Begin typing your search above and press return to search.

టీఆర్ ఎస్ పై కొండా విమర్శలు.. వర్కవుట్ కాలేదు..

By:  Tupaki Desk   |   26 Nov 2018 5:23 AM GMT
టీఆర్ ఎస్ పై కొండా విమర్శలు.. వర్కవుట్ కాలేదు..
X
తెలంగాణ ఎన్నికల సమరం హాట్ హాట్ గా సాగుతోంది. ఈ నేపథ్యంలోనే టీఆర్ ఎస్ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కారుదిగి హస్తం గూటికి చేరారు. రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. ఇక హైదరాబాద్ వచ్చి తనకు టికెట్ ఇచ్చి గెలిపించిన టీఆర్ ఎస్ పార్టీ పై నాలుగు రాళ్లు వేశారు. పోయినవాళ్లందరికీ గత పార్టీలు ఎలానూ చేదుగానే ఉంటాయి కాబట్టి ఆయన పలు విమర్శలను సంధించారు. టీఆర్ ఎస్ ను ఒక ప్రొప్రయిటర్ కంపెనీగా అభివర్ణించారు. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఉద్యోగులకు హక్కులు - వాయిస్ ఉంటుందని.. ప్రొప్రయిటర్ కంపెనీలో మాత్రం ఉండవని ఆయన విమర్శించారు. కేసీఆర్ - కేటీఆర్ తీరుతో పార్టీ ఎంపీలు జితేందర్ రెడ్డి - కేశవరావుతోపాటు పలువురు నేతలు అసంతృప్తితో ఉన్నారని కొండా విమర్శించారు.

నాలుగున్నరేళ్లుగా టీఆర్ ఎస్ లో ఉండి అధికారం అనుభవించిన కొండా విశ్వేశ్వరరెడ్డి తాజాగా టీఆర్ ఎస్ లో ప్రజాప్రతినిధులకు ఆత్మగౌరవం లేదనడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. గాంధీ భవన్ లో మాట్లాడిన ఆయన మంత్రి ఈటెలకు అసెంబ్లీలో ప్రవేశ పెట్టేదాకా బడ్జెట్ గురించి తెలియదనడం విమర్శలకు తావిచ్చింది. అసెంబ్లీలో గంటన్నరపాటు చదివి బడ్జెట్ లెక్కలు చెప్పే ఈటల ప్రిపెరేషన్ బడ్జెట్ లెక్కలు తెలియకుండా ఎలా మాట్లాడుతారని.. కొండాకు ఈ విషయం తెలియదా అని గులాబీ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. ఉద్యమ సమయంలో పనిచేసిన వారికి టీఆర్ ఎస్ లో గౌరవం లేదని.. కొత్తగా వచ్చిన వారికే ప్రాధాన్యమిస్తున్నారని కూడా విమర్శించారు. ఇదే కాంగ్రెస్ లో ఎంతమంది ఉద్యమకారులకు టికెట్లు ఇచ్చారన్న విషయాన్ని మాత్రం మరిచిపోయారని గులాబీ దండు ప్రశ్నిస్తోంది..

నిజాం రాజును మించిన కేసీఆర్ నియంతృత్వ పాలన చేస్తున్నాడని కొండా విమర్శించారు. కానీ ఈ నాలుగున్నరేళ్లుగా ఎందుకు ఈయన పాలన బాగుందని కీర్తించావని టీఆర్ ఎస్ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. కొండా అసమర్థత, పనిచేయలేని నిస్సహాయత, చేతగానితనంతోనే టీఆర్ఎస్ లో చేరారని టీఆర్ఎస్ శ్రేణులు విమర్శలు గుప్పిస్తున్నాయి.

కేసీఆర్ పార్లమెంట్ సమీపంలో వెళ్లొద్దని ఆర్డర్ వేశారని కొండా చెప్పుకొచ్చారు. అలానే చేవెళ్ల, తాండూర్ కు కూడా వెళ్లవద్దని ఆదేశించారని వివరించారు. నిజానికి ఎంపీగా ఆయన ఎక్కడికైనా వెళ్లి పోయే హక్కు ఉంది.. పార్టీకి వ్యతిరేకంగా ఏదో చేస్తుండబట్టే అలా చేసి ఉంటారని.. కొండా కుట్రలతోనే ఆయన్ను దూరం పెట్టారని టీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు. పార్టీ మారినంత మాత్రానా ఇలా నిందలు వేయడం ఏం బాగోలేదని గులాబీ శ్రేణులు కౌంటర్ వేస్తున్నాయి.