Begin typing your search above and press return to search.

వీడియో వైరల్: జాతీయ విపత్తుగా ప్రకటించాలన్న కోమటిరెడ్డి

By:  Tupaki Desk   |   14 Oct 2020 11:01 PM IST
వీడియో వైరల్: జాతీయ విపత్తుగా ప్రకటించాలన్న కోమటిరెడ్డి
X
తెలంగాణలో వర్ష బీభత్సాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని కోరుతూ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రధానికి లేఖ రాశారు. తక్షణ సహాయం కింద రూ.2000 కోట్లు ఇవ్వాలని ఆయన కోరారు. తెలంగాణ వర్ష భీభత్సాన్ని ప్రధానికి తెలియజేస్తూ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రధానికి ట్వీట్ చేస్తూ ప్రత్యేకంగా లేఖను కూడా పంపారు.

తెలంగాణలో కురిసిన భారీ వర్షాలకు హైదరాబాద్ నిండా మునిగిపోయింది.జన జీవనం అస్తవ్యస్తమైంది. చేతికొచ్చిన పంట నీట మునిగింది. ఈ విషయంలో తక్షణమే ప్రధాని నరేంద్రమోడీ స్పందించి తెలంగాణలో వర్ష బీభత్సంపై ఏరియల్ సర్వే నిర్వహించాలని కోరారు. తెలంగాణకు తక్షణ సాయం కింద రూ.2వేల కోట్ల ప్యాకేజీ ప్రకటించాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డి డిమాండ్ చేశారు.

చేతికొచ్చిన వరి, పత్తి సహా అన్ని పంటలు నీటిలో మునిగిపోయాయని రైతులు ఆవేదన చెందుతున్నట్టు తెలిపారు. సీఎం కేసీఆర్ వర్ష బీభత్సంపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఎంపీ కోమటిరెడ్డి ట్విట్టర్ లో ఆరోపించారు. రాజకీయాలపై దృష్టిపెట్టి భారీ వర్షాలను.. వరద బీభత్సంలో ప్రజల కష్టాలను పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు.

తెలంగాణలో ప్రస్తుత పరిస్థితిని చూస్తుంటే ఇది ఖచ్చితంగా జాతీయ విపత్తుగా ప్రకటించాల్సిన అవసరం ఎంతైనా ఉందని కోమటిరెడ్డి ప్రధానికి ట్వీట్ చేశారు. ఈ క్రమంలోనే ఆయన పలు వీడియోలను కూడా కోమటిరెడ్డి షేర్ చేశారు.