగాలు ఆకట్టుకున్నా.. వాటి ప్రభావం మిరపకాయ బజ్జీ మాదిరే అనిపించినా.. దీర్ఘకాలంలో లేనిపోని సమస్యల్ని తీసుకురావటం ఖాయం. కానీ.. ఆలోచనతో చేసే ప్రసంగాలు పెరుగన్నం మాదిరి ఉంటాయని.. వాటి వల్ల ప్రత్యర్థి పార్టీలకు చెందిన వారిని కూడా ఆకర్షించొచ్చన్న విషయాన్ని కోటంరెడ్డి తన తాజా ప్రసంగంతో నిరూపించారని చెప్పక తప్పదు. తాజా ఉదంతం తర్వాత అనిపించేది ఒక్కటే.. అంతా తానై ఉండాలన్న వైఖరిని వదిలిపెట్టి.. కొత్త గొంతులకు జగన్ అవకాశం ఇస్తే.. ఆయన మీద భారం తగ్గటమే కాదు.. ఆయన మాటల్ని అదే పనిగా వింటున్న దానికి భిన్నంగా.. కాస్తంత రిలీఫ్ గా ఉంటుందన్న విషయాన్ని మర్చిపోకూడదు.