Begin typing your search above and press return to search.

కోమ‌టిరెడ్డిని మ‌ళ్లీ ఫోన్ చేయొద్ద‌ని చెప్పిన కేసీఆర్‌

By:  Tupaki Desk   |   11 Oct 2017 4:42 PM GMT
కోమ‌టిరెడ్డిని మ‌ళ్లీ ఫోన్ చేయొద్ద‌ని చెప్పిన కేసీఆర్‌
X
కాంగ్రెస్ ఫైర్‌ బ్రాండ్ ఎమ్మెల్యేల - సీఎల్పీ ఉప‌నేత కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డికి తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ వ‌ద్ద ప‌రాభ‌వం ఎదుర‌యిందా? ఏకంగా ఆయ‌న్ను ఫోన్ చేయ‌వ‌ద్ద‌ని కేసీఆర్ ఆదేశించారా? గ‌తంలో గంట‌ల త‌ర‌బడి మాట్లాడిన ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఇప్పుడు కోమ‌టిరెడ్డిని పూర్తిగా సైడ్ చేసేశారా? అంటే అవుననే స్వ‌యంగా చెప్తున్నారు కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి. ఓ మీడియా సంస్థ‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంట‌ర్వ్యూలో కోమ‌ట‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సీఎం కేసీఆర్‌ పై తీవ్ర అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. స్వ‌రాష్ట్ర ప‌రిపాల‌న‌తో త‌మ‌కు న్యాయం జ‌రుగుతుంద‌ని భావించార‌ని అయితే ప్ర‌జల సమస్యల పరిష్కారం పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంద‌ని కోమ‌టిరెడ్డి ఆరోపించారు.

తెలంగాణ స‌ర్కారు తీరుపై అన్నివ‌ర్గాల్లో అసంతృప్తి ఉంద‌ని కోమ‌టిరెడ్డి చెప్పారు. తెలంగాణ ప్రజలు గొర్రెలు - బర్రెలు - చేపలు - చీరలు కోరడం లేదని నిధులు - నీళ్లు నియామకాల పేరుతో అధికారంలోకి వచ్చినందుకు ఉద్యోగాలు కోరుతున్నారని కోమ‌టిరెడ్డి చెప్పారు. బలిదానాలతో ఏర్పడిన తెలంగాణలో మూడెకరాల భూమి కోసం దళితులు బలిదానాలు చేసుకోవాల్సి రావడం కేసీఆర్‌ ప్రభుత్వానికే సిగ్గు చేటని కోమ‌టిరెడ్డి మండిప‌డ్డారు. 30 వేల టీచర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ డీఎస్సీ వేయకుండా నిరుద్యోగులను ముఖ్యమంత్రి దగా చేశాడని కోమ‌టిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రుణమాఫీ కింద విడుదల చేసిన డబ్బు రైతుల అప్పుల వడ్డీలకే సరిపోయిందన్నారు. స‌మ‌స్యలు ప్ర‌స్తావించేందుకు ముఖ్య‌మంత్రి కేసీఆర్ అపాయింట్‌ మెంట్ కోరితే నిరాశే ఎదుర‌వుతోంద‌ని కోమ‌టిరెడ్డి ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ప్రభుత్వాన్ని ఏర్పర్చిన కొత్తలో కేసీఆర్‌ ని కలిసి దాదాపు 2 గంటలు మాట్లాడి జిల్లాకు మెడికల్‌ కాలేజీ కావాలని - మరిన్ని అవసరాలను చెబితే అన్నీ మంజూరు చేస్తానని హామీ ఇచ్చారని కోమ‌టిరెడ్డి గుర్తు చేసుకున్నారు. తర్వాత నియోజకవర్గంలో పెండింగులో ఉన్న పనుల కోసం వారం రోజులపాటు ప్రతిరోజూ ఫోన్‌ చేసినా కేసీఆర్‌ ఫోనెత్తలేదని, వారం తర్వాత నేను మళ్లీ ఫోన్‌ చేస్తే ‘మీతో మాట్లాడనని సీఎం చెప్పారండీ - మీరిక ఫోన్‌ చేయవద్దు’ అని సీఎం పేషీ నుంచి బదులిచ్చారని కోమ‌టిరెడ్డి వాపోయారు. రెండేళ్లనుంచి కేసీఆర్‌ అప్పాయింట్‌ మెంట్‌ కోసం ప్రయత్నం చేస్తూనే ఉన్నానని కోమ‌టిరెడ్డి తెలిపారు.

ప్రజల కష్టాలను చూడటానికి ముఖ్యమంత్రి ప్రగతి భవన్ వీడి ప్రజల్లోకి రావాలని కోమ‌టిరెడ్డి డిమాండ్‌ చేశారు. ఈ విష‌యంలో దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి ఆద‌ర్శ‌ప్రాయుడైన సీఎం అని కొనియాడారు. సంక్షేమ కార్యక్రమాలను ప్రతిరోజూ సచివాలయంలో ఉదయం 10 గంటలనుంచి గడియారం చూసుకుని మరీ పర్యవేక్షించిన నేత వైఎస్సార్‌ అని ప్రశంసించారు. ఉదయం ఎనిమిదిన్నర నుంచి తొమ్మిదిన్నర వరకు రోజుకు 5 వేల మందిని కలుస్తూ వచ్చిన అరుదైన నాయకుడు వైఎస్సార్‌ కాగా - కేసీఆర్‌ ఈ మూడున్నరేళ్ల కాలంలో 500 మందిని కూడా కలిసి ఉండరని, తెలంగాణలో మళ్లీ గడీలు గుర్తుకొస్తున్నాయని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడేళ్ల కాలంలో ప్రజలకు చేసిన అభివృద్ధి ఏమి లేదని కోమ‌టిరెడ్డి అన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.