Begin typing your search above and press return to search.

కేటీఆర్ అలా ఉండ‌టం అదృష్టం..కోమ‌టిరెడ్డి సంచ‌ల‌నం

By:  Tupaki Desk   |   1 Nov 2019 2:48 PM GMT
కేటీఆర్ అలా ఉండ‌టం అదృష్టం..కోమ‌టిరెడ్డి సంచ‌ల‌నం
X
గ‌త కొద్దికాలంగా అనూహ్య‌మైన కామెంట్ల‌తో వార్త‌ల్లో నిలుస్తున్న కోమ‌టిరెడ్డి బ్ర‌దర్స్‌ లో ఒక‌రైన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి తాజాగా సంచ‌ల‌న కామెంట్లు చేశారు. తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న‌యుడు - మంత్రి కేటీఆర్‌ ను ఆకాశానికి ఎత్తేశారు. కేటీఆర్‌ పరిశ్రమల శాఖ మంత్రి కావడం మన అదృష్టమ‌ని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్ర‌శంసించారు. యాదాద్రి భువనగిరి జిల్లా దండుమల్కాపూర్‌ లో టీఎస్ ఐఐసీ-టీఐఎఫ్-ఎమ్మెస్ ఎంఈ-గ్రీన్‌ ఇండస్ట్రియల్‌ పార్కు ప్రారంభోత్స‌వం సంద‌ర్భంగా ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది.

మునుగోడు నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోకి వ‌చ్చే దండుమ‌ల్కాపూర్‌ లో గ్రీన్‌ ఇండస్ట్రియల్‌ పార్కును మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి మాట్లాడుతూ కేటీఆర్‌ లాంటి అనుభవనం - అవగాహన ఉన్న వ్యక్తి పరిశ్రమల మంత్రి కావడం తెలంగాణ ప్రజల అదృష్టమన్నారు. కేటీఆర్‌ కు మనుగోడు ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. ``తెలంగాణ వస్తే మా బతుకులు బాగుపడ‌తాయని - మా జీవితాల్లో వెలుగు నింపుతయని ఎంతో ఆశతో కొన్ని లక్షల మంది యువకులు ఎదురుచూస్తున్నారు. అలాంటి యువకుల కోసం - వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు చేపట్టిన కార్యక్రమం ఇది. కేటీఆర్‌ లాంటి అనుభవం - అవగాహన ఉన్న వ్యక్తి పరిశ్రమల శాఖ మంత్రి కావడం మన అదృష్టం` అని రాజగోపాల్‌ రెడ్డి అన్నారు.

అంతర్జాతీయ ప్రమాణాలు - అత్యాధునిక మౌలిక వసతులతో గ్రీన్‌ ఇండస్ట్రియల్‌ పార్క్‌ లో పరిశ్రమలు పెట్టేందుకు వస్తున్న వారికి కోమ‌టిరెడ్డి ధన్యవాదాలు తెలియజేశారు.పారిశ్రామిక వేత్తలందరినీ ఈ వేదిక ద్వారా ఆహ్వానిస్తున్నామన్నారు. భవిష్యత్‌ లో ఈ పార్క్‌ 2500 ఎకరాలకు విస్తరించేందుకు మంత్రి కేటీఆర్‌ కృషి చేయాలని ఆయన కోరారు. ప్రజలు టీఆర్ ఎస్‌ ను నమ్ముతున్నరు కాబట్టే రెండోసారి అధికారం కట్టబెట్టారని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విశ్లేషించారు. కాగా - కాంగ్రెస్ త‌ర‌ఫున ఎమ్మెల్యేగా గెలిచిన కోమ‌టిరెడ్డి...గ‌త కొద్దికాలం క్రితం బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధంచేసుకున్న సంగ‌తి తెలిసిందే. అలాంటి త‌రుణంలో....తాజాగా ఆయ‌న తిరిగి గులాబీ యువ‌నేత‌ పై ప్ర‌శంస‌లు కురిపించ‌డం వెనుక లెక్కేంట‌ని...ప‌లువురు చ‌ర్చించుకుంటున్నారు.