Begin typing your search above and press return to search.

గోదారి గట్టుంది.. గట్టు మీద నెట్ ఉంది.. ఇంటర్నెట్ కోసం కోనసీమ వాసుల కష్టాలు!

By:  Tupaki Desk   |   1 Jun 2022 10:30 AM GMT
గోదారి గట్టుంది.. గట్టు మీద నెట్ ఉంది.. ఇంటర్నెట్ కోసం కోనసీమ వాసుల కష్టాలు!
X
ఆంధ్రప్రదేశ్ లో కోనసీమ జిల్లాకు అంబేడ్కర్ పేరు పెట్టడాన్ని నిరసిస్తూ అమలాపురంలో మే 24న అల్లర్లు, విధ్వంసం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. వీటికి సంబంధించి ఇప్పటికే దాదాపు 70 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ముందు జాగ్రత్త చర్యగా ఇంకా 144 సెక్షన్ కొనసాగిస్తున్నారు. పోలీసుల పహారా కూడా కొనసాగుతోంది. నలుగురికి మించి వ్యక్తులు గుమికూడకుండా పోలీసులు కఠిన చర్యలు అమలు చేస్తున్నారు.

మరోవైపు అసత్య వార్తలు, పుకార్లు, అబద్దాలు వ్యాపించకుండా పోలీసులు ఇంటర్నెట్ పై విధించిన నిషేధం కొనసాగుతోంది. ఇందులో భాగంగా అన్ని రకాల ఇంటర్నెట్ కంపెనీల సేవలను నిలిపివేశారు. దీంతో వర్కు ఫ్రమ్ హోమ్ విధానంలో ఉద్యోగాలు చేస్తున్నవారు తీవ్ర కష్టాలు పడుతున్నారు. ముఖ్యంగా సాఫ్ట్ వేర్ ఉద్యోగుల కష్టాలు చెప్పనలవి కాదు. నిత్యం మెయిల్స్, తదితరాలు పంపుకోవాల్సి ఉండటంతో ఇంటర్నెట్ లేక వారు చుక్కలు చూస్తున్నారు. ఒక్క అమలాపురంలోనే కాకుండా కోనసీమ జిల్లాల్లోని చాలా మండలాల్లో ఇంటర్నెట్ నిలిపివేశారు. దీంతో ఎక్కడికి వెళ్లామన్నా నెట్ లేక ఉద్యోగులు అష్ట కష్టాలు పడుతున్నారు.

అయితే చీకటిలో కాంతిపుంజంలా ఒక్క గోదావరి ఒడ్డున మాత్రమే ఇంటర్నెట్ సిగ్నల్స్ వస్తుండటంతో అంతా ల్యాప్ ట్యాపులు పట్టుకుని అక్కడకు పరిగెత్తుతున్నారు. తమ రోజువారీ విధి నిర్వహణలో భాగంగా పంపాల్సిన మెయిల్స్, డాక్యుమెంట్సు, వర్క్ షీట్లు తదితరాలను అక్కడే ఉండి పంపుకుంటున్నారు. కొత్తపేట, పి.గన్నవరం, పప్పులవారిపాలెం, వాడపాలెం, అవిడి, నరేంద్రపురం తదితర ప్రాంతాల నుంచి కపిలేశ్వరపురం మండలం కేదార్లంకకు వస్తున్నారు. అక్కడ మాత్రమే ఇంటర్నెట్ వస్తుండటమే ఇందుకు కారణం. దీంతో కేదార్లంకలో సందడి నెలకొంది.

కాగా, అమలాపురం విధ్వంసకర ఘటనతో సోషల్‌ మీడియాలో పుకార్ల నియంత్రణకు నిలిపివేసిన ఇంటర్నెట్‌ సేవలను మరో 24 గంటలు పొడిగించినట్లు కోనసీమ జిల్లా ఎస్పీ కేఎస్‌ఎస్‌వీ సుబ్బారెడ్డి తెలిపారు.

అయితే కోనసీమలో 16 మండలాలకు గాను 3 మండలాలకు మినహాయింపు ఇచ్చినట్లు తెలిపారు. సఖినేటిపల్లి, మలికిపురం, ఐ.పోలవరం మండలాల్లో ఇంటర్నెట్‌ సేవలను పునరుద్ధరించినట్లు వెల్లడించారు. మిగిలిన 13 మండలాల్లో ఇంటర్నెట్‌ నిలిపివేత బుధవారం కూడా కొనసాగుతుందని తెలిపారు. ఈ విషయంలో ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.

కాగా కోనసీమలో ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా అదుపులో ఉంది. అల్లర్లు, విధ్వంసం చోటు చేసుకున్న అమలాపురంతోసహా జిల్లాలోని మున్సిపాలిటీలు, మండల కేంద్రాలు, సున్నితమైనవిగా గుర్తించిన గ్రామాల్లో పోలీసుల బందోబస్తు కొనసాగుతోంది. మళ్లీ ఉద్రిక్తతలకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఉండేందుకు గ్రామాల్లోకి అనుమానితుల కదలికలు, రాకపోకలపై పోలీసులు పటిష్ట నిఘాను ఏర్పాటు చేశారు. మరోవైపు గ్రామాల్లో అన్నికులాల పెద్దలతో మాట్లాడుతూ శాంతియుత వాతావరణం నెలకొనేలా చర్యలు చేపట్టారు. ప్రజలు పెద్ద సంఖ్యలో గుమిగూడకుండా చర్యలు తీసుకుంటున్నారు.