Begin typing your search above and press return to search.

మేం వచ్చాక కేసీఆర్‌, కేటీఆర్‌ జైలుకే !

By:  Tupaki Desk   |   2 March 2018 5:37 AM GMT
మేం వచ్చాక కేసీఆర్‌, కేటీఆర్‌ జైలుకే !
X
తెలంగాణలో అధికార‌ - ప్ర‌తిప‌క్షాల మ‌ధ్య మాట‌ల యుద్ధం జోరుగా సాగుతోంది. ఒక పార్టీపై మ‌రో పార్టీ నేత‌లు విరుచుకుప‌డుతుండ‌టం..స‌వాల్లు విసురుకోవ‌డం సర్వ‌సాధార‌ణం అయిపోయింది. ఈ క్ర‌మంలో తాజాగా పార్టీ నేత‌ల‌ను జైలు పాలు చేయ‌డ‌మనే స‌వాల్ తెర‌మీద‌కు వ‌చ్చింది. త‌న‌దైన శైలిలో సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసే కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కుడు - సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మ‌రోమారు అదే రీతిలో రియాక్ట్ అయ్యారు. తెలంగాణ‌లో అవినీతి పాల‌న సాగుతోంద‌ని కమీషన్ల పేరిట వేల కోట్ల రూపాయలు దండుకుంటున్న దోపిడీ దొంగలు కేసీఆర్‌ - కేటీఆర్‌ అని ఆరోపించారు. కాంగ్రెస్‌ అధికారంలోకొచ్చాక కేసీఆర్‌ - కేటీఆర్‌ లు జైలుకు పోక తప్పదని అన్నారు. టీఆర్‌ ఎస్‌ ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై రానున్న శాసనసభ సమావేశాల్లో ఆధారాలతో నిలదీస్తామన్నారు.

మిషన్‌ భగీరథ పథకాన్ని నలుగురు ఆంధ్రా కాంట్రాక్టర్లకు కట్టబెట్టి వేల కోట్ల రూపాయల కమీషన్‌ తీసుకున్నారని కోమ‌టిరెడ్డి విమర్శించారు. కేవలం రూ.500 కోట్లతో జరిగే ఆప్టికల్‌ కేబుల్‌ కాంట్రాక్టును రూ.5 వేల కోట్లకు కేటీఆర్‌ బామ్మర్దికి అప్పజెప్పారన్నారు. దీనిలోనే ఇంటింటికీ కేబుల్‌ ఇచ్చే కాంట్రాక్టు అప్పగించారన్నారు. కేటీఆర్‌ అవినీతి కుంభకోణాలు - జీడిమెట్ల - మియాపూర్‌ స్కాంలను అసెంబ్లీలో ప్రస్తావిస్తామని, ఈ విషయంపై ఈడీలకు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. దొంగ పాస్‌ పోర్టు - నకిలీ నోట్ల కేసులో ఉన్న నీచ చరిత్ర సీఎం కేసీఆర్‌ ది అని విమర్శించారు. పెద్దవారిని తిడితే తమ పార్టీ గౌరవం పెరుగుతుందనే ఉద్దేశంతోనే కేటీఆర్‌ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని, నోటిని అదుపులో ఉంచుకోవాలని హెచ్చరించారు. ఐటీ - పురపాలక శాఖా మంత్రిగా వ్యవహరిస్తున్న కేటీఆర్‌ కు ఆ శాఖలపై కనీస అవగాహన లేదని ఎద్దేవా చేశారు. నెలకు రెండుసార్లు విదేశాలకు పోతూ - వారానికి మూడుసార్లు ఢిల్లీకెళుతూ ఏదో ఘనకార్యం చేసినట్టు అవార్డు తీసుకుంటున్నారని విమర్శించారు. బెంగళూరు - హైదరాబాద్‌ లో కూడబెట్టు కుంటున్న అక్రమ సొమ్మంతా తాము అధికారంలోకొచ్చాక బయటకు తీస్తామన్నారు.

మంత్రి జగదీశ్‌ రెడ్డి నాగారంలోని మూడు హత్య కేసుల్లో నిందితుడిగా ఉన్న విషయం ప్రజలందరికీ తెలుసని కోమ‌టిరెడ్డి వ్యాఖ్యానించారు. రౌడీ చరిత్ర కల్గిన ఎమ్మెల్యేలు - మంత్రులతో కలిసి తిరగడం ప్రజలు గమనిస్తున్నారన్నారు. రానున్న ఎన్నికల్లో మంత్రికి డిపాజిట్‌ కూడా దక్కదన్నారు. మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ బొడ్డుపల్లి లకిë భర్త శ్రీనివాస్‌ హత్య కేసులో త్వరలోనే ఎమ్మెల్యేలు - మంత్రులు జైలుకు పోతారని ఆయ‌న జోస్యం చెప్పారు.