Begin typing your search above and press return to search.

మద్దతు కోసం బాబుతో భేటీ ... రాజగోపాల్ మునిగినట్లేనా...?

By:  Tupaki Desk   |   17 Oct 2022 12:30 AM GMT
మద్దతు కోసం బాబుతో భేటీ ... రాజగోపాల్ మునిగినట్లేనా...?
X
మునుగోడు ఉప ఎన్నిక వచ్చే నెలలో జరగనుంది. ప్రధానంగా మూడు పార్టీల మధ్య ముమ్మరంగా పోరు సాగనుంది. అధికార టీయారెస్ జోరు చేస్తూంటే కాంగ్రెస్ కూడా సత్తా చూపించడానికి రెడీగా ఉంది. బీజేపీ తరఫున బరిలో ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ కి మునుగోడులో సీన్ ఏమిటీ అర్ధం కావడంలేదు అంటున్నారు. ఆయన ఏమనుకుని రాజీనామా చేశారో కానీ ఆయన రాజీనామాకు అసలు ఈ కోశానా అర్ధం లేదని జనాలు భావిస్తున్నారు అనే అంటున్నారు. కేవలం బీజేపీకి సార్వత్రిక ఎన్నికల ముంగిట హైప్ క్రియేట్ చేయడానికి రాజగోపాల్ రాజీనామా చేసి ఉప ఎన్నికలను రప్పించారని అందరికీ అర్ధమైంది.

దాంతో మునుగోడు ఫైట్ లో బీజేపీ మూడవ ప్లేస్ లోకి జారిపోయింది అని అంటున్నారు. దాంతో అంతకంతకు రాజగోపాల్ లో టెన్షన్ పెరిగిపోతోందిట. తనకు మద్దతుగా ఉండాలని పోటీ చేయని పార్టీలను ఆయన అర్ధిస్తున్నారని టాక్. ఈ నేపధ్యంలో అనూహ్యంగా రాజగోపాల్ నిన్న చంద్రబాబుని ఆయన నివాసంలో కలసి రహస్య చర్చలు జరిపారన్న వార్తలు మాత్రం ఇపుడు పెద్ద ఎత్తున ప్రచారంలో ఉన్నాయి. అలాగే రాజ్‌గోపాల్ రెడ్డి తనకు మద్దతు ఇవ్వాలని చంద్రబాబును అభ్యర్థించినట్లుగా కూడా పేర్కొన్నారు.

ఒక వేళ అదే కనుక నిజమైతే రాజగోపాల్ రెడ్డి విజయావకాశాలు మరింతగా దెబ్బ తింటాయని అంటున్నారు. ఒక విధంగా అది ఆత్మహత్యా సదృశ్యమని చెబుతున్నారు. మునుగోడులో చూస్తే టైట్ ఫైట్ నడుస్తోంది. టీయారెస్ పక్కా వ్యూహాలతో ముందుకు సాగుతోంది. ఇక టీడీపీలో కీలక నేతగా ఎదిగిన రేవంత్ రెడ్డికి ఆ పార్టీతో మంచి రిలేషన్స్ ఉన్నాయి. ఆయన ఇపుడు కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. ఆయన తన పరిచయాలతో తెలివిగా కాంగ్రెస్ ని టీడీపీ ఓట్లు మళ్ళించుకోగలరని అంటున్నారు.

ఇంకో వైపు చూస్తే టీడీపీ మద్దతు ఎవరు తీసుకున్నా అది లోపాయి కారిగా ఉండాలి తప్ప బాహాటం కాకూడదని, దాని వల్ల మునుగోడు ఉప ఎన్నికలో పరిణామాలు దారుణంగా మారిపోతాయని అంటున్నారు. 2018లో జరిగిన తెలంగాణా ఎన్నికల్లో కాంగ్రెస్ టీడీపీ బంధాన్ని కూడా గుర్తు చేస్తున్నారు. ఆ విధమైన పరాభవం జరగకుండా చూడాలి అంటే తెర చాటుగానే మద్దతు తీసుకోవడం మంచిది అంటున్నారు.

కనేఎ అతి ఉత్సాహంలో లేక తనదే కరెక్ట్ వ్యూహం అనుకున్నారో ఏమో కానీ రాజగోపాల్ రెడ్డి ఏకంగా చంద్రబాబుని స్వయంగా కలసి మద్దతు కోరారని వార్తలు వస్తున్నాయి. అవే కనుక నిజమైతే మాత్రం ఆయన విజయావకాశాల మీద అతి పెద్ద దెబ్బ పడుతుందని, దానిని చాకచక్యంగా ఉపయోగించుకునే టాలెంట్ టీయారెస్ కి ఉంది అని అంటున్నారు. అయితే రాజ్‌గోపాల్‌ రెడ్డి ప్రతిపాదనకు చంద్రబాబు నాయుడు ఏ విధంగా స్పందించారో తెలియడంలేదు అని అంటున్నారు.

ఇదిలా ఉంటే కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని టీ-పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి టీడీపీ మునుగోడు క్యాడర్‌ను కోరారు, మరోవైపు పోటీ చేయని పార్టీలు తమకు మద్దతు ఇవ్వాలని బీజేపీ కోరుతోంది. మరో వైపు మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ, టీడీపీలు రహస్య ఒప్పందం చేసుకున్నాయని ఆరోపిస్తూ టీఆర్‌ఎస్‌ దీన్ని ప్రజల్లోకి గట్టిగా వెళ్లే ప్రయత్నం చేస్తోంది. దానికి మరింత బలం చేకూరేలా రాజగోపాల్ రెడ్డి కనుక బాబుని మీట్ అయితే మాత్రం కచ్చితంగా ఇబ్బందే అవుతుంది అంటున్నారు.

టీయారెస్ అయితే బీజేపీకి ఓటు వేసే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తోంది. మరి ఇవన్నీ ఇలా జరుగుతున్న వేళ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ సమయంలో చంద్రబాబును కలవడం ఆత్మహత్యాసదృశ్యమని అంటున్నారు. ఆయన కనుక అలా చేస్తే కనుక అది పూర్తిగా ఆయన విజయావకాశాలకు వ్యతిరేకంగా పనిచేస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

తెలంగాణతో సహా మునుగోడు ప్రజలలో తెలంగాణ టిడిపి మీద ఇప్పటికీ ఉన్న అభిప్రాయాన్ని దృష్టిలో ఉంచుకుని కనుక ఆలోచిస్తే రాజ్‌గోపాల్ చర్యను పెద్ద తప్పుగానే చూస్తున్నారుట. ఆయన బాబుతో భేటీ అన్నది నిజమైతే మాత్రం అందుకు భారీ రాజకీయ మూల్యమే చెల్లించాల్సి ఉంటుందని అంటున్నారు.