Begin typing your search above and press return to search.

ఐటీ వ‌ల‌లో మ‌రో బ్యాంకు

By:  Tupaki Desk   |   24 Dec 2016 4:31 AM GMT
ఐటీ వ‌ల‌లో మ‌రో బ్యాంకు
X
రూ.500 - రూ.1000 నోట్ల రద్దు అనంతరం యాక్సిస్ బ్యాంకులో నకిలీ ఖాతాల కుంభకోణం మరువక ముందే మరో ప్రైవేటు బ్యాంకు అదే బాటలో నడిచినట్టు బయటపడింది. యాక్సిస్ బ్యాంక్ కేసు వివరాలను పరిశీలిస్తున్న నేపథ్యంలో కోటక్ మహీంద్ర బ్యాంక్ ఖాతాలపై ఐటీ అధికారులు దృష్టి సారించగా ఈ విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. ఢిల్లీలోని కస్తూర్బాగాంధీ మార్గ్‌ లో ఉన్న కోటక్ మహేంద్ర బ్యాంకు బ్రాంచీలో కొందరు నకిలీ ఖాతాలు తెరిచి కోట్ల రూపాయల లావాదేవీలు నడుపుతున్నట్టు గుర్తించిన ఐటీ అధికారులు ఆ బ్యాంకులో సోదాలు చేశారు. ఈ సోదాల్లో పలు నకిలీ ఖాతాలు బయటపడ్డాయి.

కోట‌క్ మ‌హీంద్ర బ్యాంక్‌ లో రాధికాజేమ్స్ కంపెనీకి చెందిన ఖాతాలో రూ. 36.4 కోట్లు జమ అయినట్టు ఐటీ అధికారులు గుర్తించారు. అనంతరం ఆ సొమ్మును యాక్సిస్ బ్యాంకులోని ఎన్సీ జువెలర్స్ ఖాతాలోకి బదలాయించినట్టు కనుగొన్నారు. అయితే యాక్సిస్ బ్యాంక్ కేసు దర్యాప్తులో ఎన్సీ జువెలర్స్ ఖాతా నకిలీదని తేలింది. అలాగే కోటక్ బ్యాంక్‌ లో మరో 8నకిలీ ఖాతాలను ఐటీ అధికారులు గుర్తించారు. ఇవి రాజ్‌ కుమార్ - రమేశ్ చాంద్‌ లకు చెందినవి. ఈ ఖాతాల్లో రూ.32.25 కోట్లు డిపాజిట్ అయినట్టు కనుగొన్నారు. ఈ అకౌంట్లను నకిలీ కంపెనీల పేరుతో తెరిచారు. ఈ నగదును వేరే బ్యాంకు ఖాతాలకు ట్రాన్స్‌ ఫర్ చేయడానికి డీడీలను ఉపయోగించారు. కొందరు బ్యాంకు అధికారుల సహకారంతోనే ఈ తంతు జరిగిందని ఐటీ అధికారులు గుర్తించారు. ఐటీ సోదాలు వాస్తవమేనని, దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తామని బ్యాంకు ప్రతినిధి రోహిత్‌ రావు చెప్పారు.

ఇదిలాఉండ‌గా నైజీరియాకు చెందిన ఓ వ్యక్తి వద్ద రూ.58లక్షలు దొరికాయి. కోయంబత్తూరుకు వెళ్లడానికి ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఎయిర్‌ పోర్టుకు వ‌చ్చిన నైజీరియ‌న్ కదిలికలపై అనుమానం వచ్చిన అధికారులు తనిఖీ చేయగా దాదాపు రూ.58లక్షలు దొరికాయి. ఇందులో రూ.53.78లక్షలు కొత్త నోట్లు ఉన్నాయి. డైరెక్ట‌ర్ ఆఫ్ రెవెన్యు ఇంటెలిజెన్స్ అధికారులు వివ‌రాలు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు మొద‌లుపెట్టారు. కాగా, రాజస్థాన్‌ లోని జైపూర్‌ లో నగర పోలీసులు జరిపిన సోదాల్లో 34.50 లక్షలు విలువ చేసే కొత్త రూ.2వేల నోట్లు దొరికాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/